3. మూడవ అధ్యాయము
అశుభ శకునములను విజయ లక్షణములను వ్యాసుడు వర్ణించుట.
వ్యాస ఉవాచ
ఖరా గోషు ప్రజాయంతే రమంతే మాతృభిః సుతాః ।
అనార్తవం పుష్పఫలం దర్శయంతి వనద్రుమాః ॥ 1
వ్యాసుడు చెపుతున్నాడు. గోవులకు గాడిదలు పుడుతున్నాయి. బిడ్డలు తల్లులతో రమిస్తున్నాయి. చెట్లకు అకాలంలో పూలూ, పండ్లూ పుడుతున్నాయి. (1)
గర్భిణ్యోఽజాతపుత్రాశ్చ జనయంతి విభీషణాన్ ।
క్రవ్యాదాః పక్షిభిశ్చాపి సహాశ్నంతి పరస్పరమ్ ॥ 2
గర్భవతులు పుత్రులను కనటంలేదు. భయంకర మృగాలను కంటున్నారు. మాంసాహారు లయిన మృగాలు పక్షులతో కలిసిమెలిసి ఆహారం తింటున్నాయి. (2)
త్రివిషాశ్చతుర్నేత్రాః పంచపాదా ద్విమేహనాః ।
ద్విశీర్షాశ్చ ద్విపుచ్ఛాశ్చ దంష్ట్రిణః పశవోఽశివాః ॥ 3
జాయంతే వివృతాస్యాశ్చ వ్యాహరంతో శివా గిరః ।
మూడేసి కొమ్ములు, నాలుగేసి కన్నులు, ఐదేసి కాళ్లు, రెండు మూత్రేంద్రియాలు, రెండు తలలు, రెండు తోకలు, చాలా కోరలు కల మృగాలు పుడుతున్నాయి. అవి నోళ్లు తెరిచి అశుభంకరంగా అరుస్తున్నాయి. (3)
త్రిపదాః శిఖినస్తార్ క్ష్యాః చతుర్దంష్ట్రా విషాణినః ।
తథైవాన్యాశ్చ దృశ్యంతే స్త్రియో వై బ్రహ్మవాదినామ్ ।
వైనతేయాన్ మయూరాంశ్చ జనయంతి పురే తవ ॥ 5
నీ పట్టణంలోని విప్రస్త్రీలు గరుడపక్షులను, నెమళ్లను కంటున్నారు. వాటికి మూడేసి కాళ్లు, నాలుగేసి కోరలు, కొమ్ములు ఉన్నాయి. ఇలాగే ఇతర స్త్రీలూ కనిపిస్తున్నారు. (4,5)
గోవత్సం వడవా సూతే శ్వా సృగాలం మహీపతే ।
కుక్కురాన్ కరభాశ్చైవ శుకాశ్చాశుభవాదినః ॥ 6
ఆడుగుర్రం ఆవు దూడను, కుక్క నక్కపిల్లను కంటున్నాయి. ఏనుగులు కుక్కలను కంటున్నాయి. చిలుకలు కూడ అమంగళకరంగా కూస్తున్నాయి. (6)
స్త్రియః కాశ్చిత్ప్రజాయంతే చతస్రః పంచ కన్యకాః ।
జాతమాత్రాశ్చ నృత్యంతి గాయంతి చ హసంతి చ ॥ 7
కొంతమంది స్త్రీలు నలుగురు అయిదుగురు కన్యలను ప్రసవిస్తున్నారు. వారు పుట్టడంతోనే నృత్యం చేస్తున్నారు. పాడుతున్నారు - నవ్వుతున్నారు. (7)
పృథగ్జనస్య సర్వస్య క్షుద్రకాః ప్రహసంతి చ ।
నృత్యంతి పరిగాయంతి వేదయంతో మహద్ భయమ్ ॥ 8
క్షుద్రులయిన బాలకులందరు నవ్వుతూ పాడుతూ నర్తిస్తున్నారు. ఇది మహాభయాన్ని సూచిస్తోంది. (8)
ప్రతిమాశ్చాలిఖంత్యేతాః సశస్త్రాః కాలచోదితాః ।
అన్యోన్యమభిధావంతి శిశవో దండపాణయః ॥ 9
వీరంతా శాస్త్రాలు దాల్చి, కాలప్రేరితులై ప్రతిమలు చిత్రిస్తున్నారు. గాలిలో వ్రాస్తున్నారు. శిశువులు చేతులలో దండాలు ధరించి, పరస్పరం దాడి చేస్తున్నారు. (9)
అన్యోన్యమభిమృద్నంతి నగరాణి యుయుత్సవః ।
పద్మోత్పలాని వృక్షేషు జాయంతే కుముదాని చ ॥ 10
బాలురు నగరాలు సృష్టించుకొని యుద్ధం చేస్తూన్నట్లు, వాటిని పడగొట్టుతున్నారు. పద్మాలు, కలువలు వృక్షాల మీద మొలుస్తున్నాయి. (10)
విష్వగ్వాతాశ్చ వాంత్యుగ్రాః రజో నాప్యుపశామ్యతి ।
అభీక్ష్ణం కంపతే భూమిః అర్కం రాహురుపైతి చ ॥ 11
సుడిగాలులు లేచి, భయంకరంగా ధూళి వ్యాపించి, తగ్గటంలేదు. మాటిమాటికి భూమి కంపిస్తోంది. రాహువు సూర్యునికి దగ్గరగా పోతున్నాడు.. (11)
శ్వేతో గ్రహస్తథా చిత్రాం సమతిక్రమ్య తిష్ఠతి ।
అభావం హి విశేషేణ కురూణాం తత్ర పశ్యతి ॥ 12
కేతుగ్రహం చిత్రా నక్షత్రాన్ని దాటి, స్వాతి నక్షత్రం మీద నిలిచింది. అది విశేషించి కౌరవుల వినాశాన్ని సూచిస్తోంది. (12)
వి॥ రాహుకేతువులు ఒక దాని కొకటి ఏడవ రాశిలో ఉంటాయి. కాని ఇపుడా గ్రహాలు ఒకే రాశిలోకి వచ్చాయి.
ధూమకేతుర్మహాఘోరః పుష్యం చాక్రమ్య తిష్ఠతి ।
సేనయోరశివం ఘోరం కరిష్యతి మహాగ్రహః ॥ 13
ఘోర మయిన ధూమకేతుమహాగ్రహం పుష్య నక్షత్రం ఆక్రమించి నిలిచింది. ఇది సేనలకు ఘోరమైన అశుభాన్ని కలిగిస్తుంది. (13)
మఘాస్వంగారకో వక్రః శ్రవణే చ బృహస్పతిః ।
భగం నక్షత్రమాక్రమ్య సూర్యపుత్రేణ పీడ్యతే ॥ 14
అంగారక గ్రహం వక్రగమనంతో మఘానక్షత్రం మీద నిలిచింది. గురుగ్రహం శ్రవణా నక్షత్రం మీద ఉంది. శని పుబ్బవద్దకు పోయి దాన్ని పీడిస్తున్నాడు. (14)
శుక్రః ప్రోష్ఠపదే పూర్వే సమారుహ్య విరోచతే ।
ఉత్తరే తు పరిక్రమ్య సహితః సముదీక్షతే ॥ 15
శుక్రుడు పూర్వాభాద్ర మీద ఉండి అన్నివైపుల తిరుగుతూ, పరిఘమనే ఉపగ్రహంతో కూడా ఉత్తరాభాద్ర నక్షత్రం మీదకు చూస్తున్నాడు. (15)
శ్వేతో ప్రోష్ఠపదే పూర్వే సమారుహ్య విరోచతే ।
ఐంద్రం తేజస్వి నక్షత్రం జ్యేష్ఠామాక్రమ్య తిష్ఠతి ॥ 16
కేతుగ్రహం పొగతో నిండిన అగ్నివలె మండుతూ, ఇంద్ర సంబంధమైన జ్యేష్ఠానక్షత్రం మీద నిలిచింది. (16)
ధ్రువం ప్రజ్వలితో ఘోరమ్ అపసవ్యం ప్రవర్తతే ।
రోహిణీం పీడయత్యేవమ్ ఉభౌ చ శశిభాస్కరౌ ।
చిత్రాస్వాత్యంతరే చైవ విష్టితః పరుషగ్రహః ॥ 17
చిత్రా స్వాతి నక్షత్రాల మధ్యనున్న క్రూర గ్రహమైన రాహువు స్థిరంగా వక్రించి రోహిణిని, సూర్య చంద్రులను పీడిస్తోంది. అది జ్వలిస్తూ ధ్రువానికి ఎడమవైపున పోతోంది. ఈ గ్రహయోగం అనిష్టాన్ని సూచిస్తోంది. (17)
వక్రానువక్రం కృత్వా చ శ్రవణం పావకప్రభః ।
బ్రహ్మరాశిం సమావృత్య లోహితాంగో వ్యవస్థితః ॥ 18
అగ్నికాంతి కల కుజగ్రహం మఘా నక్షత్రంలో ఉంటోంది. అది మాటిమాటికీ వక్రిస్తూ బృహస్పతితో కూడిన నక్షత్రమైన శ్రవణాన్ని కప్పివేస్తోంది. (18)
సర్వసస్యపరిచ్ఛన్నా పృథివీ సస్యమాలినీ ।
పంచశీర్షా యవాశ్చాపి శతశీర్షాశ్చ శాలయః ॥ 19
ఈ సమయంలో భూమి అంతా ఎన్నోపంటలతో నిండి ఉంటుంది. ఉంది కూడ - యవ పైర్లలో ఒక్కొక్క మొలకకు ఐదేసి కంకులు, వరి మొక్కలలో ఒక్కొక్క మొక్కకు వందేసి కంకులు పెరుగుతున్నాయి. (19)
ప్రధానాః సర్వలోకస్య యాస్వాయత్తమిదం జగత్ ।
తా గావః ప్రస్నుతా వత్సైః శోణితం ప్రక్షరంత్యుత ॥ 20
లోకమంతటను ప్రధానమైనవి ఆవులు. వాని యందే లోకం నిలిచి ఉంది. ఆ ఆవుల దూడలు పాలుకుడుస్తుంటే రక్తం కారుతోంది. (20)
నిశ్చేరురర్చిషశ్చాపాత్ ఖడ్గాశ్చ జ్వలితా భృశమ్ ।
వ్యక్తం పశ్యంతి శస్త్రాణి సంగ్రామం సముపస్థితమ్ ॥ 21
వీరుల ధనుస్సుల నుండి అగ్నిజ్వాలలు వెలువడుతున్నాయి. కత్తులు బాగా మెరిసిపోతున్నాయి. ఇదంతా యుద్ధం వస్తోందని సూచిస్తోంది. (21)
అగ్నివర్ణా యథా భాసః శస్త్రాణాముదకస్య చ ।
కవచానాం ధ్వజానాం చ భవిష్యతి మహాక్షయః ॥ 22
ఆయుధాలు, నీళ్లు, కవచాలు, ధ్వజాలు అన్నీ అగ్ని రంగులో భాసిస్తున్నాయి. ఇది రాబోయే మహావినాశాన్ని సూచిస్తోంది. (22)
పృథివీ శోణితావర్తా ధ్వజోడుపసమాకులా ।
కురూణాం వైశసే రాజన్ పాండవైః సహ భారత ॥ 23
భూమి అంతా రక్తపు సుడులతో, ధ్వజాలనే తెప్పలతో నిండి ఉంటోంది. ఈ పరిస్థితి పాండవులు కౌరవులను హింసించేటప్పటి పరిస్థితి రాజా! (23)
దిక్షు ప్రజ్వలితాస్యాశ్చ వ్యాహరంతి మృగద్విజాః ।
అత్యాహితం దర్శయంతః వేదయంతి మహద్ భయమ్ ॥ 24
మృగాలూ, పక్షులూ మండే నోళ్లతో అన్ని దిక్కులా అరుస్తున్నాయి. రాబోయే కష్టాన్ని, భయాన్ని అవి సూచిస్తున్నాయి. (24)
ఏకపక్షాక్షిచరణః శకునిః ఖచరో నిశి ।
రౌద్రం వదతి సంరబ్ధః శోణితం ఛర్దయన్నివ ॥ 25
రాత్రి పూట ఆకాశంలో ఒకే కన్ను, ఒకే రెక్క, ఒకే కాలు గల పక్షి తిరుగుతోంది. కోపంతో రక్తం క్రక్కుతోందా అన్నట్లు కూస్తోంది. (25)
శస్త్రాణి చైవ రాజేంద్ర ప్రజ్వలంతీవ సంప్రతి ।
సప్తర్షీణాముదారాణాం సమవచ్ఛాద్యతే ప్రభా ॥ 26
రాజా! ఇపుడు కూడ ఆయుధాలన్నీ కాలిపోతున్నట్లు కనిపిస్తోంది. ఉదారులయిన సత్పర్షుల కాంతి తరిగిపోతున్నట్లు అనిపిస్తోంది. (26)
సంవత్సరస్థాయినౌ చ గ్రహౌ ప్రజ్వలితావుభౌ ।
విశాఖాయాః సమీపస్థౌ బృహస్పతిశనైశ్చరౌ ॥ 27
సంవత్సరందాకా ఒకే రాశిలో ఉండే గురు శనులిద్దరూ 'తిర్యగ్వేధ' ద్వారా విశాఖా సమీపానికి వచ్చారు. (27)
చంద్రదిత్యావుభౌ గ్రస్తౌ ఏకాహ్నా హి త్రయోదశీమ్ ।
అపర్వణి గ్రహం యాతౌ ప్రజాసంక్షయమిచ్ఛతః ॥ 28
తిథిక్షయం రావడం వల్ల త్రయోదశి ఒకే రోజున, పర్వం రాకపోయినా, రాహువు చంద్రసూర్యులిద్దరినీ మ్రింగింది. ఈ సూర్యచంద్రగ్రహణం ప్రజాసంహారాన్ని కోరుతోంది. (28)
అశోభితా దిశః సర్వాః పాంసువర్షైః సమంతతః ।
ఉత్పాతమేఘా రౌద్రాశ్చ రాత్రౌ వర్షంతి శోణితమ్ ॥ 29
దిక్కులన్నీ ధూళి వర్షం కురవడంతో శోభారహితంగా ఉన్నాయి. ఉత్పాతాన్ని సూచిస్తూ మేఘాలు రాత్రి పూట భయంకరంగా రక్తం వర్షిస్తున్నాయి. (29)
కృత్తికాం పీడయంస్తీక్ ష్టైః నక్షత్రం పృథివీపతే ।
అభీక్ష్ణవాతా వాయంతే ధూమకేతుమవస్థితాః ॥ 30
రాహుగ్రహం చిత్రా - స్వాతి నక్షత్రాల మధ్య ఉండి (సర్వతో భద్ర చక్రవేధ ననుసరించి) కృత్తికా నక్షత్రాన్ని పీడిస్తోంది. ధూమ కేతువును ఆశ్రయించి సుడిగాలులు వీస్తున్నాయి. (30)
విషమం జనయంత్యేతే ఆక్రందజననం మహత్ ।
త్రిషు సర్వేషు నక్షత్రనక్షత్రేషు విశాంపతే ।
గృధ్రః సంపతతే శీర్షం జనయన్ భయముత్తమమ్ ॥ 31
ఈ విషమపరిస్థితి మిక్కిలి భయంకర యుద్ధాన్ని సూచిస్తోంది. ఇరవై ఏడు నక్షత్రాలను వరుసగా మూడు మూడుగా విభజిస్తే ఒక్కొక్క విభాగంలో తొమ్మిదేసి నక్షత్రాలుంటాయి. వీటికి వరుసగా అశ్వపతి, గజపతి, నరపతి ఛత్రాలని పేరు. ఈ మూడింటికి నక్షత్ర నక్షత్రాలని పేరు. ఈ మూడింటి పైన పాపగ్రహ వేధ కలిగితే చాలా భయావహంగా నుంటుంది. ఇపుడా కుయోగం కలిగింది. అందుచే ప్రజానాశం తప్పదు. (31)
చతుర్దశీం పంచదశీం భూతపూర్వాం చ షోడశీమ్ ।
ఇమాం తు నాభిజానేఽహమ్ అమావాస్యాం త్రయోదశీమ్ ।
చంద్రసూర్యావుభౌ గ్రస్తౌ ఏకమాసీం త్రయో దశీమ్ ॥ 32
సామాన్యంగా పక్షంలో ఒక తిథిక్షయం వచ్చి, పదునాల్గవ తిథి క్షయం కాకపోతే పదిహేనవరోజు అమావాస్య వస్తుంది. ఒక తిథి అధిక మయినపుడు పదునాల్గవ రోజే అమావాస్య వస్తుంది. కాని ఈ పక్షంలో పదుమూడవ రోజుననే అమావాస్య వచ్చింది. ఇలా పూర్వం కూడ ఒకప్పుడు వచ్చింది. కాని నాకు జ్ఞాపకం లేదు. ఈ నెలలోనే పదుమూడు రోజుల్లో చంద్ర-సూర్యగ్రహణాలు రెండూ వచ్చాయి. (32)
అపర్వణి గ్రహేణైతౌ ప్రజాః సంక్షపయిష్యతః ।
మాంసవర్షం పునస్తీవ్రమ్ ఆసీత్ కృష్ణచతుర్దశీమ్ ।
శోణితైర్వక్త్రసంపూర్ణా అతృప్తాస్తత్ర రాక్షసాః ॥ 33
ఇలా అప్రసిద్ధ పర్వాల్లో గ్రహణాలు రావడం చేత ప్రజావినాశం కలుగుతుంది. కృష్ణ చతుర్దశి రోజున తీవ్రంగా మాంస వర్షం కురిసింది. రాక్షసుల నోళ్లు రక్తంతో నిండినా తృప్తి కలగటంలేదు. (33)
ప్రతిస్రోతో మహానద్యః సరితః శోణితోదకాః ।
ఫేనాయమానాః కూపాశ్చ కూర్దంతి వృషభా ఇవ ॥ 34
మహానదులలో రక్తం ఎదురు ప్రవహిస్తోంది. నూతుల నుండి నురుగు ఎద్దుల వలె పైకి ఎగురుతోంది. (34)
పతంత్యుల్కా సనిర్ఘాతాః శక్రాశనిసమప్రభాః ।
అద్య చైవ నిశాం వ్యుష్టామ్ అనయం సమవాప్స్యథ ॥ 35
వజ్రాయుధ సమానమైన కాంతితో, పిడుగులతో ఉల్కలు నేలరాలుతున్నాయి. మీరు చేసిన అన్యాయానికి తగిన ఫలం రేపు ఉదయం నుండే మీరు పొందుతారు. (35)
వినిఃసృత్య మహోల్కాభిః తిమిరం సర్వతోదిశమ్ ।
అన్యోన్యముపతిష్ఠద్భిః తత్ర చోక్తం మహర్షిభిః ॥ 36
అన్ని దిక్కులా చీకటి ఆవరించింది - మహర్షులు దివిటీలతో బయటకు వచ్చి, ఇలా అనుకొంటున్నారు. (36)
భూమిపాలసహస్రాణాం భూమిః పాస్యతి శోణితమ్ ।
కైలాసమందరాభ్యాం తు తథా హిమవతా విభో ॥ 37
సహస్రశో మహాశబ్దః శిఖరాణి పతంతి చ ।
ఈ భూమి వేలకొద్దీ రాజుల రక్తం త్రాగుతుంది. కైలాస, మందర, హిమవత్పర్వతాల నుండి ఎన్నో భయంకర శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ పర్వత శిఖరాలు ఒరిగి పడుతున్నాయి కూడ. (37)
మహాభూతా భూమికంపే చత్వారః సాగరాః పృథక్ ।
వేలాముద్వర్తయంతీవ క్షోభయంతో వసుంధరామ్ ॥ 38
భూకంపం వల్ల నాలుగు సముద్రాలు వేరు వేరుగా పొంగి, చెలియలి కట్టలు దాటి భూమిని క్షోభింపజేస్తున్నాయి. (38)
వృక్షానున్మథ్య వాంత్యుగ్రాః వాతాః శర్కరకర్షిణః ।
ఆభగ్నాః సుమహావాతైః అశనీభిః సమాహతాః ॥ 39
వృక్షాః పతంతి చైత్యశ్చ గ్రామేషు నగరేషు చ ।
సుడిగాలులు ఇసుక, గులకరాళ్లను ఎగుర గొడుతూ చెట్లను పెకలిస్తున్నాయి. గ్రామాల్లో, నగరాల్లో వృక్షాలు, రచ్చపట్టంలో ఉండే వృక్షాలు గాలిచేత, పిడుగుల చేత విరిగి పడుతున్నాయి. (39 1/2)
నీలలోహితపీతశ్చ భవత్యగ్నిర్హుతో ద్విజైః ॥ 40
వామార్చిర్దుష్టగంధశ్చ ముంచన్ వై దారుణం స్వనమ్ ।
స్పర్శా గంధా రసాశ్చైవ విపరీతా మహీపతే ॥ 41
ద్విజుల హోమాగ్నులు నల్లగా, ఎర్రగా, పసుపు పచ్చగా కనబడుతున్నాయి. అప్రదక్షిణంగా లేస్తున్నాయి. వాటి నుండి దుర్వాసన వస్తోంది. రాజా! స్పర్శ, గంధం, రసం వ్యతిరేక గుణాలతో కనిపిస్తున్నాయి. (40,41)
ధూమం ధ్వజాః ప్రముంచంతి కంపమానా ముహుర్ముహుః ।
ముంచంత్యంగారవర్షం చ భేర్యశ్చ పటహాస్తథా ॥ 42
ధ్వజాలు మాటిమాటికి ఊగిపోతూ పొగలు క్రక్కుతున్నాయి. భేరులు, పటహాలు నిప్పులు కురుస్తున్నాయి. (42)
శిఖరాణాం సమృద్ధానామ్ ఉపరిష్టాత్ సమంతతః ।
వాయసాశ్చ రువంత్యుగ్రం వామం మండలమాశ్రితాః ॥ 43
పూలూ, పండ్లూ నిండిన చెట్ల పైభాగాల్లో అపసవ్యంగా తిరుగుతూ వచ్చి, కాకులు భయంకరంగా అరుస్తున్నాయి. (43)
పక్వాపక్వేతి సుభృశం వావాశ్యంతే వయాంసి చ ।
నిలీయంతే ధ్వజాగ్రేషు క్షయాయ పృథివీక్షితామ్ ॥ 44
పక్షులు మాటిమాటికి పక్వా-పక్వా అని అరుస్తూ ధ్వజాగ్రాల మీద దాక్కుంటున్నాయి. ఇది రాజుల వినాశాన్ని సూచిస్తోంది. (44)
ధ్యాయంత ప్రకిరంతశ్చ వ్యాలా వేపథుసంయుతాః ।
దీనాస్తురంగమాః సర్వే వారణాః సలిలాశ్రయాః ॥ 45
ఏనుగులు వణికిపోతూ నీటిని చిమ్ముతున్నాయి. గుర్రాలు దీనంగా చూస్తున్నాయి. ఏనుగులు నీటిని చేరుతున్నాయి. (45)
ఏతచ్ఛ్రుత్వా భవానత్ర ప్రాప్తకాలం వ్యవస్యతామ్ ।
యథా లోకః సముచ్ఛేదం నాయం గచ్ఛేత భారత ॥ 46
ఈ దుశ్శకునాలు విని, లోకమంతా నశించిపోకుండా తగిన ఉపాయాన్ని ఏదయినా నీవు ఆలోచించు. (46)
వైశంపాయన ఉవాచ
పితుర్వచో నిశమ్యైతద్ ధృతరాష్ట్రోఽబ్రవీదిదమ్ ।
దిష్టమేతత్ పురా మన్యే భవిష్యతి నరక్షయః ॥ 47
వైశంపాయనుడు అంటున్నాడు.
తండ్రి మాటలు విని ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు. "ఇది దైవ సంకల్పం అనుకొంటున్నాను. జననాశం తప్పదు.(47)
రాజానః క్షత్రధర్మేణ యది వధ్యంతి సంయుగే ।
వీరలోకం సమాసాద్య సుఖం ప్రాప్స్యంతి కేవలమ్ ॥ 48
రాజులు రాజధర్మంతో యుద్ధంలో సంహరింపబడితే వీరలోకమే పొంది సుఖిస్తారు. (48)
ఇహ కీర్తిం పరే లోకే దీర్ఘకాలం మహత్ సుఖమ్ ।
ప్రాప్త్యంతి పురుషవ్యాఘ్రాః ప్రాణాంస్త్వక్త్వా మహాహవే ॥ 49
ఈ లోకంలో కీర్తిని పొంది, యుద్ధంలో ప్రాణాలు విడిచి పురుష సింహులు చాలాకాలం పరలోకంలో సుఖిస్తారు." (49)
వైశంపాయన ఉవాచ
ఏవముక్తో మునిస్తత్త్వం కవీంద్రో రాజసత్తమ ।
ధృతరాష్ట్రేణ పుత్రేణ ధ్యానమన్వగమత్ పరమ్ ॥ 50
వైశంపాయనుడు అంటున్నాడు.
రాజశ్రేష్ఠా! తనకొడుకు అయిన ధృతరాష్ట్రుడు ఇలా తత్త్వం చెపితే వ్యాసుడు ధ్యానసమాధి మగ్నుడయ్యాడు. (50)
స ముహూర్తం తథా ధ్యాత్వా పునరేవాబ్రవీద్ వచః ।
అసంశయం ప్రార్థివేంద్ర కాలః సంక్షిపతే జగత్ ॥ 51
సృజతే చ పునర్లోకాన్ నేహ విద్యతి శాశ్వతమ్ ।
ముహూర్తకాలం అలా ధ్యానించి మళ్లీ అన్నాడు. "రాజా! నిజమే. నిస్సంశయంగా కాలుడు జగత్తును సంహరిస్తాడు. మళ్లీ సృష్టిస్తాడు. ఇక్కడ ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు. (51 1/2)
జ్ఞాతీనాం వై కురూణాం చ సంబంధిసుహృదాం తథా ॥ 52
ధర్మ్యం దేశయ పంథానం సమర్థో హ్యసి వారణే ।
క్షుద్రం జాతివధం ప్రాహుః మాకురుష్వ మమాప్రియమ్ ॥ 53
అందుచేత బంధువులకు, కౌరవులకు, మిత్రులకు ధర్మానుకూలమయిన మార్గం ఉపదేశించు. నీవు వారించడానికి సమర్థుడవు - జ్ణాతులను వధించడం చాలా నీచపుపని. అది నాకు ఇష్టంకాదు - ఆ అప్రియం మాత్రం చేయకు. (52,53)
కాలోఽయం పుత్రరూపేణ తవ జాతో విశాంపతే ।
న వధః పూజ్యతే వేదే హితం నైవ కథంచన ॥ 54
పుత్ర రూపంలో నీకు కాలుడు పుట్టాడు. రాజా! వేదాలు వధను ప్రశంసించవు - అది ఏవిధంగానూ హితం కాదు. (54)
హన్యాత్ స ఏవం యో హన్యాత్ కులధర్మం స్వికాం తమమ్ ।
కాలేనోత్పథగంతాసి శక్యే సత్ యథాపది ॥ 55
కులధర్మం శరీరం వంటిది. దాన్ని నశింపజేసిన వానిని ఆ ధర్మమే నశింపజేస్తుంది. నీకు నివారించటానికి శక్యమే అయినా కాలప్రేరణతో అపమార్గంలో పయనించావు - ఆపదలలో ప్రవర్తించినట్లు. (55)
కులస్యాస్య వినాశాయ తథైవ చ మహీక్షితామ్ ।
అనర్థో రాజ్యరూపేణ తవ జాతో విశాంపతే ॥ 56
రాజా! నీ యీ ప్రవర్తన కులానికీ ఈ రాజులకు వినాశం కోసం వచ్చింది. అనర్థం రాజ్యరూపంలో నీకు పుట్టింది. (56)
లుప్తధర్మా పరేణాపి ధర్మం దర్శయ వై సుతాన్ ।
కిం తే రాజ్యేన దుర్ధర్ష యేన ప్రాప్తోఽసి కిల్బిషమ్ ॥ 57
నీ దగ్గర పూర్తిగా ధర్మం లోపించి పోయింది. నీ కొడుకులకు ధర్మాన్ని చూపించు. నీకింకా రాజ్యం ఎందుకు? దాని వల్ల నీవు పాపం ఎందుకు మూటగట్టుకొంటున్నావు? (57)
యశో ధర్మం చ కీర్తిం చ పాలయన్ స్వర్గమాప్య్ససి ।
లభంతాం పాండవా రాజ్యం శమం గచ్ఛంతు కౌరవాః ॥ 58
యశస్సును, ధర్మాన్ని, కీర్తిని పాలిస్తే స్వర్గం పొందుతావు. పాండవులు రాజ్యం పొందుదురు గాక - సంధితో కౌరవులు శాంతించుదురు గాక." (58)
ఏవం బ్రువతి విప్రేంద్రే ధృతరాష్ట్రోఽంబికాసుతః ।
ఆక్షిప్య వాక్యం వాక్యజ్ఞో వాక్యం చైవాబ్రవీత్ పునః ॥ 59
విప్రశ్రేష్ఠుడైన వ్యాసుడు ఇలా అంటూ ఉండగానే వాక్యజ్ఞుడు, అంబికాసుతుడు అయిన ధృతరాష్ట్రుడు అందుకొని వ్యాసునితో మరల ఇలా అన్నాడు. (59)
ధృతరాష్ట్ర ఉవాచ
యథా భవాన్ వేత్తి తథైవ వేత్తా
భావాభావౌ విదితౌ తే యథార్థౌ ।
స్వార్థే హి సమ్ముహ్యతి తాత లోకః
మాం చాపి లోకాత్మకమేవ విద్ధి ॥ 60
ధృతరాష్ట్రుడు అన్నాడు.
"తండ్రీ! నీకు ఎలా తెలుసునో అలాగే నేనూ తెలుసుకొంటాను. భావాలు, అభావాలు నీకు తెలిసినట్టే నాకూ తెలుసు. కాని లోకమంతా స్వార్థంతో మోహపడుతుంది. నన్ను కూడా లోకాత్మకుడనే (లోకంలో ఒకడిగానే) గ్రహించు తండ్రీ! (60)
ప్రసాదయే త్వామతులప్రభావం
త్వం నో గతిర్దర్శయితా చ ధీరః ।
న చాపి తే మద్వశగా మహర్షే
న చాధర్మం కర్తుమర్హా హి మే మతిః ॥ 61
మహర్షీ! నీ ప్రభావం సాటిలేనిది. నీవే మాకు గతి మార్గదర్శకుడవు. ధీరుడవు, అనుగ్రహించు. నా పుత్రులు నా వశంలో లేరు. కాని నా మనస్సు అధర్మం చేయదగింది కాదు. (61)
త్వం హి ధర్మప్రవృత్తిశ్చ యశః కీర్తిశ్చ భారతీ ।
కురుణాం పాండవానాం చ మాన్యశ్చాపి పితామహః ॥ 62
నీవే మా భరతవంశీయులకు ధర్మం, యశస్సు, కీర్తి కలిగించ గలవాడవు. కౌరవ పాండవులకు మాన్యుడవూ, పితామహుడవు." (62)
వ్యాస ఉవాచ
వైచిత్రవీర్య నృపతే యత్ తే మనసి వర్తతే ।
అభిధత్స్వ యథాకామం ఛేత్తాస్మి తవ సంశయమ్ ॥ 63
అపుడు వ్యాసుడిలా అన్నాడు.
"వైచిత్రవీర్య మహారాజా! నీ మనసులో ఉన్నదేదో చెప్పు. నీ కోరిక ప్రకారం నీ సందేహం తీరుస్తాను." (63)
ధృతరాష్ట్ర ఉవాచ
యాని లింగాని సంగ్రామే భవంతి విజయిష్యతామ్ ।
తాని సర్వాణి భగవన్ శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ॥ 64
అపుడు ధృతరాష్ట్రుడు అన్నాడు. "భగవన్! యుద్ధంలో విజయం పొందే వారికి ఏ శుభశకునాలు కనిపిస్తాయో వాటిని వినాలనుకొంటున్నాను." (64)
వ్యాస ఉవాచ
ప్రసన్నాభాః పావక ఊర్ధ్వరశ్మిః
ప్రదక్షిణావర్తశిఖో విధూమః ।
పుణ్యా గంధాశ్చాహుతీనాం ప్రవాంతి
జయస్యైతద్ భావినో రూపమాహుః ॥ 65
వ్యాసుడు చెపుతున్నాడు. "హోమం చేస్తే అగ్ని హోత్రుని జ్వాలలు ప్రసన్నమైన కాంతితో, ఊర్ధ్వభాగానికి పోతూ ఉంటాయి. మంటలు ప్రదక్షిణంగా తిరుగుతూ పొగలేకుండా ఉంటాయి. ఆహుతులు వేస్తే సుగంధం వీస్తుంది. ఇది భావిజయసూచకం అంటారు. (65)
గంభీరఘోషాశ్చ మహాస్వనాశ్చ
శంఖా మృదంగాశ్చ నదంతి యత్ర ।
విశుద్ధరశ్మిస్తపనః శశీ చ
జయస్యైతద్ భావినో రూపమాహుః ॥ 66
శంఖాలు మృదంగాలు, పెద్దగా గంభీరంగా నినదిస్తాయి. అతనిపై సూర్యచంద్రులు శుద్ధమయిన కిరణాలు ప్రసరింపజేస్తారు. ఇది జయ సూచకం అంటారు. (66)
ఇష్టా వాచః ప్రసృతా వాయసానాం
సంప్రస్థితానాం చ గమిష్యతాం చ ।
యే పృష్ఠతస్తే త్వరయంతి రాజన్
యే చాగ్రతస్తే ప్రతిషేధయంతి ॥ 67
యుద్ధానికి వెడదామనుకొన్నపుడు కాని, బయలు దేరుతున్నపుడు కాని కాకులు ఇష్టంగా కూస్తే అది విజయ సూచన - వెనుక వైపు నుండి కూస్తే త్వరపడమని, ముందు వైపు నుండి కూస్తే వద్దని చెపుతున్నట్లు భావం. (67)
కల్యాణవాచః శకునా రాజహంసాః
శుకాః క్రౌంచాః శతపత్రాశ్చ యత్ర ।
ప్రదక్షిణాశ్చైవ భవంతి సంఖ్యే
ధ్రువం జయస్తత్ర వదంతి విప్రాః ॥ 68
శుభప్రదంగా కూస్తూ హంసలు, చిలుకలు, క్రౌంచ పక్షులు, నెమళ్లు మొదలయినవి ప్రదక్షిణిస్తూ వెళ్లితే ఆ యుద్ధంలో వారికి నిశ్చయంగా జయం లభిస్తుందని విప్రులంటారు. (68)
అలంకారైః కవచైః కేతుభిశ్చ
సుఖప్రణాదైర్హేషితైర్వా హయానామ్ ।
భ్రాజిష్మతీ దుష్ప్రతి వీక్షణీయా
యేషాం చమూస్తే విజయంతి శత్రూన్ ॥ 69
సేన అలంకారాలతో, కవచాలతో, ధ్వజాలతో, శ్రవణ సుఖంగా ఉండే గుర్రపు సకిలింపులతో, శత్రువులకు చూడ శక్యం కాకుండా ఉంటే అది శత్రువులను జయిస్తుంది. (69)
హృష్టా వాచస్తథా సత్త్వం యోధానాం యత్ర భారత ।
న మ్లాయంతి స్రజశ్చైవ తే తరంతి రణోదధిమ్ ॥ 70
యోధుల సంభాషణలు సంతోష ఉత్సాహాలతో నిండియుంటే, మెడలోని పూలమాలలు వాడిపోకుండా ఉంటే ఆ సేన రణసాగరాన్ని తేలికగా దాటుతుంది. (70)
ఇష్టా వాచః ప్రవిష్టస్య దక్షిణాః ప్రవివిక్షతః ।
పశ్చాత్ సంధారయంత్యర్థమ్ అగ్రే చ ప్రతిషేధికాః ॥ 71
శత్రుసేనలో ప్రవేశింపగోరినపుడు కాని, ప్రవేశించాక కాని శౌర్యసూచక భాషణంతో తమ సామర్థ్యం చూప్తే వారు తమవిజయం పట్ల నిశ్చయం పొందుతారు. అలా కాక శత్రుపక్షం వారి నుండి నిషేధవాక్యాలు వింటే వారికి అపజయం కలుగుతుంది. (71)
శబ్దరూపరసస్పర్శ గంధాశ్చావికృతాః శుభాః ।
సదా హర్షశ్చ యోధానాం జయతామిహ లక్షణమ్ ॥ 72
యోధుల శబ్దసర్శ రూపరస గంధాలు వికృతంగా కాకుండా శుభప్రదంగా ఉంటే, వారికి సదా సంతోషం కలుగుతూ ఉంటే అది వారికి జయసూచకం. (72)
అనుగా వాయవో వాంతి తథాభ్రాణి వయాంసి చ ।
అనుప్లవంతి మేఘాశ్చ తథైవేంద్రధనూంషి చ ॥ 73
ఏతాని జయమానానాం లక్షణాని విశాంపతే ।
భవంతి విపరీతాని ముమూర్షూణాం జనాధిప ॥ 74
అనుకూలంగా గాలులు వీచడం, మేఘాలు పక్షులూ అనుకూలంగా వ్యాపించడం ధ్వనించడం, ఇంద్ర ధనుస్సు కనపడటం ఇవి విజయ సూచకాలు. చావు దగ్గరపడిన వారికి ఇవి వ్యతిరేకంగా కనిపిస్తాయి. (73,74)
అల్పాయాం వా మహత్యాం వా సేనాయామితి నిశ్చయః ।
హర్షో యోధగణస్యైకః జయలక్షణముచ్యతే ॥ 75
సేన చిన్నదయినా పెద్దదయినా కావచ్చు. యోధులంతా హర్షంతో నిండి ఉండటమే జయసూచకం. (75)
ఏకో దీర్ణో దారయతి సేనాం సుమహతీమపి ।
తాం దీర్ణామనుదీర్యంతే యోధాః శూరతరా అపి ॥ 76
నిరుత్సాహంతో పారిపోయేవాడు ఒక్కడున్నా వాని వెంట ఎంత పెద్దసేన అయినా, ఎంత శూరులయినా మిగిలిన వారంతా పారిపోతారు. (76)
దుర్నివర్త్యా తదా చైవ ప్రభగ్నా మహతీ చమూః ।
అపామివ మహావేగాః త్రస్తా మృగగణా ఇవ ॥ 77
మహావేగంతో ప్రవహించే నీటిని ఎవడూ అడ్డుకొని ఆపలేడు. భయంతో పారిపోయే మృగాలను ఎవరూ నిలుపలేరు. అలాగే విరిగిన సేనను మళ్లించడం కష్టం. (77)
నైవ శక్యా సమాధాతుం సంనిపాతే మహాచమూః ।
దీర్ణామిత్యేవ దీర్యంతే సువిద్వాంసోఽపి భారత ॥ 78
పారిపోయే వానిని చూస్తే ఎంతటి యోధుల కయినా భయం కలుగుతుంది. దానితో అందరూ ఉత్సాహం చచ్చి పారిపోతారు. (78)
భీతాన్ భగ్నాంశ్చ సంప్రేక్ష్య భయం భూయోఽభివర్ధతే ।
ప్రభగ్నా సహసా రాజన్ దిశో విద్రవతే చమూః ॥ 79
రాజా! భయపడి పారిపోయే వారినిచూస్తే మిగిలిన వారికీ భయం కలిగి సేన అంతా వెంటనే దిక్కులు పట్టి పారిపోతుంది. (79)
నైవ స్థాపయితుం శక్యా శూరైరపి మహాచమూః ।
సత్కృత్య మహతీం సేనాం చతురంగాం మహీపతిః ।
ఉపాయపూర్వం మేధావీ యతేత సతతోత్థితః ॥ 80
అంత పెద్ద సేన పారిపోతుంటే ఎంతటి శూరులయినా ఆ సేనను నిలువరింపలేరు. కావున తెలివయిన రాజు సదా ప్రయత్నపరుడై, ఉపాయంతో, సత్కారంతో ఆదరించి, సేనను తన ఆజ్ఞలో ఉంచుకోవాలి. (80)
ఉపాయవిజయం శ్రేష్ఠమ్ ఆహుర్భేదేన మధ్యమమ్ ।
జఘన్య ఏష విజయః యో యుద్ధేన విశాంపతే ॥ 81
రాజా! సామ దానోపాయాలతో సాధించే విజయం శ్రేష్ఠం. భేదోపాయంతో సాధించేది మధ్యమం. యుద్ధంలో దండోపాయంతో సాధించే విజయం అధమ మయినది. (81)
మహాదోషః సంనిపాతః తస్యాద్యః క్షయ ఉచ్యతే ।
పరస్పరజ్ఞాః సంహృష్టాః వ్యవధూతాః సునిశ్చితాః ॥ 82
పంచాశదపి యే శూరాః మృద్నంతి మహతీం చమూమ్ ।
అపి వా పంచ షట్ సప్త విజయంత్యనివర్తినః ॥ 83
యుద్ధం చాలా దోషాల పుట్ట. అందులో పెద్దదోషం జనక్షయం. ఒకరినొకరు తెలిసికొన గలవారు, సంతుష్టులు, ఇతర విషయాసక్తి లేక విజయాసక్తి మాత్రమే కల్గిన వీరులు ఏబది మంది అయినా పెద్దసేనను కూడా జయింపగలరు.
వెనుకంజవేయక పోరాడే వీరులు అయిదుగురో, ఆరుగురో, ఏడుగురో ఉన్నా జయిస్తారు. (82,83)
న వైనతేయో గరుడః ప్రశంసతి మహాజనమ్ ।
దృష్ట్వా సుపర్ణోఽపచితిం మహత్యా అపి భారత ॥ 84
భారతా! వినతాసుతుడు, సుపర్ణుడు అయిన గరుడుడు మహాసేన కూడా నశించిపోవటం చూసినవాడు కాబట్టి జనసమూహాన్ని గొప్పగా భావించడు. (84)
న బాహుల్యేన సేనాయాః జయో భవతి నిత్యశః ।
అధ్రువో హి జయో నామ దైవం చాత్ర పరాయణమ్ ।
జయవంతో హి సంగ్రామే కృతకృత్యా భవంతి హి ॥ 85
సైనికులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన జయం నిత్యమూ కలుగదు. జయం తరచుగా నిశ్చితం కాదు. జయానికి దైవమే గతి. యుద్ధంలో జయం పొందినవారే కృతకృత్యులు." (85)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి నిమిత్తాఖ్యానే తృతీయోఽధ్యాయః ॥ 3 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున నిమిత్తములను చెప్పుట అను మూడవ అధ్యాయము. (3)