20. ఇరువదియవ అధ్యాయము

ఉభయ సేనల స్థితి.

ధృతరాష్ట్ర ఉవాచ
సూర్యోదయే సంజయ కే ను పూర్వం
యుయుత్సవో హృష్యమాణా ఇవాసన్ ।
మామకా వా భీష్మనేత్రాః సమీపే
పాండవా వా భీమనేత్రాస్తదానీమ్ ॥ 1
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు.
"సంజయా! సూర్యోదయం అయ్యేసరికి ఎవరి సేనలు ముందు యుద్ధోత్సాహంతో నిలిచాయి? భీష్ముని నేతృత్వంలోని మా సేనలా? లేక భీముని నేతృత్వంలోని పాండవ సేనలా? (1)
కేషాం జఘన్యౌ సోమసూర్యౌ సవాయూ
కేషాం సేనాం శ్వాపదాశ్చాభషంత ।
కేషాం యూనాం ముఖవర్ణాః ప్రసన్నాః
సర్వం హ్యేతద్ బ్రూహి తత్త్వం యథావత్ ॥ 2
సూర్యచంద్రులూ వాయువూ ఎవరికి ప్రతికూలంగా ఉన్నారు? ఎవరి సేనను చూసి, క్రూరమృగాలు అరుస్తున్నాయి? ఎవరి యువకుల ముఖవర్ణాలు ప్రసన్నంగా ఉన్నాయి? ఇవన్నీ నాకు ఉన్నవి ఉన్నట్లు చెప్పు." (2)
సంజయ ఉవాచ
ఉభే సేనే తుల్యమివోపయాతే
ఉభే వ్యూహే హృష్టరూపే నరేంద్ర ।
ఉభే చిత్రే వనరాజిప్రకాశే
తథైవోభే నాగరథాశ్వపూర్ణే ॥ 3
సంజయుడు చెపుతున్నాడు.
రాజా! రెండు సేనలూ సమానంగానే వచ్చాయి. రెండు వ్యూహాలూ సమానంగానే సంతోషిస్తున్నాయి. రెండూ చిత్ర మయిన ఉద్యానవనాల్లా ప్రకాశిస్తున్నాయి. రెండూ ఏనుగులతో, రథాలతో, గుర్రాలతో నిండుగా ఉన్నాయి. (3)
ఉభే సేనే బృహత్యౌ భీమరూపే
తథైవోభే భారత దుర్విషహ్యే ।
తథైవోభే స్వర్గజయాయ సృష్టే
తథైవోభే సత్పురుషోపజుష్టే ॥ 4
రెండు సేనలూ పెద్దవే, భయంకరంగా ఉన్నాయి. రెండూ స్వర్గంకోసం సృష్టింపబడినవే. రెండూ సత్పురుషులతో నిండినవే. (4)
పశ్చాన్ముఖాః కురవో ధార్తరాష్ట్రాః
స్థితాః పార్థాః ప్రాఙ్ ముఖా యోత్స్యమానాః ।
దైత్యేంద్రసేనేవ చ కౌరవాణాం
దేవేంద్రసేనేవ చ పాండవానామ్ ॥ 5
కౌరవులు పడమర ముఖంగాను, పాండవులు తూర్పు ముఖంగాను యుద్ధానికి నిలిచారు. కౌరవసేన రాక్షసరాజు సేనవలెనూ, పాండవసేన దేవేంద్ర సేనవలెనూ ఉన్నాయి. (5)
చక్రే వాయుః పృష్ఠతః పాండవానాం
ధార్తరాష్ట్రాన్ శ్వాపదా వ్యాహరంత ।
గజేంద్రాణాం మదగంధాంశ్చ తీవ్రాన్
న సేహిరే తవ పుత్రస్య నాగాః ॥ 6
పాండవులకు అనుకూలంగా వెనుక నుండి గాలి వీచింది. కౌరవుల వైపు ముఖం పెట్టి క్రూర జంతువులు అరిచాయి. నీ పుత్రుల ఏనుగులు (పాండవ సేనలోని) మదపుటేనుగుల తీవ్ర మదగంధాన్ని సహింపలేకపోయాయి. (6)
దుర్యోధనో హస్తినం పద్మవర్ణం
సువర్ణకక్షం జాలవంతం ప్రభిన్నమ్ ।
సమాస్థితో మధ్యగతః కురూణాం
సంస్తూయమానో వందిభిర్మాగధైశ్చ ॥ 7
దుర్యోధనుడు పద్మవర్ణం కల మదపుటేనుగు మీది బంగారు అంబారీ మీద కౌరవుల మధ్య ఉన్నాడు. దానిపై బంగారు జాలరులున్నాయి. వంది మాగధులు అతనిని స్తుతిస్తున్నారు. (7)
చంద్రప్రభం శ్వేతమథాతపత్రం
సౌవర్ణస్రగ్ భ్రాజతి చోత్తమాంగే ।
తం సర్వతః శకునిః పర్వతీయైః
సార్ధం గాంధారైర్యాతి గాంధారరాజః ॥ 8
దుర్యోధనుని తలమీద చంద్రుని వంటి వెల్లగొడుగు, కంఠంలో సువర్ణహారం ప్రకాశిస్తోంది. అతని చుట్టూ శకుని పర్వతీయులతో, గాంధార వీరులతో కలిసి వెళుతున్నాడు. (8)
భీష్మఽగ్రతః సర్వసైన్యస్య వృద్ధః
శ్వేతచ్ఛత్రః శ్వేతధనుః సఖడ్గః ।
శ్వేతోష్ణీషః పాండురేణ ధ్వజేన
శ్వేతైరశ్వైః శ్వేతశైలప్రకాశైః ॥ 9
సైన్యానికంతటికీ ముందు భాగాన వృద్ధుడయిన భీష్ముడు వెల్లగొడుగు, తెల్లని ధనుస్సు, ఖడ్గమూ, తల్లని తలపాగ, తెల్లని ధ్వజమూ, తెల్లని పర్వతాల్లా ప్రకాశించే గుర్రాలతో వెళ్లుతున్నాడు. (9)
తస్య సైన్యే ధార్తరాష్ట్రాశ్చ సర్వే
బాహ్లీకానామేకదేశః శలశ్చ ।
యే చాంబష్ఠాః క్షత్రియా యే చ సింధోః
తథా సౌవీరాః పంచనదాశ్చ శూరాః ॥ 10
ఆ సైన్యంలో కౌరవులందరూ, బాహ్లీకులలో ఒక భాగం, శలుడు, అంబష్ఠులు, సౌవీరులు, సింధుదేశస్థులు, పంచనదదేశ వీరులూ ఉన్నారు. (10)
శోణైర్హయై రుక్మరథో మహాత్మా
ద్రోణో ధనుష్పాణిరదీనసత్త్వః ।
ఆస్తే గురుః ప్రాయశః సర్వరాజ్ఞాం
పశ్చాచ్చ భూమీంద్ర ఇవాభియాతి ॥ 11
వారి వెనుక ఎర్రని గుర్రాలు పూన్చిన బంగారు రథం మీద ధనుస్సు ధరించి సుమారు రాజులందరికీ గురువయిన ద్రోణుడున్నాడు. మహాసత్త్వుడయిన అతడు భూమి మీది ఇంద్రుని వలె వెళుతున్నాడు. (11)
వార్ధక్షత్రిః సర్వసైన్యస్య మధ్యే
భూరిశ్రవాః పురుమిత్రో జయశ్చ ।
శాల్వా మత్స్యాః కేకయాశ్చేతి సర్వే
గజానీకైర్భ్రాతరో యోత్స్యమానాః ॥ 12
సర్వసైన్యానికి మధ్యలో వృద్ధక్షత్రుని పుత్రుడయిన సైంధవుడు, భూరిశ్రవుడు, పురుమిత్రుడు, జయుడు, శాల్వ దేశీయుడు, మాత్స్యదేశీయులు, కేకయ రాజులు వెళుతున్నారు. కేకయ రాజుసోదరులు ఏనుగులతో యుద్ధానికి బయలుదేరారు. (12)
శారద్వతశ్చోత్తరధూర్మహాత్మా
మహేష్వాసో గౌతమశ్చిత్రయోధీ ।
శకైః కిరాతైర్యవనైః పహ్లవైశ్చ
సార్ధం చమూముత్తరతోఽభియాతి ॥ 13
మహాత్ముడయిన ధనుర్ధారియై, చిత్రంగా యుద్ధం చేసే కృపుడు గురుతరభారం వహించి, శకులు, కిరాతులు, యవనులు, పహ్లవులతో కలిసి సేనకు ఉత్తరంగా/ ఎదురువెళుతున్నాడు. (13)
మహారథైర్వృష్ణిభోజైః సుగుప్తం
సురాష్ట్రకైర్విహితైరాత్తశస్త్రైః ।
బృహద్ బలం కృతవర్మాభిగుప్తం
బలం త్వదీయం దక్షిణేనాభియాతి ॥ 14
మహారథులయిన వృష్ణి, భోజవంశీయులతో రక్షింపబడుతూ, శస్త్రధారులయిన సురాష్ట్రకులతో కృతవర్మ రక్షణలోని నీ బలం దక్షిణంగా ఎదురు వెళుతోంది. (14)
సంశప్తకానామయుతం రథానాం
మృత్యుర్జయో వార్జునస్యేతి సృష్టాః ।
యేనార్జునస్తేన రాజన్ కృతాస్త్రాః
ప్రయాతారస్తే త్రిగర్తాశ్చ శూరాః ॥ 15
రాజా! 'అర్జునుని సంహరిస్తాం లేదా అతనిచేత చస్తాం' అని పది వేల మంది సంశప్తకులూ, కృతాస్త్రులయిన త్రిగర్తులూ అర్జునునికి ఎదురుపోతున్నారు. (15)
సాగ్రం శతసహస్రం తు నాగానాం తవ భారత ।
నాగే నాగే రథశతం శతమశ్వా రథే రథే ॥ 16
నీ సేనలో లక్షకుమించిన ఏనుగులున్నాయి. ఒక్కొక్క ఏనుగు వెనుక వందేసి రథాలున్నాయి. ఒక్కొక్క రథం వెనుక వందమంది ఆశ్వికులున్నారు. (16)
అశ్వేఽశ్వే దశ ధానుష్కాః ధానుష్కే శతచర్మిణః ।
ఏవం వ్యూఢాన్యనీకాని భీష్మేణ తవ భారత ॥ 17
ప్రతీ ఆశ్వికుని వెనుక పదిమంది ధనుర్ధారులున్నారు. ప్రతీ ధనుర్ధారికి నూర్గురు పదాతులు కత్తులూ, డాలులూ దాల్చి నిలిచారు. ఇలా భీష్ముడు నీ సేనా వ్యూహం నిర్మించాడు. (17)
సంవ్యూహ్య మానుషం వ్యూహం దైవం గాంధర్వమాసురమ్ ।
దివసే దివసే ప్రాప్తే భీష్మః శాంతనవోఽగ్రణీః ॥ 18
మహారథౌఘవిపులః సముద్ర ఇవ ఘోషవాన్ ।
భీష్మేణ ధార్తరాష్ట్రాణాం వ్యూహః ప్రత్యఙ్ ముఖో యుధి ॥ 19
భీష్ముడు సైన్యాధ్యక్షుడై మానుష, దైవ, గాంధర్వ, ఆసుర వ్యూహాల్లో రోజుకొకటి రచిస్తూ ఉన్నాడు. మహారథికులు సముద్రంలా ఘోషిస్తున్నారు. భీష్ముడు పన్నిన కౌరవ వ్యూహం పశ్చిమముఖంగా నిలిచింది. (18,19)
అనంతరూపా ధ్వజినీ నరేంద్ర
భీమా త్వదీయా న తు పాండవానామ్ ।
తాం చైవ మన్యే బృహతీం దుష్ప్రధర్షాం
యస్యా నేతా కేశవశ్చార్జునశ్చ ॥ 20
రాజా! నీసేన ఎన్నో రూపాల్లో భయంకరంగా ఉంది కాని పాండవసేన అలా కాదు. అయినా పాండవ సేనయే పెద్దదై జయింపశక్యం కానట్లు నాకు కనిపిస్తోంది. ఆ సేనకు నేతలు కృష్ణార్జునులు కదా! (20)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి సైన్యవర్ణనే వింశోఽధ్యాయః ॥ 20 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున సైన్య వర్ణనమను ఇరువదవ అధ్యాయము. (20)