19. పందొమ్మిదవ అధ్యాయము
అర్జునుని వజ్రవ్యూహ నిర్మాణము - భీముని అధ్యక్షతలో సైన్యము వెడలుట.
ధృతరాష్ట్ర ఉవాచ
అక్షౌహిణ్యో దశైకా చ వ్యూఢా దృష్ట్వా యుధిష్ఠిరః ।
కథమల్పేన సైన్యేన ప్రత్యవ్యూహత పాండవః ॥ 1
యో వేద మానుషం వ్యూహం దైవం గాంధర్వమాసురమ్ ।
కథం భీష్మం స కౌంతేయః ప్రత్యవ్యూహత సంజయ ॥ 2
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. "సంజయా! పదకొండు అక్షౌహిణుల వ్యూహం చూసి, ధర్మరాజు అల్పమయిన సైన్యంతో ప్రతివ్యూహం ఎలా పన్నాడు? మానుష, దైవ, గాంధార్వ, ఆసుర వ్యూహాలన్నీ తెలిసిన భీష్మునికి ప్రతిగా ధర్మరాజు ఎలా వ్యూహం పన్నాడు?" (1,2)
సంజయ ఉవాచ
ధార్తరాష్ట్రాణ్యనీకాని దృష్ట్వా వ్యూఢాని పాండవః ।
అభ్యభాషత ధర్మాత్మా ధర్మరాజో ధనంజయమ్ ॥ 3
సంజయుడు చెపుతున్నాడు.
"ధృతరాష్ట్రపుత్రుల సేనావ్యూహాలు చూసి, ధర్మాత్ముడయిన ధర్మరాజు అర్జునునితో ఇలా అన్నాడు. (3)
మహర్షేర్వచనాత్ తాత వేదయంతి బృహస్పతేః ।
సంహతాన్ యోధయేదల్పాన్ కామం విస్తారయేద్ బహూన్ ॥ 4
'నాయనా! మహర్షి అయిన బృహస్పతి మాటలను బట్టి ఇలా తెలుస్తోంది. మనసేనకంటె శత్రుసేన చిన్నదయితే మనసేనను కూడ చిన్నదిగా కనపడేట్లు దట్టం చెయ్యాలి. పెద్దదయితే మన చిన్న సేనను పెద్దదిగా, విశాలంగా కనబరిచి యుద్ధం చెయ్యాలి. (4)
సూచీముఖమనీకం స్యాత్ అల్పానాం బహుభిః సహ ।
అస్మాకం చ తథా సైన్యమ్ అల్ఫీయః సుతరాం పరైః ॥ 5
చాలా సైన్యం కలవారితో అల్పసైన్యం కలవారు సూచీముఖ వ్యూహం పన్నాలి. మనసేన శత్రుసేనకంటే చిన్నదికదా! (5)
ఏతద్ వచనమాజ్ఞాయ మహర్షేర్వ్యూహ పాండవ ।
ఏతచ్ఛ్రుత్వా ధర్మరాజం ప్రత్యభాషత పాండవః ॥ 6
ఈ బృహస్పతి వచనాన్ని అనుసరించి వ్యూహం పన్ను అర్జునా!" ఆ మాట విని అర్జునుడు ధర్మజునితో ఇలా అన్నాడు. (6)
ఏష వ్యూహామి తే వ్యూహం రాజసత్తమ దుర్జయమ్ ।
అచలం నామ వజ్రాఖ్యం విహితం వజ్రపాణినా ॥ 7
'రాజోత్తమా! ఇది కదల్పలేనిది, జయింపలేనిది. ఇపుడు నీకోసం వజ్రవ్యూహం రచిస్తాను, దీన్ని ఇంద్రుడు ఆవిష్కరించాడు. (7)
యః స వాత ఇవోద్భూతః సమరే దుఃసహః పరైః ।
స నః పురో యోత్స్యతే వై భీమః ప్రహరతాం వరః ॥ 8
యుద్ధభూమిలో ప్రచండ వాయువులా దూకి, గట్టిగా దెబ్బతీయ గలిగి శత్రువులకు సహింపరాని వాడయిన భీముడు మనసేనకు ముందు ఉంటాడు. (8)
తేజాంసి రిపుసైన్యానాం మృద్నన్ పురుషసత్తమః ।
అగ్రేగ్రణీర్యోత్స్యతి నః యుద్ధోపాయవిచక్షణః ॥ 9
భీమసేనుడు యుద్ధోపాయాలన్నీ తెలిసినవాడు. ఆ నరశ్రేష్ఠుడు మనకు అగ్రభాగాన ఉండి శత్రుసేనలను అణచగలడు. (9)
యం దృష్ట్వా కురవః సర్వే దుర్యోధనపురోగమాః ।
నివర్తిష్యంతి సంత్రస్తాః సింహం క్షుద్రమృగా యథా ॥ 10
వానిని చూసి, దుర్యోధనాది కౌరవులంతా సింహాన్ని చూసిన నీచమృగాల వలె భయపడి పారిపోతారు. (10)
తం సర్వే సంశ్రయిష్యామః ప్రాకారమకుతోభయాః ।
భీమం ప్రహరతాం శ్రేష్ఠం దేవరాజమివామరాః ॥ 11
దేవతలంతా ఇంద్రుని ఆశ్రయించినట్లు మన మంతా నిర్భయులమై మనకు ప్రాకారంలా ఉండే భీముని ఆశ్రయించుదాం. (11)
న హి సోఽస్తే పుమాన్ లోకే యః సంక్రుద్ధం వృకోదరమ్ ।
ద్రష్టుమత్యుగ్రకర్మాణం విషహేత నరర్షభమ్ ॥ 12
భయంకర పరాక్రమం కల భీముడు కోపిస్తే అతనిని ఎదుర్కొన గల వీరుడు ఈ లోకంలోనే లేడు. (12)
భీమసేనో గదాం బిభ్రద్ వజ్రసారమయీం దృఢామ్ ।
చరన్ వేగేన మహతా సముద్రమపి శోషయేత్ ॥ 13
కేకయా ధృష్టకేతుశ్చ చేకితానశ్చ వీర్యవాన్ ।
భీముడు వజ్రం లాంటి గదను పుచ్చుకొని వేగంగా బయలుదేరితే సముద్రం కూడా ఇంకిపోతుంది. కేకయ రాజకుమారులూ, ధృష్టకేతుడూ, చేకితానుడూ కూడా అంతటి వారే. (13 1/2)
ఏతే తిష్ఠంతి సామాత్యాః ప్రేక్షకాస్తే జనాధిప ॥ 14
ధృతరాష్ట్రస్య దాయాదః ఇతి బీభత్సురబ్రవీత్ ।
భీమసేనం తదా రాజన్ దర్శయస్వ మహాబలమ్ ॥ 15
రాజా! అమాత్యులతో సహా ధృతరాష్ట్ర పుత్రులు నిన్నే చూస్తున్నారు' అర్జునుడు ఇలా చెప్పి భీమునితో "రాజా! నీ మహాబలం ఇపుడు చూపించు" అన్నాడు. (14,15)
బ్రువాణం తు తథా పార్థం సర్వసైన్యాని భారత ।
అపూజయంస్తదా వాగ్భిః అనుకూలాభిరాహవే ॥ 16
భారతా! అర్జునుని మాటకు అనుకూలంగా పలుకుతూ సైనికులంతా అర్జునుని ఆదరించారు. (16)
ఏవముక్త్వా మహాబాహుః తథా చక్రే ధనంజయః ।
వ్యూహ్య తాని బలాన్యాశు ప్రయయౌ ఫాల్గునస్తథా ॥ 17
ఇలా చెప్పి మహాబాహువైన అర్జునుడు అలాగే చేశాడు. సైన్యాలను వ్యూహం చేసి అర్జునుడు బయలు దేరాడు. (17)
సంప్రయాతాన్ కురూన్ దృష్ట్వా పాండవానాం మహాచమూః ।
గంగేవ పూర్ణా స్తిమితా స్పందమానా వ్యదృశ్యత ॥ 18
తమ వైపు వచ్చే కౌరవ సేనను చూసి, గంగానదిలా స్తిమితంగా ఉన్న పాండవసేన స్పందిస్తూ ముందుకు సాగింది. (18)
భీమసేనోఽగ్రణీస్తేషాం ధృష్టద్యుమ్నశ్చ వీర్యవాన్ ।
నకులః సహదేవశ్చ ధృష్టకేతుశ్చ పార్ధివః ॥ 19
పాండవసేనలో భీమసేనుడు అగ్రభాగాన నిలిచాడు. పరాక్రమవంతుడయిన ధృష్టద్యుమ్నుడు, నకులుడు, సహదేవుడు, ధృష్టకేతుడు అతనితో ఉన్నారు. (19)
విరాటశ్చ తతః పశ్చాద్ రాజాథాక్షౌహిణీవృతః ।
భ్రాతృభిః సహ పుత్రైశ్చ సోఽభ్యరక్షత పృష్ఠతః ॥ 20
వారి వెనుక విరాటుడు సోదరులతో, పుత్రునితో, అక్షౌహిణి సేనతో భీముని వెనుక రక్షిస్తున్నాడు. (20)
చక్రరక్షౌ తు భీమస్య మాద్రీపుత్రౌ మహాద్యుతీ ।
భ్రాతృభిః సహ పుత్రైశ్చ సోభ్యరక్షత పృష్ఠతః ॥ 21
నకుల సహదేవులు భీముని రథ చక్ర రక్షకులుగా ఉన్నారు. ఉపపాండవులు, అభిమన్యుడు వెనుక భాగాన్ని రక్షిస్తున్నారు. (21)
ధృష్టద్యుమ్నశ్చ పాంచాల్యః తేషాం గోప్తా మహారథః ।
సహితః పృతనాశూరైః రథముఖ్యైః ప్రభద్రకైః ॥ 22
మహారథుడైన ధృష్టద్యుమ్నుడు మహావీరులతో, రథికులయిన ప్రభద్రకులతో కలిసి సేనా రక్షణం చేస్తున్నాడు. (22)
శిఖండీ తు తతః పశ్చాత్ అర్జునేనాభిరక్షితః ।
యత్తో భీష్మవినాశాయ ప్రయయౌ భరతర్షభ ॥ 23
వారి వెనుక అర్జునుని రక్షణలో ఉండి, శిఖండి భీష్ముని సంహరించటానికి బయలుదేరాడు. (23)
పృష్ఠతోఽప్యర్జునస్యాసీద్ యుయుధానో మహాబలః ।
చక్రరక్షౌ తు పాంచాల్యౌ యుధామన్యాత్తమౌజసౌ ॥ 24
అర్జునుని వెనుక మహాబలుడయిన సాత్యకి ఉన్నాడు. పాంచాల వీరులయిన యుధామన్యుడు, ఉత్తమౌజుడు అర్జునునకు చక్ర రక్షకులుగా ఉన్నారు. (24)
రాజా తు మధ్యమానీకే కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
బృహద్భిః కుంజరైర్మత్తైః చలద్భిరచలైరివ ॥ 25
నడుస్తున్న పర్వతాలవలె ఉన్న మహామద గజ సైన్యంతో కౌంతేయుడైన ధర్మరాజు సేనామధ్యంలో ఉన్నాడు. (25)
అక్షౌహిణ్యాథ పాంచాల్యః యజ్ఞసేనో మహామనాః ।
విరాటమన్వయాత్ పశ్చాత్ పాండవార్థం పరాక్రమీ ॥ 26
ఒక అక్షౌహిణీ సేనతో పాండవుల కోసం మహామనస్వి, పరాక్రమశాలి అయిన ద్రుపదుడు విరాటుని వెంట నడిచాడు. (26)
తేషామాదిత్యచంద్రాభాః కనకోత్తమభూషణాః ।
నానాచిత్రధరా రాజన్ రథేష్వాసన్ మహాధ్వజాః ॥ 27
రాజా! వారి రథ ధ్వజాలు ఎన్నో రత్నాలతో సువర్ణమయాలై చంద్రసూర్యులవలె ప్రకాశిస్తున్నాయి. (27)
సముత్సార్య తతః పశ్చాద్ ధృష్టద్యుమ్నో మహారథః ।
భ్రాతృభిః సహ పుత్రైశ్చ సోఽభ్యరక్షద్ యుధిష్ఠిరమ్ ॥ 28
మహారథుడైన ధృష్టద్యుమ్నుడు ఇతరులను దూరంగా పెట్టి, తమ్ముళ్లతో, పుత్రులతో కలిసి ధర్మరాజును రక్షిస్తున్నాడు. (28)
త్వదీయానాం పరేషాం చ రథేషు విపులాన్ ధ్వజాన్ ।
అభిభూయార్జునస్యైకః రథే తస్థౌ మహాకపిః ॥ 29
కురువీరుల, పాండవుల రథాల మీద ఉన్న విశాల ధ్వజాలను తిరస్కరిస్తూ అర్జునుని రథం మీద కపిధ్వజం ప్రకాశిస్తోంది. (29)
పాదాతాస్త్వగ్రతోఽగచ్ఛన్ అసిశక్త్యృష్టిపాణయః ।
అనేకశతసాహస్రాః భీమసేనస్య రక్షిణః ॥ 30
భీమునికి ముందు భాగాన రక్షణ కోసం కత్తులూ, శక్తులూ, రెండంచుల కత్తులూ, చేతబట్టి చాలా లక్షల పదాతి దళాలు నడుస్తూన్నాయి. (30)
వారణా దశసాహస్రాః ప్రభిన్నకరటాముఖాః ।
శూరా హేమమయైర్జాలైః దీప్యమానా ఇవాచలాః ॥ 31
క్షరంత ఇవ జీమూతాః మహార్హాః పద్మగంధినః ।
రాజానమన్వయుః పశ్చాత్ జీమూతా ఇవ వార్షికాః ॥ 32
ధర్మజుని వెనుక మదజలం స్రవించే పదివేల ఉన్నత గజాలు వర్షాకాలమేఘాల్లా, పర్వతాల్లా వెడుతున్నాయి. వాటిపై బంగారు అంబారీలున్నాయి. ఏనుగులు మేఘాల వలె పద్మగంధం కల మదజలాన్ని వర్షంలా స్రవిస్తున్నాయి. (31, 32)
భీమసేనో గదాం భీమాం ప్రకర్షన్ పరిఘోపమామ్ ।
ప్రచకర్ష మహాసైన్యం దురాధర్షో మహామనాః ॥ 33
మహామనస్వి అయిన భీముడు పరిఘవలె భయంకరమైన గద ధరించి, దుర్జయుడై మహాసైన్యాన్ని తన వెంట తీసుకొని, వెళుతున్నాడు. (33)
తమర్కమివ దుష్ప్రేక్ష్యం తపంతమివ వాహినీమ్ ।
న శేకుః సర్వయోధాస్తే ప్రతివీక్షితుమంతికే ॥ 34
అతడు సూర్యునివలె చూడశక్యం గాకుండా ఉన్నాడు. నీ సైన్యాన్ని తపింపజేస్తున్నాడు. దగ్గర నుండి కూడా ఎవరూ అతనిని చూడలేకపోతున్నారు. (34)
వజ్రో నామైష స వ్యూహః నిర్భయః సర్వతోముఖః ।
చాపవిద్యుద్ధ్వజో ఘోరః గుప్తో గాండీవధన్వనా ॥ 35
వజ్రమనే పేరుగల ఆ వ్యూహం భయరహితమై అన్ని వైపుల ముఖం కలిగి ఉంది. ధనుస్సనే విద్యుత్తుతో కూడిన ధ్వజంతో భయంకరంగా ఉంది. అర్జునునిచే రక్షింపబడుతోంది. (35)
యం ప్రతివ్యూహ్య తిష్ఠంతి పాండవాస్తవ వాహినీమ్ ।
అజేయో మానుషే లోకే పాండవైరభిరక్షితః ॥ 36
నీసేనకు ఎదుట ప్రతిగా నిలిపిన పాండవరక్షణలోని వ్యూహం ఈ మానుష లోకంలో అజేయమైనది. (36)
సంధ్యాం తిష్ఠత్సు సైన్యేషు సూర్యస్యోదయనం ప్రతి ।
ప్రావాత్ సపృషతో వాయుః నిరభ్రే స్తనయిత్నుమాన్ ॥ 37
సూర్యోదయానికి పూర్వం సంధ్యాకాలంలో వీరులు వదలిన అర్ఘ్య బిందువులు గాలికి రేగి, మేఘాలు లేని వర్షంలా అనిపించింది. (37)
విష్వగ్వాతాశ్చ వివవుః నీచైః శర్కరకర్షిణః ।
రజశ్చోద్ధూయత మహత్ తమ ఆచ్ఛాదయజ్జగత్ ॥ 38
ఇసుకతో కూడిన గాలులు అడ్డదిడ్డంగా వీచాయి. పెద్ద ధూళి చెలరేగింది. లోకమంతా ఒక్కసారిగా పెను చీకటి క్రమ్మింది. (38)
అథ సన్నహ్యమానేషు సైన్యేషు భరతర్షభ ।
నిష్ప్రభోఽభ్యుద్యయౌ సూర్యః సఘోషం భూశ్చచాల చ ॥ 40
భరతర్షభా! సైన్యాలన్నీ యుద్ధానికి సన్నద్ధమైనపుడు సూర్యకాంతి తేజోహీన మయింది - పెద్ద ధ్వనిచేస్తూ భూమి కంపించింది. (40)
వ్యశీర్యత సనాదా చ భూస్తదా భరతర్షభ ।
నిర్ఘాతా బహవో రాజన్ దిక్షు సర్వాసు చాభవన్ ॥ 41
భరతర్షభా! రాజా! అప్పుడు ధ్వనిస్తూ భూమి బ్రద్దలయింది. అన్ని దిక్కులలోను చాలా పిడుగులు పడ్డాయి. (41)
ప్రాదురాసీద్ రజస్తీవ్రం న ప్రాజ్ఞాయత కించన ।
ధ్వజానాం ధూయమానానాం సహసా మాతరిశ్వనా ॥ 42
కింకిణీజాలబద్ధానాం కాంచనస్రగ్వరాంబరైః ।
మహతాం సపతాకానామ్ ఆదిత్యసమతేజసామ్ ॥ 43
సర్వం ఝణఝణీభూతమ్ ఆసీత్ తాలవనేష్వివ ।
ఏమీ కనపడకుండా ధూళి చెలరేగింది. అపుడు వాయువేగం చేత ధ్వజాలు ఊగిపోయాయి. సువర్ణ మాలతోను, వస్త్రాలతోను అలంకరింపబడిన సూర్యుని తేజస్సు కల ధ్వజాలు ఊగుతూ, తాటితోపులో ఉన్నట్లు ఝణఝణ ధ్వని వచ్చింది. (42,43 1/2)
ఏవం తే పురుషవ్యాఘ్రాః పాండవా యుద్ధనందినః ॥ 44
వ్యవస్థితాః ప్రతివ్యూహ్య తన పుత్రస్య వాహినీమ్ ।
గ్రసంత ఇవ మజ్జాం నః యోధానాం భరతర్షభ ॥ 45
దృష్ట్వాగ్రతో భీమసేనం గదాపాణిమవస్థితమ్ ॥ 46
భరతర్షభా! ఇలా పురుషశ్రేష్ఠులయిన పాండవులు రణోత్సాహంతో నీ పుత్రులకు ఎదురుగా ప్రతి వ్యూహంలో నిలిచారు. గద ధరించి ఎదుట నిలిచిన భీమసేనుని చూస్తే వారు మన యోధుల మజ్జను రక్తాన్ని పీలుస్తున్నట్లు ఉన్నారు. (44-46)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి పాండవసైన్యవ్యూహే ఏకోనవింశోఽధ్యాయః ॥ 19 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున పాండవసైన్య వ్యూహమను పందొమ్మిదవ అధ్యాయము. (19)