2. రెండవ అధ్యాయము

వ్యాసుడు సంజయునకు దివ్యదృష్టినిచ్చుట - ఉత్పాతములు.

వైశంపాయన ఉవాచ
తతః పూర్వాపరే సైన్యే సమీక్ష్య భగవానృషిః ।
సర్వవేదవిదాం శ్రేష్ఠః వ్యాసః సత్యవతీసుతః ॥ 1
భవిష్యతి రణే ఘోరే భరతానాం పితామహః ।
ప్రత్యక్షదర్శీ భగవాన్ భూతభవ్యభవిష్యవిత్ ॥ 2
వైచిత్య్రవీర్యం రాజానం స రహస్యబ్రవీదిదమ్ ।
శోచంతమార్తం ధ్యాయంతం పుత్రాణామనయం తదా ॥ 3
వైశంపాయనుడు చెపుతున్నాడు.
తూర్పు - పశ్చిమ దిక్కులవైపు నిలిచిన సైన్యాన్ని చూసి, వేదవేత్తలలో ఉత్తముడు, సత్యవతీ సుతుడు, భరత వంశస్థులకు పితామహుడు, జరుగబోయే భారతయుద్ధ పరిణామాన్ని ముందే ప్రత్యక్షంగా దర్శించి, భూతభవిష్యద్యర్తమానాలు తెలిసిన వ్యాసుడు పుత్రుల అవినీతిని గురించి విచారిస్తున్న ధృతరాష్ట్రుని చూసి, ఏకాంతంగా ఇలా అన్నాడు. (1-3)
వ్యాస ఉవాచ
రాజన్ పరీతకాలాస్తే పుత్రాశ్చాన్యే చ పార్థివాః ।
తే హింసంతీవ సంగ్రామే సమాసాద్యేతరేతరమ్ ॥ 4
వ్యాసుడు చెప్తున్నాడు. "రాజా! నీ పుత్రులకు ఇతర రాజులకు మృత్యుకాలం వచ్చింది. వారంతా ఒకరినొకరు యుద్ధంలో చంపుకొనటానికి సిద్ధపడుతున్నారు. (4)
తేషు కాలపరీతేషు వినశ్యత్స్యేవ భారత ।
కాలపర్యాయమాజ్ఞాయ మా స్మ శోకే మనః కృథాః ॥ 5
వారంతా కాలానికి అధీనులై నశించిపోతారు - ఇదంతా కాలగమనం యొక్క రీతి అని భావించు. మనస్సులో శోకించకు! (5)
యది చేచ్ఛసి సంగ్రామే ద్రష్టుమేతాన్ విశాంపతే ।
చక్షుర్ధదాని తే పుత్ర యుద్ధం తత్ర నిశామయ ॥ 6
పుత్రా! రాజా! వారందరినీ యుద్ధంలో చూద్దామని నీవు అనుకొంటే నీకు దృష్టి ఇస్తాను. యుద్ధదృశ్యమంతా చూద్దువుగాని." (6)
ధృతరాష్ట్ర ఉవాచ
న రోచయే జ్ఞాతివధం ద్రష్టుం బ్రహ్మర్షిసత్తమ ।
యుద్ధమేతత్ త్వశేషేణ శృణుయాం తవ తేజసా ॥ 7
అపుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. "బ్రహ్మర్షీ! జ్ఞాతుల వధ చూడలేను. కానీ నీ ప్రభావంతో ఈ యుద్ధాన్ని సంపూర్ణంగా వింటాను." (7)
వైశంపాయన ఉవాచ
ఏతస్మిన్ నేచ్ఛతి ద్రష్టుం సంగ్రామం శ్రోతుమిచ్ఛతి ।
వరాణామీశ్వరో వ్యాసః సంజాయాయ వరం దదౌ ॥ 8
వైశంపాయనుడు చెపుతున్నాడు. జనమేజయా! ధృతరాష్ట్రుడు యుద్ధం చూడదలచుకోలేదు, వినాలనుకొన్నాడు. అపుడు వరప్రదాత అయిన వ్యాసుడు సంజయునికి వరం ఇచ్చాడు. (8)
ఏష తే సంజయో రాజన్ యుద్ధమేతద్ వదిష్యతి ।
ఏతస్య సర్వసంగ్రామే న పరోక్షం భవిష్యతి ॥ 9
"రాజా! ఈ సంజయుడు నీకు యుద్ధాన్ని వర్ణించి చెపుతాడు. సంజయునికి యుద్ధమంతా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. (9)
చక్షుషా సంజయో రాజన్ దివ్యేనైవ సమన్వితః
కథయిష్యతి తే యుద్ధం సర్వజ్ఞశ్చ భవిష్యతి ॥ 10
సంజయునికి దివ్యదృష్టి కలుగుతుంది. దానితో అన్నీ తెలిసి, సంజయుడు నీకు యుద్ధమంతా చెపుతాడు. (10)
ప్రకాశం వాప్రకాశం వా దివా వా యది వా నిశి ।
మనసా చింతితమపి సర్వం వేత్స్యతి సంజయః ॥ 11
బయటికి కనపడినా, కనపడకపోయినా, పగలయినా, రాత్రి అయినా, సైనికులు మనసులో అనుకొన్నదయినా సరే! అన్నీ సంజయునికి తెలుస్తాయి. (11)
నైనం శస్త్రాణి ఛేత్స్యంతి నైనం బాధిష్యతే శ్రమః ।
గావల్గణిరయం జీవన్ యుద్ధాదస్మాద్ విమోక్ష్యతే ॥ 12
ఈ సంజయుని ఏ శస్త్రాలూ నరుకలేవు. వీనిని ఎంత శ్రమ అయినా బాధించదు. యుద్ధం నుండి ఇతడు జీవంతో బయట పడతాడు. (12)
అహం తు కీర్తిమేతేషాం కురూణాం భరతర్షభ ।
పాండవానాం చ సర్వేషాం ప్రథయిష్యామి మా శుచః ॥ 13
భరతర్షభా! నేను కౌరవ పాండవుల కీర్తిని అందరికీ తెలియజెప్పుతాను. విచారించకు. (13)
దిష్టమేతన్నరవ్యాఘ్ర నాభిశోచితుమర్హసి ।
న చైవ శక్యం సంయంతుం యతో ధర్మస్తతో జయః ॥ 14
రాజోత్తమా! ఇది దైవ నిర్ణయం. నీవు శోకింపరాదు. పైగా దీన్ని నియమించటానికి ఎవరికీ శక్యం కాదు. ధర్మం ఎటుంటే అటే జయం కలుగుతుంది." (14)
వైశంపాయన ఉవాచ
ఏవముక్త్వా స భగవాన్ కురూణాం ప్రపితామహః ।
పునరేవ మహాభాగః ధృతరాష్ట్రమువాచ హ ॥ 15
వైశంపాయనుడు చెపుతున్నాడు. ఇలా చెప్పి కురువుల ప్రపితామహుడు, మహాభాగుడు, భగవంతుడు అయిన వ్యాసుడు మళ్లీ ధృతరాష్ట్రునితో ఇంకా ఇలా అంటున్నాడు. (15)
ఇహ యుద్ధే మహారాజ భవిష్యతి మహాన్ క్షయః ।
తథేహ చ నిమిత్తాని భయదాన్యుపలక్షయే ॥ 16
"రాజా! ఈ యుద్ధంలో చాలా వినాశం కలుగుతుంది. అటువంటి భయంకర నిమిత్తాలు నాకు కనిపిస్తున్నాయి. (16)
శ్యేనా గృధ్రాశ్చ కాకాశ్చ కంకాశ్చ సహితా బకైః ।
సంపతంతి నగాగ్రేషు సమవాయాంశ్చ కుర్వతే ॥ 17
డేగలు, గ్రద్దలు, కాకులు, రాబందులు, కొంగలు, చెట్ల చివర కూర్చుండి తమజాతి పక్షులను పిల్చుకొంటూ, గుంపులు గుంపులుగా చేరుతున్నాయి. (17)
అభ్యగ్రం చ ప్రపశ్యంతి యుద్ధమానందినో ద్విజాః ।
క్రవ్యాదా భక్షయిష్యంతి మాంసాని గజవాజినామ్ ॥ 18
నిర్దయం చాభివాశంతః భైరవా భయవేదినః ।
కంకాః ప్రయాంతి మధ్యేన దక్షిణామభితో దిశమ్ ॥ 19
ఈ పక్షులన్నీ రణభూమికి దగ్గరగా వచ్చి, సంతోషంతో చూస్తున్నాయి. వాటితో మాంసం తినే పక్షులు, ఏనుగులు, గుర్రాల మాంసం తినేందుకు వచ్చాయి. భీకరమయిన రాబందులు కర్ణకఠోరంగా కూస్తూ, భయాన్ని సూచిస్తూ సైన్యమధ్యం నుండి దక్షిణ దిక్కుగా వెళుతున్నాయి. (18,19)
ఉభే పూర్వాపరే సంధ్యే నిత్యం పశ్యామి భారత ।
ఉదయాస్తమనే సూర్యం కబంధైః పరివారితమ్ ॥ 20
ఉదయ సాయం సంధ్యాకాలాల్లో ప్రతి రోజూ ఉదయించే, అస్తమించే సమయాల్లో కబంధాలు (మొండెములు/రాహువులు) సూర్యుని చుట్టు ముట్టుతున్నాయి. (20)
శ్వేతలోహితపర్యంతాః కృష్ణగ్రీవాః సవిద్యుతః ।
వివర్ణాః పరిఘాః సంధౌ భానుమంతమవారయన్ ॥ 21
తెలుపు ఎరుపురంగుల చివరలు, నల్లని కంఠభాగాలు కల పరిఘలు విద్యుత్సహితాలై పూర్వాపర సంధ్యాసమయాల్లో సూర్యుని అడ్డగిస్తున్నాయి. (21)
జ్వలితార్కేందునక్షత్రం నిర్విశేషదినక్షపమ్ ।
అహోరాత్రం మయా దృష్టం తద్ భయాయ భవిష్యతి ॥ 22
రాత్రింబవళ్లు, సూర్యచంద్రులు, నక్షత్రాల సముదాయాలు మండి పోతున్నాయి. ఇలా పగలూ, రాత్రీ నేను చూశాను. ఇది భయావహంగా ఉంది. (22)
అలక్ష్యః ప్రభయా హీనః పౌర్ణమాసీం చ కార్తికీమ్ ।
చంద్రోభూదగ్నివర్ణశ్చ పద్మవర్ణనభస్తలే ॥ 23
కార్తీక పూర్ణిమ నాడు, కమలం వాంటి నీలాకాశంలో చంద్రుడు కాంతిహీనుడై సరిగా కనపడటంలేదు. చంద్రుని కాంతి అగ్నివర్ణం వలె కనపడుతోంది. (23)
స్వప్స్యంతి నిహతా వీరాః భూమిమావృత్య పార్థివాః ।
రాజానో రాజపుత్రాశ్చ శూరాః పరిఘబాహవః ॥ 24
పరిఘల వంటి బాహువులు కల వీరులు శూరులైన రాజులు, రాజపుత్రులు చంపబడి, భూమి అంతా ఆవరించి, ఇక్కడ శయనిస్తారు. - ఇది ఈ దుర్నిమిత్తాల ఫలితం. (24)
అంతరిక్షే వరాహస్య వృషదంశస్య చోభయోః ।
ప్రణాదం యుద్ధ్యతో రాత్రౌ రౌద్రం నిత్యం ప్రలక్షయే ॥ 25
రాత్రులలో ఆకాశంలో పంది - పిల్లి రెండూ పెద్దగా అరుస్తూ, రౌద్రంగా పోట్లాడుకొంటూ నిత్యమూ నాకు కనిపిస్తున్నాయి. (25)
దేవతాప్రతిమాశ్చైవ కంపంతి చ హసంతి చ ।
వమంతి రుధిరం చాస్యైః ఖిద్యంతి ప్రపతంతి చ ॥ 26
దేవతాప్రతిమలు కంపిస్తూ, నవ్వుతూ నోటి నుండి రక్తం క్రక్కుతున్నాయి. దుఃఖిస్తూ పడిపోతున్నాయి. (26)
అనాహతా దుందుభయః ప్రణదంతి విశాంపతే ।
అయుక్తాశ్చ ప్రవర్తంతే క్షత్రియాణాం మహారథాః ॥ 27
రాజా! కొట్టకుండానే దుందుభులు మ్రోగుతున్నాయి. వీరులెక్కకుండానే రథాలు సాగిపోతున్నాయి. (27)
యుద్ధవిముఖుడైనా, శస్తాలనువీడినా, శరణుగోరినా వారిని చంపకూడదు మొదలయిన ఇక్కడ యుద్ధధర్మాలు.
కోకిలాః శతపత్రాశ్చ చాషా భాసాః శుకాస్తథా ।
సారసాశ్చ మయూరాశ్చ వాచో ముంచంతి దారుణాః ॥ 28
కోకిలలు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలు, గ్రద్ధలు, చిలుకలు, బెగ్గురు పక్షులు, నెమళ్లు భయంకరంగా కూస్తున్నాయి. (28)
గృహీతశస్త్రాః క్రోశంతి చర్మిణో వాజిపృష్ఠగాః ।
అరుణోదయే ప్రదృశ్యంతే శతశః శలభవ్రజాః ॥ 29
గుర్రపు రౌతులు చేతులలో కత్తి, డాలు పట్టుకొని అరుస్తున్నారు. సూర్యోదయం కాక పూర్వమే మిడుతలదండ్లు వందల కొద్దీ కనిపిస్తున్నాయి. (29)
ఉభే సంధ్యే ప్రకాశేతే దిశాం దాహసమన్వితే ।
పర్జన్యః పాంసువర్షీ చ మాంసవర్షీ చ భారత ॥ 30
ఉభయ సంధ్యాకాలాల్లోనూ దిక్కులు దహింపబడుతున్నట్లు వేడిగా ఉంటోంది. మేఘుడు దుమ్ము, మాంసం వర్షిస్తున్నాడు. (30)
యా చైషా విశ్రుతా రాజన్ త్రైలోక్యే సాధుసమ్మతా ।
అరుంధతీ తయాప్యేషః వసిష్ఠః పృష్ఠతః కృతః ॥ 31
రాజా! ముల్లోకాలలోను మహాపతివ్రతగా పరిగణింపబడే అరుంధతి తన భర్త అయిన వశిష్ఠుని తన వెనుక పెట్టుకొని ఉంటోంది. (పూర్వం వసిష్ఠుని వెనుక అరుంధతి ఉండేది) (31)
రోహిణీం పీడయన్నేషః స్థితో రాజన్ శనైశ్చరః ।
వ్యావృత్తం లక్ష్మ సోమస్య భవిష్యతి మహద్ భయమ్ ॥ 32
రాజా! శనిగ్రహం రోహిణీ నక్షత్రాన్ని పీడిస్తోంది. చంద్రుని గుర్తే కనిపించటం లేదు. ఇదంతా రాబోయే మహావిపత్తును సూచిస్తోంది. (32)
అనభ్రే చ మహాఘోరః స్తనితః శ్రూయతే స్వనః ।
వాహనానాం చ రుదతాం నిపతంత్యశ్రుబిందవః ॥ 33
ఆకాశంలో మేఘాలు లేకుండానే మహాఘోరంగా ఉరుములు వినిపిస్తున్నాయి. ఏడ్చే వాహనాల కన్నుల నుండి కన్నీటి బిందువులు రాలుతున్నాయి. (33)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి శ్రీవేదవ్యాసదర్శనే ద్వితీయోఽధ్యాయః ॥ 2 ॥
ఇది శ్రీమహాభారతమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున శ్రీవేదవ్యాస దర్శనమను రెండవ అధ్యాయము. (2)