5. అయుదవ అధ్యాయము

పంచమహాభూతములను, సుదర్శన ద్వీపమును వర్ణించుట.

ధృతరాష్ట్ర ఉవాచ
నదీనాం పర్వతానాం చ నామధేయాని సంజయ ।
తథా జనపదానాం చ యే చాణ్యే భూమిమాశ్రితాః ॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా ప్రశ్నించాడు.
"సంజయా! ఈ భూమిని ఆశ్రయించి ఉండే నదులు, పర్వతాలు, దేశాలు మొదలయిన వాటిని గురించి చెప్పు. (1)
ప్రమాణాం చ ప్రమాణజ్ఞ పృథివ్యా మమ సర్వతః ।
నిఖిలేన సమాచక్ష్వ కాననాని చ సంజయ ॥ 2
సంజయా! భూమి ప్రమాణం నీకు తెలుసును కదా! వాటి నన్నిటినీ, వనాలనూ గూర్చి పూర్తిగా చెప్పు." (2)
సంజయ ఉవాచ
పంచేమాని మహారాజ మహాభూతాని సంగ్రహాత్ ।
జగతీస్థాని సర్వాణి సమాన్యాహుర్మనీషిణః ॥ 3
సంజయుడు చెపుతున్నాడు. "మహారాజా! ఈ భూమి మీద వస్తువులన్నీ పంచభూతాల స్వరూపాలే. అందుకే పండితులు వాటికి సమములని పేరు పెట్టారు. (3)
భూమిరాపస్తథా వాయుః అగ్నిరాకాశమేవ చ ।
గుణోత్తరాణి సర్వాణి తేషాం భూమిః ప్రధానతః ॥ 4
ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి - ఈ అయిదూ మహాభూతాలు. వీనిలో క్రమంగా ఒక్కొక్క గుణం అధికంగా ఉంటుంది. అందుచేత అయిదు గుణాలున్న భూమి ప్రధానమైంది. (4)
శబ్దః స్పర్శశ్చ రూపం చ రసో గంధశ్చ పంచమః ।
భూమేరేతే గుణాః ప్రోక్తాః ఋషిభిస్తత్త్వవేదిభిః ॥ 5
రాజా! ఈ భూమికి శబ్దం స్పర్శ, రూపం, రసం, గంధం అని అయిదు గుణాలు ఉన్నాయి. (ఆకాశానికి శబ్ధం; వాయువుకు శబ్ద-స్పర్శలు; అగ్నికి శబ్దస్పర్శ రూపాలు; జలానికి శబ్ద, స్పర్శ, రూప రసాలు; భూమికి గంధంతో కలిపి అయిదు గుణాలు ఉన్నాయి.) (5)
చత్వారోఽప్సు గుణా రాజన్ గంధస్తత్ర న విద్యతే ।
శబ్ధః స్పర్శశ్చ రూపం చ తేజసోఽథ గుణాస్త్రయః ।
శబ్దః స్పర్శశ్చ వాయోస్తు ఆకాశే శబ్ద ఏవ తు ॥ 6
జలంలో నాల్గు గుణాలు. దానికి గంధం ఉండదు అగ్నికి శబ్ద స్పర్శ రూపాలే. వాయువుకు శబ్దస్పర్శలే. ఆకాశంలో శబ్దం ఒక్కటే. (6)
ఏతే పంచ గుణా రాజన్ మహాభూతేషు పంచసు ।
వర్తంతే సర్వలోకేషు యేషు భూతాః ప్రతిష్ఠితాః ॥ 7
ఈ అయిదు గుణాలూ అయిదు మహాభూతాలను ఆశ్రయించి ఉన్నాయి. వీని నాశ్రయించుకొనే ప్రాణులన్నీ ఉన్నాయి. (7)
అన్యోన్యం నాభివర్తంతే సామ్యం భవతి వై యదా ॥ 8
ఈ అయిదు గుణాలూ సామ్యావస్థలో ఉన్నపుడు ఒకదానితో ఒకటి కలియవు. (8)
యదా తు విషమీభావమ్ ఆవిశంతి పరస్పరమ్ ।
తదా దేహైర్దేహవంతః వ్యతిరోహంతి నాన్యథా ॥ 9
విషమావస్థలో ఉన్నపుడే పరస్పరం కలుస్తాయి. ఈ విషమావస్థలోనే ప్రాణులకు సంబంధం కలుగుతుంది. (9)
ఆనుపూర్వ్యా వినశ్యంతి జాయంతే చానుపూర్వశః ।
సర్వాణ్యపరిమేయాణి తదేషాం రూపమైశ్వరమ్ ॥ 10
ఈ పంచ మహాభూతాలూ భూమి మొదలు ఆకాశం వరకులయమవుతాయి. ఆకాశం నుండి భూమి వరకు పుట్టుతూ ఉంటాయి. వీటిరూపాలు ఈశ్వర నిర్మితాలు. అందుచేత వీటిని కొలవలేము. (10)
తత్ర తత్ర హి దృశ్యంతే ధాతవః పాంచభౌతికాః ।
తేషాం మనుష్యాస్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే ॥ 11
అక్కడక్కడ వేరులోకాల్లో పాంచభౌతిక ధాతువులు కనపడతాయి. మనుష్యులు తార్కికంగా ప్రమాణాలను ప్రతిపాదిస్తారు. (11)
అచింత్యాః ఖలు యే భావాః న తాంస్తర్కేణ సాధయేత్ ।
ప్రకృతిభ్యః పరం యత్ తు తదచింత్యస్య లక్షణమ్ ॥ 12
అచింత్యాలయిన ఆ భావాలను మన తర్కంతో సాధింపలేము. ప్రకృతికి మించినవి అవి. అందుకే అచింత్యాలు. (12)
సుదర్శనం ప్రవక్ష్యామి ద్వీపం తు కురునందన ।
పరిమండలో మహారాజ ద్వీపోఽసౌ చక్రసంస్థితః ॥ 13
రాజా! సుదర్శన ద్వీపం గురించి చెపుతాను విను. ఈ ద్వీపం చక్రం వలె గుండ్రంగా ఉంటుంది. (13)
నదీజలప్రతిచ్చన్నః పర్వతైశ్చాభ్రసంనిభైః ।
పురైశ్చ వివిధాకారైః రమ్యైర్జనపదైస్తథా ॥ 14
వృక్షైః పుష్పఫలోపేతైః సంపన్నధనధాన్యవాన్ ।
లవణేన సముద్రేణ సమంతాత్ పరివారితః ॥ 15
ఇది నదీ జలాలతో, మేఘాల వంటి పర్వతాలతో నిండి ఉంటుంది. వివిధ పురాలతో, జనపదాలతో, పుష్పఫలాలతో నిండిన చెట్లతో, ధనధాన్య సమృద్ధమై ఉంటుంది. చుట్టూరా లవణ సముద్రం ఉంటుంది. (14,15)
యథా హి పురుషః పశ్యేత్ ఆదర్శే ముఖమాత్మనః ।
ఏవం సుదర్శనద్వీపః దృశ్యతే చంద్రమండలే ॥ 16
మానవుడు తన ముఖాన్ని అద్దంలో చూసుకొన్నట్లే సుదర్శన ద్వీపం చంద్ర మండలంలో కనిపిస్తుంది. (16)
ద్విరంశే పిప్పలస్తత్ర ద్విరంశే చ శశో మహాన్ ।
సర్వౌషధిసమావాయః సర్వతః పరివారితః ॥ 17
ఆ ద్వీపంలో రెండు భాగాలు రావి చెట్లు, రెండు భాగాలు కుందేళ్లు కనపడతాయి. అన్ని ఓషధులూ దాని చుట్టూరా ఉన్నాయి. (17)
ఆపస్తతోఽన్యా విజ్ఞేయాః శేషః సంక్షేప ఉచ్యతే ।
తతోఽన్య ఉచ్యతే చాయమ్ ఏనం సంక్షేపతః శృణు ॥ 18
మిగిలిన భాగాలన్నీ జలమయాలు. ఇవిగాక మిగిలిన దంతా భూమిగా ఉంది. దాన్ని గురించి సంగ్రహంగా చెపుతాను విను." (18)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి సుదర్శనద్వీపవర్ణనే పంచమోఽధ్యాయః ॥ 5 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండనిర్మాణపర్వము అను ఉపపర్వమున సుదర్శన ద్వీపవర్ణన మను అయిదవ అధ్యాయము. (5)