॥ ఓం శ్రీపరమాత్మనే నమః ॥

శ్రీమహాభారతము

భీష్మ పర్వము

1. ప్రథమాధ్యాయము

(జంబూఖండవినిర్మాణ పర్వము)

కురుక్షేత్రమున ఉభయసేనలు రణనియమము ఏర్పరచుకొనుట.

నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ ।
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ ॥
నారాయణునికి, నరోత్తముడయిన అర్జునునికి, సరస్వతీదేవికి, వ్యాసునికి నమస్కరించి, తరువాత జయమనే ఈ భారతాన్ని పఠించాలి. చెప్పాలి.
జనమేజయ ఉవాచ
కథం యుయుధిరే వీరాః కురుపాండవసోమకాః ।
పార్థివాః సుమహాత్మానః నానాదేశసమాగతాః ॥ 1
జనమేజయుడు అడుగుతున్నాడు. నానాదేశాల నుండి వచ్చిన మహాత్ములయిన రాజులూ, కౌరవ, పాండవులూ, సోమకులూ యుద్ధంలో ఎలా పోరాడారు? (1)
వైశంపాయన ఉవాచ
యథా యుయుధిరే వీరాః కురుపాండవసోమకాః ।
కురుక్షేత్రే తపఃక్షేత్రే శృణు త్వం పృథివీపతే ॥ 2
వైశంపాయనుడు చెపుతున్నాడు.
రాజా! తపః క్షేత్రమయిన కురుక్షేత్రంలో కౌరవ, పాండవ, సోమక వీరులు ఎలా యుద్ధంచేశారో (చెపుతా) విను. (2)
తేఽవతీర్య కురుక్షేత్రం పాండవాః సహసోమకాః ।
కౌరవాః సమవర్తంత జిగీషంతో మహాబలాః ॥ 3
సోమకులతో కూడిన పాండవులూ, మహాబలు లయిన కౌరవులూ ఒకరినొకరు జయించాలని కురుక్షేత్రంలో విడిశారు.
వేదాధ్యయనసంపన్నాః సర్వే యుద్ధాభినందినః ।
ఆశంసంతో జయం యుద్ధే బలేనాభిముఖా రణే ॥ 4
అందరూ వేదాధ్యయన సంపన్నులే - అందరూ యుద్ధాన్ని అభినందించే వారే - వారు యుద్ధంలో జయం ఆకాంక్షిస్తూ, సేనలతో అభిముఖంగా నిలిచారు. (4)
అభియాయ చ దుర్ధర్షాం ధార్తరాష్ట్రస్య వాహినీమ్ ।
ప్రాఙ్ ముఖాః పశ్చిమే భాగే న్యవిశంత ససైనికాః ॥ 5
దుర్ధర్షమైన దుర్యోధనుని సేనకు సమ్ముఖంగా వెళ్లి, పాండవసేన పశ్చిమ భాగంలో తూర్పుముఖంగా నిలిచింది. (5)
సమంతపంచకాద్ బాహ్యం శిబిరాణి సహస్రశః ।
కారయామాస విధివత్ కుంతీపుత్రో యుధిష్ఠిరః ॥ 6
యుధిష్ఠిరుడు సమంత పంచకానికి వెలుపల యథావిధిగా వేలకొద్ధీ శిబిరాలు వేయించాడు. (6)
శూన్యా చ పృథివీ సర్వా బాలవృద్ధావశేషితా ।
నిరశ్వపురుషేవాసీద్ రథకుంజరవర్జితా ॥ 7
భూమి అంతా ఖాళీ అయిపోయింది. బాలురు, వృద్ధులూ మాత్రం మిగిలారు. గ్రామాల్లో అశ్వాలు, యువకులు, రథాలు, ఏనుగులూ కనపడటంలేదు. (7)
యావత్తపతి సూర్యో హి జంబూద్వీపస్య మండలమ్ ।
తావదేవ సమాయాతం బలం పార్థివసత్తమ ॥ 8
సూర్యకిరణ ప్రసారం ఉన్నంత మేర జంబూద్వీపం అంతా అచ్చట చేరింది రాజా! (8)
ఏకస్థాః సర్వవర్ణాస్తే మండలం బహుయోజనమ్ ।
పర్యాక్రామంత దేశాంశ్చ నదీః శైలాన్ వనాని చ ॥ 9
సర్వవర్ణాల వారు ఒకచోట చేరారు - వారి సమూహం ఎన్నో ప్రదేశాలను, నదులను, పర్వతాలను, వనాలను ఆక్రమించుకొని చాలా యోజనాలు విస్తరించింది. (9)
తేషాం యుధిష్ఠిరో రాజా సర్వేషాం పురుషర్షభ ।
వ్యాదిదేశ సవాహ్యానాం భక్ష్యభోజ్యమనుత్తమమ్ ॥ 10
వారందరికి, వారి వాహనాలయిన ఏనుగులకు రాజయిన యుధిష్ఠిరుడు ఉత్తమ మయిన ఆహారం కల్పించాడు. (10)
శయ్యాశ్చ వివిధాస్తాత తేషాం రాత్రౌ యుధిష్ఠిరః ।
ఏవం వేదీ వేదితవ్యః పాండవేయోఽయమిత్యుత ॥ 11
అభిజ్ఞానాని సర్వేషాం సంజ్ఞాశ్చాభరణాని చ ।
యోజయామాస కౌరవ్యః యుద్ధకాల ఉపస్థితే ॥ 12
'ఇది పాండవసేన' అని తెలిసేటట్లు ఆ రాత్రి ధర్మరాజు వారందరికి శయ్యలు ఏర్పాటు చేశాడు. యుద్ధ సమయానికి వారందరికి గుర్తులు, ఆభరణాలు కల్పించాడు. (11-12)
దృష్ట్వా ధ్వజాగ్రం పార్థస్య ధార్తరాష్ట్రో మహామనాః ।
సహ సర్వైర్మహీపాలైః ప్రత్యవ్యూహత పాండవమ్ ॥ 13
అర్జునుని ధ్వజాగ్రం చూసి మహామనస్వి, అయిన దుర్యోధనుడు పాండవ సేనకు విరుద్ధంగా వ్యూహరచన చేశాడు. (13)
పాండురేణాతపత్రేణ ధ్రియమాణేన మూర్ధని ।
మధ్యే నాగసహస్రస్య భ్రాతృభిః పరివారితః ॥ 14
శిరస్సుపై వెల్ల గొడుగు దాల్చి, తమ్ముళ్లతో కలిసి, వేయి ఏనుగుల మధ్య విరాజిల్లాడు. (14)
దృష్ట్వా దుర్యోధనం హృష్టాః పంచాలా యుద్ధనందినః ।
దధ్ముః ప్రీతా మహాశంఖాన్ భేర్యశ్చ మధురస్వనాః ॥ 15
అటువంటి దుర్యోధనుని చూసి, యుద్ధాభినందనం చేస్తూ పాంచాలురు మధురంగా, ప్రీతితో శంఖాలు, భేరులు మ్రోగించారు. (15)
తతః ప్రహృష్టాం తాం సేనామ్ అభివీక్ష్యాథ పాండవాః ।
బభూవుర్హృష్టమనసః వాసుదేవశ్చ వీర్యవాన్ ॥ 16
ఆపై సంతోషిస్తున్న ఆ సేనను చూసి పాండవులూ, పరాక్రమవంతుడైన శ్రీకృష్ణుడూ హర్షం పొందారు. (16)
తతో హర్షం సమాగమ్య వాసుదేవధనంజయౌ ।
దధ్మతుః పురుషవ్యాఘ్రౌ దువ్యౌ శంఖౌ రథే స్థితౌ ॥ 17
ఆ సంతోషంతో రథం మీద నిలిచి, పురుషశ్రేష్ఠులయిన కృష్ణార్జునులు దివ్య శంఖాలు పూరించారు. (17)
పాంచజన్యస్య నిర్ఘోషం దేవదత్తస్య చోభయోః ।
శ్రుత్వా తు నినదం యోధాః శకృన్మూత్రం ప్రసుస్రువుః ॥ 18
పాంచజన్యధ్వని, దేవదత్త ధ్వని రెండూ విని శత్రుయోధులు మలమూత్రాలు విడిచారు. (18)
యథా సింహస్య నదతః స్వనం శ్రుత్వేతరే మృగాః ।
త్రసేయుర్నినదం శ్రుత్వా తథాసీదత తద్బలమ్ ॥ 19
సింహగర్జనం విని ఇతరమైన అల్పమృగాలు భయపడినట్లు శంఖధ్వని విని కౌరవసేన భయభ్రాంత మయింది. (19)
ఉదతిష్ఠద్ రజో భౌమం న ప్రాజ్ఞాయత కించన ।
అస్తంగత ఇవాదిత్యే సైన్యేన సహసాఽఽవృతే ॥ 20
సైన్యాలు ఆవరించి భూమి అంతటా ధూళి వ్యాపించింది. ఏమీ కనపడటంలేదు - తెలియటం లేదు - సూర్యుడు అస్తమించి చీకట్లు క్రమ్మినట్లనిపించింది. (20)
వవర్ష తత్ర పర్జన్యః మాంసశోణితవృష్టిమాన్ ।
దిక్షు సర్వాణి సైన్యాని తదద్భుతమివాభవత్ ॥ 21
మేఘాలు సేనల మీద అన్ని దిక్కులా మాంసమూ, రక్తమూ వర్షించాయి. అది చాలా అద్భుతంగా తోచింది. (21)
వాయుస్తతః ప్రాదురభూత్ నీచైః శర్కరకర్షణ ।
వినిఘ్నం స్తాన్యనీకాని శతశోఽథ సహస్రశః ॥ 22
తరువాత క్రింది నుండి ఇసుకతో, గులక రాళ్లతో కూడి గాలి పైకి వీచింది. దానితో వందలకొద్ధీ, వేలకొద్దీ సైనికులు దెబ్బతిన్నారు. (22)
ఉభే సైన్యే చ రాజేంద్ర యుద్ధాయ ముదితే భృశమ్ ।
కురుక్షేత్రే స్థితే యత్తే సాగరక్షుభితోపమే ॥ 23
రెండు సైన్యాలూ యుద్ధానికి ఉబలాట పడుతున్నాయి - కురుక్షేత్రంలో రెండు సాగరాలు అల్లకల్లోమైనట్లు కనిపిస్తున్నాయి. (23)
తయోస్తు సెనయోరాసీత్ అద్భుతః స తు సంగమః ।
యుగాంతే సమనుప్రాప్తే ద్వయోః సాగరయోరివ ॥ 24
ఆ సేనల సంగమం చాలా అద్భుతంగా యుగాంత కాలంలో రెండు సముద్రాలు కలిసినట్లు కనిపిస్తోంది. (24)
శూన్యాసీత్ పృథివీ సర్వా వృద్ధబాలావశేషితా ।
నిరశ్వపురుషేవాసీద్ రథకుంజరవర్జితా ॥ 25
తేన సేనాసమూహేన సమానీతేన కౌరవైః ।
అక్కడకు చేరిన కౌరవ సేనవల్ల గ్రామంలో ఎక్కడా వీరులు, యువకులూ కనపడటం లేదు - వృద్ధులూ బాలురూ మాత్రమే మిగిలారు. అశ్వాలు లేవు, రథాలు లేవు, ఏనుగులు లేవు. (25 1/2)
తతస్తే సమయం చక్రుః కురుపాండవసోమకాః ॥ 26
ధర్మాన్ సంస్థాపయామాసుః యుద్ధానాం భరతర్షభ ।
భరతర్షభా! అపుడా కౌరవులూ, పాండవులూ, సోమకులూ కొన్ని యుద్ధ మర్యాదలను, ధర్మాలను స్థాపించారు. నియమాలు చేసుకొన్నారు. (26 1/2)
నివృత్తే విహితే యుద్ధే స్యాత్ ప్రీతిర్నః పరస్పరమ్ ॥ 27
యథాపరం యథాయోగం న చ స్యాత్ కస్యచిత్ పునః ।
ఆ రోజు యుద్ధం పూర్తి అయ్యాక మనకు పరస్పరమూ ప్రీతి ఉండాలి - అపుడిక ఎవరికీ ఎవరి మీదా శత్రుత్వమూ, అనుచిత ప్రవర్తనా ఉండరాదు. (27 1/2)
వాచా యుద్ధప్రవృత్తానాం వాచైవ ప్రతియోధనమ్ ॥ 28
నిష్క్రాంతాః పృతనామధ్యాత్ న హంతవ్యాః కదాచన ।
రథీ చ రథినా యోధ్యః గజేన గజధూర్గతః ।
అశ్వేనాశ్వీ పదాతిశ్చ పాదాతేనైవ భారత ॥ 29
భారతా! మాటలతో యుద్ధం చేసే వారితో మాటలతోనే ప్రతి యుద్ధం చెయ్యాలి. రథమందున్నవాడు రథితోనే యుద్ధం చెయ్యాలి. అలాగే ఏనుగు మీది వాడు ఏనుగు మీది వానితోనే, అశ్వమెక్కిన వాడు అశ్వితోనే, పదాతి పదాతితోనే యుద్ధం చెయ్యాలి. (28,29)
యథాయోగం యథాకామం యథోత్సాహం యథాబలమ్ ।
సమాభాష్య ప్రహర్తవ్యం న విశ్వస్తే న విహ్వలే ॥ 30
యోగ్యతను, కోరికను, ఉత్సాహాన్ని, బలాన్ని అనుసరించి ముందు చెప్పి, తరువాత కొట్టాలి. నమ్మకంతో అజాగ్రత్తగా ఉన్న వానిని, భయపడినవానిని కొట్టరాదు. (30)
ఏకేన సహ సంయుక్తః ప్రపన్నో విముఖస్తథా ।
క్షీణశస్త్రో వివర్మా చ న హంతవ్యః కదాచన ॥ 31
ఇతరునితో పోరాడేవానిని, శరణుకోరిన వానిని, పారిపోయేవానిని, శస్త్రాలు అయిపోయిన వానిని, కవచం లేని వానినీ ఎన్నడూ చంపరాదు. (31)
న సూత్రేషు న దుర్యేషు న చ శస్త్రోపనాయిషు ।
న భేరీశంఖవాదేషు ప్రహర్తవ్యం కథంచన ॥ 32
అశ్వసేవకోసం ఉన్న సారథులమీద, శస్త్రాలను మోసే వారి మీద, భేరీ శంఖాలు మ్రోగించే వారి మీద ఆయుధ ప్రయోగం చేయరాదు. (32)
ఏవం తే సమయం కృత్వా కురుపాండవసోమకాః ।
విస్మయం పరమం జగ్ముః ప్రేక్షమాణాః పరస్పరమ్ ॥ 33
ఇలా కౌరవ, పాండవ, సోమకులు నియమం చేసుకొని, ఒకరి నొకరు చూసుకొంటూ ఎంతో ఆశ్చర్యం పొందారు. (33)
నివిశ్య చ మహాత్మానః తతస్తే పురుషర్షభాః ।
హృష్టరూపాః సుమనసః బభూవుః సహసైనికాః ॥ 34
పురుషశ్రేష్ఠు లయిన మహాత్ములంతా సైనికులతో సహా తమతమ స్థానాలతో నిలిచి ప్రసన్న చిత్తాలతో హర్షోత్సాహాలు పొందారు. (34)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి సైన్యశిక్షణే ప్రథమోఽధ్యాయః ॥ 1 ॥
ఇది శ్రీమహాభారతమున బీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున సైన్యశిక్షణమను ప్రథమాధ్యాయము. (1)