15. పదునైదవ అధ్యాయము

సంజయుడు యుద్ధమును వర్ణింప మొదలిడుట.

సంజయ ఉవాచ
త్వద్యుక్తోఽయమనుప్రశ్నః మహారాజ యథార్హసి ।
న తు దుర్యోధనే దోషమ్ ఇమమాసంక్తుమర్హసి ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
"మహారాజా! నీవడిగిన ప్రశ్న నీకు తగినట్లు ఉంది. కాని దుర్యోధనుని మీదనే దోషమంతా అంటగట్ట తగదు. (1)
య ఆత్మనో దుశ్చరితాత్ అశుభం ప్రాప్నుయాన్నరః ।
ఏనసా తేన నాన్యం సః ఉపాశంకితుమర్హతి ॥ 2
తాను చేసిన తప్పుపనులకు పాపం పొందేవాడు ఆ బాధ్యతను ఇతరుల మీద మోపకూడదు. (2)
మహారాజ మనుష్యేషు నింద్యం యః సర్వమాచరేత్ ।
స వధ్యః సర్వలోకస్య నిందితాని సమాచరన్ ॥ 3
రాజా! మనుష్యులలో అన్నీ నిందింపదగిన పనులే చేసేవాడు ఆ నింద్య కార్యాల కారణంగా లోకులందరిచేత వధింపదగిన వాడే అవుతాడు.(3)
నికారో నికృతిప్రజ్ఞైః పాండవైస్తత్ప్రతీక్షయా ।
అనుభూతః సహామాత్యైః క్షాంతశ్చ సుచిరం వనే ॥ 4
తమకు మీరు చేసిన కపట కృత్యమంతా తెలిసినా పాండవులు నిన్ను చూసి (నీవు న్యాయంగా వ్యవహరిస్తావని) మంత్రులతో సహా చాలాకాలం అడవులో ఎన్నో పాట్లు పడ్డారు. (4)
హయానాం చ గజానాం చ రాజ్ఞాం చామితతేజసామ్ ।
ప్రత్యక్షం యన్మయా దృష్టం దృష్టం యోగబలేన చ ॥ 5
శృణు తత్ పృథివీపాల మా చ శోకే మనః కృథాః ।
దిష్టమేతత్ పురా నూనమ్ ఇదమేవ నరాధిప ॥ 6
రాజా! నేను రణరంగంలో గుర్రాలనూ, ఏనుగులనూ రాజవీరులను ప్రత్యక్షంగానూ, యోగబలంతోను చూసినదంతా నీకు చెపుతాను. విను. నీ మనసులో దుఃఖపడకు. నరాధిపా! ఇదంతా నిజంగా దైవ సంకల్పం అనిపిస్తోంది. (5,6)
నమస్కృత్వా పితుస్తేఽహం పారాశర్యాయ ధీమతే ।
యస్య ప్రసాదాద్ దివ్యం తత్ ప్రాప్తం జ్ఞానమనుత్తమమ్ ॥ 7
దృష్టిశ్చాతీంద్రియా రాజన్ దూరాచ్ఛ్రవణమేవ చ ।
పరచిత్తస్య విజ్ఞానమ్ అతీతానాగతస్య చ ॥ 8
వ్యుత్థితోత్పత్తి విజ్ఞానమ్ ఆకాశే చ గతిః శుభా ।
అస్త్రైరసంగో యుద్ధేషు వరదానాన్మహాత్మనః ॥ 9
శృణు మే విస్తరేణేదం విచిత్రం పరమాద్భుతమ్ ।
భరతానామభూద్ యుద్ధం యథా తల్లోమహర్షణమ్ ॥ 10
రాజా! వ్యాసమహర్షి అనుగ్రహంతో నాకు ఉత్తమ జ్ఞానం లభించింది. అతీంద్రియమైన దృష్టి లభించింది. దూరం నుండియే వినగల శక్తి, ఇతరుల మనసులలోని విషయాలను, జరిగిపోయిన, జరగవలసిన విషయాలను తెలిసికొనే విజ్ఞానమూ కలిగింది. ఆకాశంలో వెళ్లే శక్తి కూడా లభించింది. యుద్ధంలో అస్త్రాలు నాకు తగలకుండా వరం కూడా ఇచ్చాడు మహర్షి. ఆ మహర్షి, నీ తండ్రి అయిన వ్యాసమహర్షికి నమస్కరించి, భరత వంశస్థులకు జరిగిన యుద్ధం విస్తారంగా చెపుతాను. ఇది వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. చాలా అద్భుత మయునది. విచిత్ర మయినది. (7-10)
తేష్వనీకేషు యత్తేషు వ్యూఢేషు చ విధానతః ।
దుర్యోధనో మహారాజ దుఃశాసనమథాబ్రవీత్ ॥ 11
మహారాజా! శాస్త్ర విధానంగా సైన్యాలన్నీ వ్యూహాలుగా పన్ని, సన్నద్ధంగా ఉన్నాయి. అపుడు దుర్యోధనుడు దుశ్శాసనునితో ఇలా అన్నాడు. (11)
దుఃశాసన రథాస్తూర్ణం యుజ్యంతాం భీష్మరక్షిణః ।
అనీకాని చ సర్వాణి శీఘ్రం త్వమనుచోదయ ॥ 12
'దుశ్శాసనా! భీష్ముని రక్షణకోసం ఏర్పరచిన రథాల నన్నిటినీ సిద్ధం చెయ్యి. సేనలన్నిటినీ వెంటనే ప్రేరేపించు. (12)
అయం స మామభిప్రాప్తః వర్షపూగాభిచింతితః ।
పాండవానాం ససైన్యానాం కురూణాం చ సమాగమః ॥ 13
నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్న కురుపాండవ సంగ్రామం ఇపుడు వచ్చింది. (13)
నాతః కార్యతమం మన్యే రణే భీష్మస్య రక్షణాత్ ।
హన్యాద్ గుప్తో హ్యసౌ పార్థాన్ సోమకాంశ్చ ససృంజయాన్ ॥ 14
భీష్ముని రక్షణం తప్ప మనం చేయవలసిన పనిలేదు. భీష్ముడు రక్షింపబడితే ఆయన పాండవులను, సోమకులను, సృంజయులను సంహరిస్తాడు. (14)
అబ్రవీచ్చ విశుద్ధాత్మా నాహం హన్యాం శిఖండినమ్ ।
శ్రూయతే స్త్రీ హ్యసౌ పూర్వం తస్మాద్ వర్జ్యో రణే మమ ॥ 15
భీష్ముడు పూర్వం చెప్పాడు కూడ. "నేను శిఖండిని చంపను. అతడు మొదట స్త్రీగా పుట్టి తరువాత పురుషుడయ్యాడు. అందుచేత యుద్ధంలో వానిని విడిచిపెడతాను" అని. (15)
తస్మాద్ భీష్మో రక్షితవ్యః విశేషేణేతి మే మతిః ।
శిఖండినో వధే యత్తాః సర్వే తిష్ఠంతి మామకాః ॥ 16
అందుచేత ముఖ్యంగా భీష్ముని మనం రక్షించాలని నా ఊహ. మన వారంతా శిఖండిని వధించటానికి సన్నద్ధులుకండి. (16)
తథా ప్రాచ్యాః ప్రతీచ్యాశ్చ దాక్షిణాత్యోత్తరాపథాః ।
సర్వథాస్త్రేషు కుశలాః తే రక్షంతు పితామహమ్ ॥ 17
అలా తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం నుండి వచ్చిన అస్త్ర విద్యావిశారదులయిన వారంతా భీష్ముని రక్షించాలి. (17)
అరక్ష్యమాణం హి వృకః హన్యాత్ సింహం మహాబలమ్ ।
మా సింహం జంబుకేనేవ ఘాతయామః శిఖండినా ॥ 18
బలవంత మయిన సింహాన్ని రక్షణ లేకుండా ఉంటే తోడేలు కూడా చంపుతుంది. అలా తోడేలు సింహాన్ని చంపినట్లు భీష్ముని శిఖండిచేత చంపించకూడదు గదా! (18)
వామం చక్రం యుధామమ్యుః ఉత్తమౌజాశ్చ దక్షిణమ్ ।
గోప్తారౌ ఫాల్గునం ప్రాప్తౌ ఫాల్గునోపి శిఖండినః ॥ 19
అర్జునుని రథం యొక్క ఎడమచక్రాన్ని యుధామన్యుడు, కుడి చక్రాన్ని ఉత్తమౌజుడు రక్షిస్తున్నారు. అర్జునుడు శిఖండి రక్షణం చేస్తున్నాడు. (19)
సంరక్ష్యమాణః పార్థేవ భీష్మేణ చ వివర్జితః ।
యథా న హన్యాద్ గాంగేయం దుఃశ్శాసన తథా కురు ॥ 20
అందుచేత దుశ్శాసనా! భీష్ముడు వదిలివేసి, అర్జునుడు రక్షిస్తున్నా శిఖండి భీష్ముని చంపకుండా ఉండేటట్లు ప్రయత్నించు.' (20)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి దుర్యోధనదుఃశాసనసంవాదే పంచదశోఽధ్యాయః ॥ 15 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున దుర్యోధన దుశ్శాసన సంవాదమను పదునైదవ అధ్యాయము. (15)