14. పదునాల్గవ అధ్యాయము
భీష్ముని పాటును గురించి ధృతరాష్ట్రుడు సంజయుని ప్రశ్నించుట.
ధృతరాష్ట్ర ఉవాచ
కథం కురూణామృషభః హతో భీష్మః శిఖండినా ।
కథం రథాత్ న్యపతత్ పితా మే వాసవోపమః ॥ 1
ధృతరాష్ట్రుడిలా అన్నాడు.
"కురుపుంగవు డయిన భీష్ముడు శిఖండి చేత ఎలా పడిపోయాడు? ఇంద్రతుల్యుడయిన నా తండ్రి రథం మీది నుండి ఎలా పడిపోయాడు? (1)
కథమాచక్ష్వ మే యోధాః హీనా భీష్మేణ సంజయ ।
బలినా దేవకల్పేన గుర్వర్థే బ్రహ్మచారిణా ॥ 2
సంజయా! తండ్రి కోసం ఆ జన్మబ్రహ్మచారి అయిన వాడు భీష్ముడు. దేవసమానమైన బలం గల భీష్ముడు లేకుండా మా యోధులు ఎలా నిలవగలిగారు? (2)
తస్మిన్ హతే మహాప్రాజ్ఞే మహేష్వాసే మహాబలే ।
మహాసత్త్వే నరవ్యాఘ్రే కిము ఆసీన్మనస్తవ ॥ 3
మహాజ్ఞాని మహాధన్వి, మహాబలి, మహాధీరుడు అయిన నరోత్తముడు పడిపోతే నీ మనస్సుకు ఏమనిపించింది? (3)
ఆర్తిం పరమావిశతి మనః శంససి మే హతమ్ ।
కురూణామృషభం వీరమ్ అకంపం పురుషర్షభమ్ ॥ 4
యుద్ధంలో ఎవరూ కదిలింపలేని పురుష పుంగవుడు, కురుశ్రేష్ఠుడు, వీరుడు అయిన భీష్ముడు పడిపోయాడని నీవు చెపుతున్నపుడు నా మనస్సును ఎంతో బాధ ఆవేశించింది. (4)
కే తం యాంతమనుప్రాప్తాః కే వాస్యాసన్ పురోగమాః ।
కేతిష్ఠన్ కే న్యవర్తంత కేఽన్వవర్తంత సంజయ ॥ 5
సంజయా! యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన వెంట ఎవరు వెళ్లారు? ముందు ఎవరున్నారు? ఎవరు ఎదుట నిలిచారు? ఎవరు పారిపోయారు? ఎవరు అనుసరించారు? (5)
కే శూరా రథశార్దూలమ్ అద్భుతం క్షత్రియర్షభమ్ ।
తథానీకం గాహమానం సహసా పృష్ఠతోఽన్వయుః ॥ 6
రథికోత్తముడు, క్షత్రియ పుంగవుడు అయిన భీష్ముడు శత్రుసేనలో ప్రవేశించేటప్పుడు ఆయన వెనుక ఎవరెవరు వెళ్లారు? (6)
యస్తమోఽర్క ఇవాపోహన్ పరసైన్యమమిత్రహా ।
సహస్రరశ్మిప్రతిమః పరేషాం భయమాదధత్ ॥ 7
సూర్యుడు చీకట్లను పారద్రోలినట్లు శత్రు సైన్య సంహారం చేస్తూ సూర్యసమానుడై తాను శత్రువులకు భయం కలిగించేవాడు. (7)
అకరోద్ దుష్కరం కర్మ రణే పాండుసుతేషు యః ।
గ్రసమానమనీకాని య ఏనం పర్యవారయన్ ॥ 8
కృతినం తం దురాధర్షం సంజయాస్య త్వమంతికే ।
కథం శాంతవనం యుద్ధే పాండవాః ప్రత్యవారయన్ ॥ 9
ఆతడు యుద్ధంలో పాండు కుమారుల మీద దుష్కరంగా పోరాడేవాడు. నిరంతరంగా సేనను సంహరించేవాడు. ఆ భీష్ముని ఎవరు అడ్డగించారు? నీ వక్కడే ఉన్నావుగా సంజయా! అసలు పాండవులు యుద్ధంలో భీష్ముని ఎలా నివారింపగలిగారు? (8,9)
నికృంతంతమనీకాని శరదంష్ట్రం మనస్వినమ్ ।
చాపవ్యాత్తాననం ఘోరమ్ అసిజిహ్వం దురాసదమ్ ॥ 10
అనర్హం పురుషవ్యాఘ్రం హ్రీమంతమపరాజితమ్ ।
పాతయామాస కౌంతేయః కథం తమజితం యుధి ॥ 11
బాణాలనే కోరలతో, ధనుస్సనే తెరిచిన నోటితో, కత్తి అనే నాలుకతో శత్రుసైన్యాన్ని నరకి పారేసేవాడు. అంత భయంకరుడయిన ఆ పురుషసింహుని అర్జునుడు ఎలా పడగొట్టాడు? భీష్ముడు అపజయం పొందనర్హుడు కాడు. అతడెన్నడూ పరాజయం ఎరుగడు. (10,11)
ఉగ్రధన్వానముగ్రేఘం వర్తమానం రథోత్తమే ।
పరేషాముత్తమాంగాని ప్రచిన్వంతమథేషుభిః ॥ 12
భీష్ముడు రథం మీద నిలిచి ధనుర్బాణాలు దాల్చి, శత్రువుల శిరస్సులను బాణాలతో త్రుంచి వేసేవాడు. (12)
పాండవానాం మహత్ సైన్యం యం దృష్ట్వోద్యతమాహవే ।
కాలాగ్నిమివ దుర్ధర్షం సమచేష్టత నిత్యశః ॥ 13
యుద్ధ సన్నద్ధుడై ప్రలయాగ్నివలె నిలిచిన భీష్ముని చూసి పాండవుల సేన ఎప్పుడూ గడగడలాడి పోయేది. (13)
పరికృష్య స సేనాం తు దశరాత్రమనీకహా ।
జగామాస్తమివాదిత్యః కృత్వా కర్మ సుదుష్కరమ్ ॥ 14
అటువంటి భీష్ముడు పది రోజులు యుద్ధం చేసి, శత్రుసేనను పరితపింపజేసి, సుదుష్కరమైన కృత్యాలు చేసి, ఆదిత్యుని వలె అస్తమిస్తున్నాడు. (14)
యః స శక్ర ఇవాక్షయ్యం వర్షం శరమయం క్షిపన్ ।
జఘాన యుధి యోధానామ్ అర్బుదం దశభిర్దినైః ॥ 15
స శేతే నిహతో భూమౌ వాతభగ్న ఇవ ద్రుమః ।
మమ దుర్మంత్రితేనాజౌ యథా నార్హతి భారతః ॥ 16
ఆయన ఇంద్రుని వలె బాణాల వర్షం కురిపించి, పది రోజుల్లో పదికోట్ల సైనికులను చంపాడు. అటువంటివాడు నా దురాలోచనతో యుద్ధంలో దెబ్బతిని పెనుగాలికి విరిగిన మహావృక్షం వలె నేల మీద పడి ఉన్నాడు. అది ఆయనకు తగినది కాదు. (15,16)
కథం శాంతవనం దృష్ట్వా పాండవానామనీకినీ ।
ప్రహర్తుమశకత్ తత్ర భీష్మం భీమపరాక్రమమ్ ॥ 17
భీకరపరాక్రమ శాలి అయిన భీష్ముని తమ ఎదుట చూసి, పాండవసేన ఆయనను ఎలా కొట్ట గలిగింద్? (17)
కథం భీష్మేణ సంగ్రామం ప్రాకుర్వన్ పాండునందనాః ।
కథం చ నాజయద్ భీష్మః ద్రోణే జీవతి సంజయ ॥ 18
సంజయా! అసలు భీష్మునితో పాండుకుమారులు ఎలా యుద్ధం చేయగలిగారు? అందులో ద్రోణుడు బ్రతికి ఉండగానే భీష్ముడు జయింపలేకపోవడమేమిటి? (18)
కృపే సంనిహితే తత్ర భరద్వాజాత్మజే తథా ।
భీష్మః ప్రహరతాం శ్రేష్ఠః కథం స నిధనం గతః ॥ 19
అక్కడ దగ్గరలో కృపాచార్యుడు, ద్రోణుడూ ఉండగా యోధాగ్రణి అయిన భీష్ముడు ఎలా పడిపోయాడు? (19)
కథం చాతిరథస్తేన పాంచాల్యేన శిఖండినా ।
భీష్మో వినిహతో యుద్ధే దేవైరపి దురాసదః ॥ 20
భీష్ముని దేవతలు కూడ సమీపించలేరు కదా. అంతటి అతిరథుని శిఖండి ఎలా పడగొట్టగలిగాడు? (20)
యః స్పర్ధతే రణే నిత్యం జామదగ్న్యం మహాబలమ్ ।
అజితం జామదగ్న్యేన శక్రతుల్యపరాక్రమమ్ ॥ 21
తం హతం సమరే భీష్మం మహారథకులోదితమ్ ।
సంజయాచక్ష్వ మే వీరం యేన శర్మ న విద్మహే ॥ 22
ఆయన మహాబలుడూ ఇంద్ర సమాన పరాక్రముడూ అయిన పరశురామునితో యుద్ధాన్ని వాంఛించేవాడు. మహారథికులలో ఒకడైన భీష్ముడు ఎలా పడిపోయాడు? సంజయా! చెప్పు. దీనితో నాకు మనశ్శాంతి లేకుండా పోతోంది. (21,22)
మామకాః కే మహేష్వాసాః నాజహుః సంజయాచ్యుతమ్ ।
దుర్యోధనసమాదిష్టాః కే వీరాః పర్యవారయన్ ॥ 23
ఆయనకు సాయపడటానికి మనవారెవరూ వెళ్లలేదా? దుర్యోధనుడు ఏ వీరులను పంపాడు? (23)
యచ్ఛిఖండిముఖాః సర్వే పాండవా భీష్మమభ్యయుః ।
కచ్చిత్ తే కురవః సర్వే నాజహుః సంజయాచ్యుతమ్ ॥ 24
శిఖండి మొదలయిన పాండవులు భీష్ముని ఎదిరించారు కదా! అపుడు కౌరవులెవరూ భీష్మునికి సాయపడలేదా? (24)
అశ్మసారమయం నూనం హృదయం సుదృఢం మమ ।
యచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రం హతం భీష్మం న దీర్యతే ॥ 25
పురుషశ్రేష్ఠుడైన భీష్ముడు పడిపోయాడన్న వార్త విని కూడా నా గుండె బ్రద్దలుకాలేదంటే నా గుండె ఇనుముతో చేసిందయి ఉంటుంది. (25)
యస్మిన్ సత్యం చ మేధా చ నీతిశ్చ భరతర్షభే ।
అప్రమేయాణి దుర్ధర్షే కథం స నిహతో యుధి ॥ 26
ఆయనలో సత్యం, మేధాశక్తి, నీతి పుష్కలంగా ఉన్నాయి. కదా! అటువంటివాడు యుద్ధంలో ఎలా పడిపోయాడు? (26)
మౌర్వీ ఘోషస్తనయిత్నుః పృషత్కపృషతో మహాన్ ।
ధనుర్హ్రాదమహాశబ్దః మహామేఘ ఇవోన్నతః ॥ 27
ఆయన యుద్ధంలో మేఘంగా ఉన్నతుడు, ధనుష్టంకారం ఉరుములు, బాణాలే వర్షంగా శత్రువుల మీద బాణవర్షం కురిపిస్తాడు. (27)
యోఽభ్యవర్షత కౌంతేయాన్ సపాంచాలాన్ ససృంజయాన్ ।
నిఘ్నన్ పరరథాన్ వీరః దానవానివ వజ్రభృత్ ॥ 28
ఇంద్రుడు దానవులపై బాణాలు ప్రయోగించేటట్లు భీష్ముడు పాండవులపై, పాంచాలురపై, సృంజయులపై బాణ ప్రయోగం చేస్తాడు. (28)
ఇష్వస్త్రసాగరం ఘోరం బాణగ్రాహం దురాసదమ్ ।
కార్ముకోర్మిణమక్షయ్యమ్ అద్వీపం చలమప్లవమ్ ॥ 29
ఆయన శస్త్రాస్త్రాలు సాగరంగా భయంకరంగా ఉంటాయి. అందులో బాణాలు మొసళ్లు. దరి చేరలేము. ధనుస్సు కెరటాలుగా ఉంటుంది. దానిలో ద్వీపాలు ఉండవు. చంచలంగా ఉంటుంది. నావలు ఏవీ ఉండవు. (29)
గదాసిమకరావాసం హయావర్తం గజాకులమ్ ।
పదాతిమత్స్యకలిలం శంఖదుందుభినిఃస్వనమ్ ॥ 30
గదలు కత్తులు అనే మొసళ్లు ఉంటాయి. గుర్రాలనే సుడిగుండాలుంటాయి నీటి ఏనుగులతో నిండి ఉంటుంది. కాల్బలం అనే చేపలతో, శంఖాలనే దుందుభుల ధ్వనితో నిండి ఉంటుంది. (30)
హయాన్ గజపదాతీంశ్చ రథాంశ్చ తరసా బహూన్ ।
నిమజ్జయంతం సమరే పరవీరాపహారిణమ్ ॥ 31
భీష్ముడు ఆ సముద్రంలో శత్రువుల రథగజ తురగ పదాతి దళాలు, అనే చతురంగ బలాలను ముంచివేసేవాడు. శత్రువుల ప్రాణాలను అపహరించేవాడు. (31)
విదహ్యమానం కోపేన తేజసా చ పరంతపమ్ ।
వేలేవ మకరావాసం కే వీరాః పర్యవారయన్ ॥ 32
భీష్ముడు తన కోపంతో, తేజస్సుతో జ్వలిస్తూ, శత్రువులను తపింపజేసే వాడు గదా! సముద్రాన్ని చెలియలి కట్ట ఆపినట్లు ఆయనను ఏ ఏ వీరులు అడ్డగించారు? (32)
భీష్మో యదకరోత్ కర్మ సమరే సంజయారిహా ।
దుర్యోధనహితార్థాయ కే తస్యాస్య పురోఽభవన్ ॥ 33
కేఽరక్షన్ దక్షిణం చక్రం భీష్మస్యామితతేజసః ।
పృష్ఠతః కే పరాన్ వీరాన్ అపాసేధన్ యతవ్రతాః ॥ 34
శత్రుహంతకుడయిన ఆతడు దుర్యోధనుని హితం కోసం యుద్ధంలో దుష్కర కృత్యాలు చేశాడు. అపుడు ఆయన ఎదుటి భాగాన ఎవరున్నారు? దక్షిణం వైపు సైన్యాన్ని ఎవరు రక్షిస్తున్నారు? వెనుకభాగాన ప్రయత్నంతో నిలిచి శత్రువీరులను పారద్రోలిన వారెవరు? (33,34)
కే పురస్తాదవర్తంత రక్షంతో భీష్మమంతికే ।
కేఽరక్షన్నుత్తరం చక్రం వీరా వీరస్య యుధ్యతః ॥ 35
ఆయనను దగ్గరుండి రక్షిస్తూ, ముందు భాగాన ఎవరున్నారు? ఆయన యుద్ధం చేస్తున్నప్పుడు ఉత్తరం వైపున ఏ ఏ వీరులున్నారు? (35)
వామే చక్రే వర్తమానాః కేఽఘ్నన్ సంజయ సృంజయాన్ ।
అగ్రతోఽగ్య్రమనీకేషు కేఽభ్యరక్షన్ దురాసదమ్ ॥ 36
సంజయా! ఎడమ ప్రక్కన చక్రాలను ఎవరు రక్షించారు? దురాసదుడైన భీష్ముని ముందుండి సేనలను ఎవరు రక్షించారు? (36)
పార్శ్వతః కేఽభ్యరక్షంత గచ్ఛంతో దుర్గమాం గతిమ్ ।
సమూహే కే పరాన్ వీరాన్ ప్రత్యయుధ్యంత సంజయ ॥ 37
సంజయా! ప్రక్కలలో రక్షిస్తూ దుర్గమ గతితో ఉండి శత్రుసేనలతో ఎవరు యుద్ధం చేశారు? (37)
రక్ష్యమాణః కథం వీరైః గోప్యమానాశ్చ తేన తే ।
దుర్జయానామనీకాని నాజయంస్తరసా యుధి ॥ 38
వీరులంతా భీష్ముని రక్షిస్తూ భీష్ముడు కూడా వారిని రక్షిస్తూ ఉంటే కూడా శత్రువులను ఎలా జయింపలేకపోయారు? (38)
సర్వలోకేశ్వరస్యేవ పరమేష్ఠిప్రజాపతేః ।
కథం ప్రహర్తుమపి తే శేకుః సంజయ పాండవాః ॥ 39
సంజయా! భీష్ముడు బ్రహ్మదేవునివలె సర్వలోకేశ్వరుడు గదా! ఆ పాండవులు ఆయనను ఎలా కొట్టగలిగారు? (39)
యస్మిన్ ద్వీపే సమాశ్వస్య యుధ్యంతే కురవః పరైః ।
తం నిమగ్నం నరవ్యాఘ్రం భీష్మం శంససి సంజయ ॥ 40
సంజయా! ద్వీపం వంటి భీష్ముని ఆశ్రయించి, కురువంశస్థులంతా పరులతో నిర్భయులై యుద్ధం చేస్తున్నారు. ఆ భీష్ముని గురించే నీవు చెపుతున్నావు కదా! (40)
యస్య వీర్యం సమాశ్రిత్య మమ పుత్రో బృహద్బలః ।
న పాండవానగణయత్ కథం స నిహతః పరైః ॥ 41
ఆయన పరాక్రమాన్ని ఆశ్రయించి, నా పుత్రుడు పాండవులను లెక్కచేయలేదు. ఆయన ఎలా పడిపోయాడు? (41)
యః పురా విబుధైః సర్వైః సహాయే యుద్ధదుర్మదః ।
కాంక్షితో దానవాన్ ఘ్నద్భిః పితా మమ మహావ్రతః ॥ 42
యస్మిన్ జాతే మహావీర్యే శాంతనుర్లోకవిశ్రుతః ।
శోకం దైన్యం చ దుఃఖం చ ప్రాజహాత్ పుత్రలక్ష్మణి ॥ 43
ప్రోక్తం పరాయణం ప్రాజ్ఞం స్వధర్మనిరతం శుచిమ్ ।
వేదవేదాంగతత్త్వజ్ఞం కథం శంససి మే హతమ్ ॥ 44
పూర్వం దానవులను సంహరించే దేవతలు భీష్ముని సహాయం కోరారు. మహావీరుడయిన భీష్ముని పుత్రునిగా పొంది, శాంతనుమహారాజు శోకదైన్యాలు, దుఃఖమూ విడిచిపెట్టాడు. బీష్ముడు జ్ఞాని. స్వధర్మ నిరతుడు. పవిత్రుడు. వేద శాస్త్ర తత్త్వాలు ఎరిగినవాడు. అతడు పడగొట్టబడ్డాడని నీ వెలా చెపుతున్నావు? (42-44)
సర్వాస్త్రవినయోపేతం శాంతం దాంతం మనస్వినమ్ ।
హతం శాంతనవం శ్రుత్వా మన్యే శేషం హతం బలమ్ ॥ 45
అన్ని అస్త్రాలు తెలిసిన వినయ శీలి, శాంతుడు, దాంతుడు, మనస్వి అయిన భీష్ముడు పడిపోయాడని విని, మిగిలిన మన బలమంతా హతమైనట్లే అనిపిస్తోంది. (45)
ధర్మాదధర్మో బలవాన్ సంప్రాప్త ఇతి మే మతిః ।
యత్ర వృద్ధం గురుం హత్వా రాజ్యమిచ్ఛంతి పాండవాః ॥ 46
ధర్మం కంటె ఇపుడు అధర్మమే బలవంత మయిందని అనుకొంటున్నాను. అందుకే వృద్ధుడయిన భీష్ముని కూల్చి పాండవులు రాజ్యం కాంక్షిస్తున్నారు. (46)
జామదగ్న్యః పురా రామః సర్వాస్త్రవిదనుత్తమః ।
అంబార్థముద్యతః సంఖ్యే భీష్మేణ యుధి నిర్జితః ॥ 47
తమింద్రసమకర్మాణం కకుదం సర్వధన్వినామ్ ।
హతం శంససి మే భీష్మం కిం ను దుఃఖమతః పరమ్ ॥ 48
పూర్వం సర్వాస్త్రవేత్త అయిన పరశురాముని అంబకోసం యుద్ధంలో భీష్ముడు జయించాడు. ఆయన ఇంద్ర సమానుడు. ధనుస్సు పట్టిన వారందరిలో శ్రేష్ఠుడు. ఆయన పడిపోయాడని ఇపుడు చెపుతున్నావు. సంజయా! ఇంతకు మించిన దుఃఖం ఏముంటుంది? (47,48)
అసకృత్ క్షత్రియవ్రాతాః సంఖ్యే యేన వినిర్జితాః ।
జామదగ్న్యేన వీరేణ పరవీరనిఘాతినా ॥ 49
న హతో యో మహాబుద్ధిః స హతోఽద్య శిఖండినా ।
ఎన్నో సార్లు క్షత్రియ సముదాయాలను పరశురాముడు యుద్ధంలో సంహరించాడు. కాని భీష్ముని సంహరింపలేకపోయాడు. ఆ భీష్ముడిపుడు శిఖండిచేత కూలిపోయాడు. (49 1/2)
తస్మాన్నూనం మహావీర్యాద్ భార్గవాద్ యుద్ధదుర్మదాత్ ॥ 50
తేజోవీర్యబలైర్భూయాన్ శిఖండీ ద్రుపదాత్మజః ।
యః శూరం కృతినం యుద్ధే సర్వశాస్త్రవిశారదమ్ ॥ 51
పరమాస్త్రవిదం వీరం జఘాన భరతర్షభమ్ ।
సంజయా! అందుచేత మహావీరుడు, యుద్ధదుర్మదుడూ అయిన పరశురాముని కంటె శిఖండియే తేజోబలపరాక్రమాలలో ఎంతో అధికుడని తోస్తోంది. ఆ ద్రుపదసుతుడు శూరుడు, సమర్థుడు, సర్వశాస్త్ర విశారదుడు, పరమాస్త్రవేత్త, వీరుడు అయిన భీష్ముని యుద్ధంలో సంహరించాడు గదా! (50,51 1/2)
కే వీరాస్తమమిత్రఘ్నన్ అన్వయుః శస్త్రసంసది ॥ 52
శంస మే తద్ తథా చాసీద్ యుద్ధం భీష్మస్య పాండవైః ।
యోషేవ హతవీరా మే సేనా పుత్రస్య సంజయ ॥ 53
ఆ మహావీరునికి యుద్ధంలో ఎవరు సాయపడ్డారు? చెప్పు. భీష్మునికి పాండవులతో ఎలా యుద్ధం జరిగింది? నా పుత్రుని సేన భర్తపోయిన స్త్రీ వలె అనిపిస్తోంది నాకు సంజయా! (52,53)
అగోపమివ చోద్భ్రాంతం గోకులం తద్ బలం మమ ।
పౌరుషం సర్వలోకస్య పరం యస్మిన్ మహాహవే ॥ 54
పరాసక్తే చ వస్తస్మిన్ కథమాసీన్మనస్తదా ।
రక్షకుడు లేని ఆవులు ఇటూ అటూ చెదరిపోయినట్లు నాసేన అంతా బెదరిపోతోంది. సర్వలోకం యొక్క పౌరుషాన్ని కూడా మించిపోయిన ఆ భీష్ముడు పడిపోయాడు. మీ మనసులన్నీ ఎలా ఉన్నాయి? (54 1/2)
జీవితేఽప్యద్య సామర్థ్యం కిమివాస్మాసు సంజయ ॥ 55
ఘాతయిత్వా మహావీర్యం పితరం లోకధార్మికమ్ ।
అగాధే సలిలే మగ్నాం నావం దృష్ట్వేవ పారగాః ॥ 56
సంజయా! ఇపుడిక మేము జీవించి ఉన్నా ఏం ప్రయోజనం ఉంది? మహావీరుడూ, లోకధార్మికుడూ అయిన తండ్రిని చంపుకొన్నాం నావ అగాధ జలంలో మునిగిపోతూంటే చూసి దుఃఖించే బాటసారుల వలె ఉన్నాం. (55,56)
భీష్మే హతే భృశం దుఃఖాత్ మన్యే శోచంతి పుత్రకాః ।
అద్రిసారమయం నూనం హృదయం మమ సంజయ ॥ 57
యచ్ఛ్రుత్వా పురుషవ్యాఘ్రం హతం భీష్మం న దీర్యతే ।
భీష్ముడు పడిపోయాక నా పుత్రులు దుఃఖంతో విలపిస్తూ ఉంటారు. భీష్ముడు పడిపోయాడని విన్నాక కూడా నా గుండె బ్రద్దలవటం లేదు. సంజయా! నిజంగా నా హృదయం రాతి హృదయమే. (57 1/2)
యస్మిన్నస్త్రాణి మేధా చ నీతిశ్చ పురుషర్షభే ॥ 58
అప్రమేయాణి దుర్ధర్షే కథం స నిహతో యుధి ।
పురుషశ్రేష్ఠుడైన ఆయనలో అస్త్రాలు, మేధాశక్తి, నీతి పుష్కలంగా ఉన్నాయి. అటువంటివాడు యుద్ధంలో ఎలా పడిపోయాడు? (58 1/2)
న చాస్త్రేణ న శౌర్యేణ తపసా మేధయా న చ ॥ 59
న ధృత్యా న పునస్త్యాగాన్ మృత్యోః కశ్చిద్ విముచ్యతే ।
అస్త్రాలు, పరాక్రమం, తపస్సు, మేధాశక్తి, ధైర్యం, త్యాగం. ఇవి ఏవీ మృత్యువు నుండి తప్పించలేవు. (59 1/2)
కాలో నూనం మహావీర్యః సర్వలోకదురత్యయః ॥ 60
యత్ర శాంతవనం భీష్మం హతం శంససి సంజయ ।
సంజయా! భీష్ముడు హతుడయ్యాడని నీవు చెపుతున్నావంటే నిజంగా కాలమే, మహాపరాక్రమం కలదనీ, లోకమంతా కలిసినా దాన్ని దాటలేమనీ అనిపిస్తోంది. (60 1/2)
పుత్రశోకాభిసంతప్తః మహద్ దుఃఖమచింతయమ్ ॥ 61
ఆశంసేఽహం పరం త్రాణం భీష్మాచ్ఛాంతనునందనాత్ ।
శాంతనుని కొడుకు వల్ల మనకు రక్షణ కలుగుతుందని ఆశించాను. ఇపుడాతని కొడుకు యొక్క శోకంతో చాలా దుఃఖిస్తున్నాను. (61 1/2)
యదాఽఽదిత్యమివాపశ్యత్ పతితం భువి సంజయ ॥ 62
దుర్యోధనః శాంతనవం కిం తదా ప్రత్యపద్యత ।
సంజయా! సూర్యునిలా నేల మీద పడి ఉన్న భీష్ముని చూసి, దురోధనుడు ఏమయ్యాడు? (62 1/2)
నాహం స్వేషాం పరేషాం వా బుద్ధ్యా సంజయ చింతయన్ ॥ 63
శేషం కించిత్ ప్రపశ్యామి ప్రత్యనీకే మహీక్షితామ్ ।
సంజయా! మనసేనలో కాని, శత్రుసేనలో కాని రాజులలో ఎవరూ ఈ యుద్ధంలో మిగలరని నాకు తోస్తోంది. (63 1/2)
దారుణః క్షత్రధర్మోఽయమ్ ఋషిభిః సంప్రదర్శితః ॥ 64
యత్ర శాంతనవం హత్వా రాజ్యమిచ్ఛంతి పాండవాః ।
క్షత్రియధర్మం చాలా కఠిన మయినదని ఋషులు చెప్పారు. ఆ క్షత్రియధర్మంలోనే నిలిచి భీష్ముని చంపి, పాండవులు రాజ్యం పొందాలనుకొంటున్నారు. (64 1/2)
వయం వా రాజ్యమిచ్ఛామః ఘాతయిత్వా మహావ్రతమ్ ॥ 65
క్షత్రధర్మే స్థితాః పార్థాః నాపరాధ్యంతి పుత్రకాః ।
ఏతదార్యేణ కర్తవ్యం కృచ్ఛ్రాస్వాపత్సు సంజయ ॥ 66
పరాక్రమః పరం శక్త్యా తత్ తు తస్మిన్ ప్రతిష్థితమ్ ।
సంజయా! లేదా మేమూ ఆయన్ను చంపుకొని అయినా రాజ్యం కోరుతున్నాం. క్షత్రియ ధర్మంలో నిలిచిన పాండవులు అపరాధం చేయటం లేదనే అనిపిస్తోంది. ఆపదల్లో భీష్ముడు చేసినట్లే ఉత్తముడు చెయ్యాలి. ఆయన శక్తికి మించి పరాక్రమం ప్రదర్శించాడు. (65,66 1/2)
అనీకాని వినిఘ్నంతం హ్రీమంతమపరాజితమ్ ॥ 67
కథం శాంతనవం తాతం పాండుపుత్రా న్యవారయన్ ।
కథం యుక్తాన్యనీకాని కథం యుద్ధం మహాత్మభిః ॥ 68
సంజయా! భీష్ముడు ఓటమి నెరుగనివాడు. ఆయన శత్రుసేనలను సంహరిస్తూ ఉంటే పాండవులు ఎలా నిలవగలిగారు? ఎలా సేనలను నిలద్రొక్కుకొన్నారు? ఎలా యుద్ధం చేశారు? (67,68)
కథం వా నిహతో భీష్మః పితా సంజయ మే పరైః ।
దుర్యోధనశ్చ కర్ణశ్చ శకునిశ్చాపి సౌబలః ॥ 69
దుఃశాసనశ్చ కితవో హతే భీష్మే కిమబ్రువన్ ।
సంజయా! నా తండ్రి భీష్ముడు శత్రువులచే ఎలా పడగొట్ట బడ్డాడు? తరువాత దుర్యోధన, కర్ణ, శకుని, దుశ్శాసనులు ఏం మాట్లాడుకొన్నారు? (69 1/2)
యచ్ఛరీరైరుపాస్తీర్ణాం నరవారణవాజినామ్ ॥ 70
శరశక్తిమహాఖడ్గ తోమరాక్షాం మహాభయామ్ ।
ప్రావిశన్ కితవా మందాః సభాం యుద్ధదురాసదామ్ ॥ 71
ప్రాణద్యూతే ప్రతిభయే కేఽదీవ్యంత నరర్షభాః ।
సంజయా! యుద్ధభూమి ఒక ద్యూత సభ. అందులో మనుష్యులు. ఏనుగులు, గుర్రాలు, పరవబడి ఉంటాయి. బాణాలు శక్తులు, ఖడ్గాలు, తోమరాలు అనే పాచికలు వేయబడతాయి. యుద్ధం కారణంగా అది మహాభయంకరంగా ఉంటుంది. అట్టి ప్రాణ ద్యూతంలో మందమతులైన ఏ జూదరులు ప్రవేశించారు? నరశ్రేష్ఠులైన వారెవరు జూదమాడారు? (70. 71 1/2)
కే జీయంతే జితాస్తత్ర కృతలక్ష్మ్యా నిపాతితాః ॥ 72
అన్యే భీష్మాచ్ఛాంతనవాత్ తన్మమాచక్ష్వ సంజయ ।
ఆ యుద్ధ ద్యూతంలో భీష్ముడు కాక ఇంకెవరు ఓడుతున్నారు? శత్రుబాణాలకు కూలిపోయారు? అంతా చెప్పు సంజయా! (72 1/2)
న హి మే శాంతిరస్తీహ శ్రుత్వా దేవవ్రతం హతమ్ ॥ 73
పితరం భీమకర్మాణం భీష్మమాహవశోభినమ్ ।
ఆర్తిం మే హృదయే రూఢాం మహతీం పుత్రహానిజామ్ ॥ 74
త్వం హి మే సర్పిషేవాగ్నిమ్ ఉద్దీపయసి సంజయ ।
సంజయా! నా తండ్రి యుద్ధంలో పడిపొయినట్లు విని నా మనసుకు శాంతిలేకుండా పోయింది. నా పుత్రులకు కలుగబోయే హానిని తలచుకొంటే చాలా బాధ కలుగుతోంది. సంజయా! నీవు మాట లనే నేతిని హోమం చేసి, నాబాధ అనే అగ్నిని ఇంకా ప్రజ్వలింపజేస్తున్నావు. (73,74 1/2)
మహాంతం భారముద్యమ్య విశ్రుతం సార్వలౌకికమ్ ॥ 75
దృష్ట్వా వినిహతం భీష్మం మన్యే శోచంతి పుత్రకాః ।
శ్రోష్యామి తాని దుఃఖాని దుర్యోధనకృతాన్యహమ్ ॥ 76
ప్రపంచ ప్రఖ్యాతుడయిన భీష్ముడు యుద్ధ భారమంతా తన భుజాల మీద మోసి, చివరకు చనిపోతే నా పుత్రులు ఎంతో దుఃఖం అనుభవించి ఉంటారు. ఆ దుఃఖాన్ని దుర్యోధనుడు ఎలా వ్యక్తం చేశాడు? చెప్పు - వింటాను. (75,76)
తస్మాన్మే సర్వమాచక్ష్వ యద్ వృత్తం తత్ర సంజయ ।
యద్ వృత్తం తత్ర సంగ్రామే మందస్యాబుద్ధిసంభవమ్ ॥ 77
అపనీతం సునీతం యత్ తన్మమాచక్ష్వ సంజయ ।
సంజయా! అక్కడ జరిగినదంతా చెప్పు. తెలివితక్కువవాడయిన నా కొడుకు కారణంగా ఆ యుద్ధంలో జరిగిన న్యాయాన్యాయాలను కూడ చెప్పు. (77 1/2)
యత్ కృతం తత్ర సంగ్రామే భీష్మేణ జయమిచ్ఛతా ॥ 78
తేజోయుక్తం కృతాస్త్రేణ శంస తచ్చాప్యశేషతః ।
అస్త్ర విద్యా విశారదుడైన భీష్ముడు విజయాసక్తితో ఏ ఏ కార్యాలు చేశాడో అన్నీ చెప్పు. (78 1/2)
తథా తదభవద్ యుద్ధం కురుపాండవసేనయోః ॥ 79
క్రమేణ యేన యస్మింశ్చ కాలే యచ్చ యథాభవత్ ॥ 80
కౌరవ పాండవ సేనలకు ఎపుడు, ఏ క్రమంలో, ఎలా యుద్ధం జరిగిందో అది అంతా చెప్పు. (79,80)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి ధృతరాష్ట్రప్రశ్నే చతుర్దశోఽధ్యాయః ॥ 14
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్రుని ప్రశ్నమను పదుగాల్గవ అధ్యాయము. (14)