8. ఎనిమిదవ అధ్యాయము

రమణక హిరణ్యక వర్షములు శృంగవత్పర్వతము, ఐరావత వర్షము - వర్ణనము

ధృతరాష్ట్ర ఉవాచ
వర్షాణాం చైవ నామాని పర్వతానాం చ సంజయ ।
ఆచక్ష్వ మే యథాతత్త్వం యే చ పర్వతవాసినః ॥ 1
ధృతరాష్ట్రుడు ఇలా అడిగాడు.
'సంజయా! వర్షాల, పర్వతాల పేర్లు, ఆ పర్వత నివాసుల గురించి ఉన్నదున్నట్లు చెప్పు.' (1)
సంజయ ఉవాచ
దక్షిణేన తు శ్వేతస్య నిషధస్యోత్తరేణ తు ।
వర్షం రమణకం నామ జాయంతే తత్ర మానవాః ॥ 2
శుక్లాభిజనసంపన్నాః సర్వే సుప్రియదర్శనాః ।
నిఃసపత్నాశ్చ తే సర్వే జాయంతే తత్ర మానవాః ॥ 3
సంజయుడు చెపుతున్నాడు.
'శ్వేత పర్వతానికి దక్షిణాన, నిషధ పర్వతానికి ఉత్తరాన రమణక వర్షం ఉంది. అక్కడి వారంతా స్వచ్ఛమైన ఆభిజాత్యం కలిగి చూడ ముచ్చటగా ఉంటారు. అక్కడి వారికి శత్రువులు ఉండరు. (2,3)
దశ వర్షసహస్రాణి శతాని దశ పంచ చ ।
జీవంతి తే మహారాజ నిత్యం ముదితమానసాః ॥ 4
వారంతా సంతోషంతో ప్రసన్నంగా పదకొండు వేల అయిదు వందల సంవత్సరాలు జీవిస్తారు. (4)
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు ।
వర్షం హిరణ్మయం నామ యత్ర హైరణ్వతీ నదీ ॥ 5
నీలగిరికి దక్షిణంగా, నిషధ పర్వతానికి ఉత్తరంగా హిరణ్మయ వర్షం ఉంది. అక్కడే హైరణ్వతీ నది ఉంది. (5)
యత్ర చాయం మహారాజ పక్షిరాట్ పతగోత్తమః ।
యక్షానుగా మహారాజ ధనినః ప్రియదర్శనాః ॥ 6
మహాబలాస్తత్ర జనాః రాజన్ ముదితమానసాః ।
మహారాజా! అక్కడే పక్షిరాజు గరుత్మంతుడు ఉంటాడు. అక్కడి వారంతా యక్షులను ఉపాసిస్తారు. ధనవంతులు ప్రియ దర్శనులు, మహాబలవంతులై, ప్రసన్నచిత్తులై, ఉంటారు. (6 1/2)
ఏకాదశ సహస్రాణి వర్షాణాం తే జనాధిప ॥ 7
ఆయుః ప్రమాణం జీవంతి శతాని దశ పంచ చ ।
జనాధిపా! అక్కడి వారి ఆయుః ప్రమాణం పదకొండువేల సంవత్సరాలు. (7 1/2)
శృంగాని చ విచిత్రాణి త్రీణ్యేవ మనుజాధిప ॥ 8
ఏకం మణిమయం తత్ర తథైకం రౌక్మమద్భుతమ్ ।
సర్వరత్నమయం చైకం భవనైరుపశోభితమ్ ॥ 9
రాజా! అక్కడ శృంగవత్పర్వతం ఉంది. దానికి మూడు విచిత్ర శిఖరాలున్నాయి. ఒకటి మణిమయం. రెండవది సువర్ణ మయం. మూడవది రత్నమయం. దానిపై ఎన్నో భవనాలున్నాయి. (8,9)
తత్ర స్వయంప్రభా దేవీ నిత్యం వసతి శాండిలీ ।
ఉత్తరేణ తు శృంగస్య సముద్రాంతే జనాధిప ॥ 10
వర్షమైరావతం నామ తస్మాచ్ఛృంగమతః పరమ్ ।
న తత్ర సూర్యస్తపతి న జీర్యంతే చ మానవాః ॥ 11
అచ్చట స్వయంప్రభ అనే పేరు గల శాండిలి నివసిస్తోంది. ఆ శృంగవత్పర్వతానికి ఉత్తరంగా సముద్రానికి దగ్గరగా ఐరావత వర్షం ఉంది. ఎన్నో శిఖరాలతో కూడి ఉండటంతో ఈ ఐరావతవర్షం ఉత్తమంగా ఉంటుంది. అక్కడ సూర్యతాపం ఉండదు. వారికి ముసలితనమే కనపడదు. (10,11)
చంద్రమాశ్చ సనక్షత్రః జ్యోతిర్భూత ఇవావృతః ।
పద్మప్రభాః పద్మవర్ణాః పద్మపత్రనిభేక్షణాః ॥ 12
నక్షత్రాలతో కూడి చంద్రుడక్కడ జ్యోతిర్మయుడై అంతటా ఆవరించి ఉంటాడు. అక్కడి వారంతా పద్మవర్ణంతో పద్మకాంతితో, పద్మపత్రాల వంటి కనులతో శోభిల్లుతారు. (12)
పద్మపత్రసుగంధాశ్చ జాయంతే తత్ర మానవాః ।
అనిష్యందా ఇష్టగంధాః నిరాహారా జితేంద్రియాః ॥ 13
అక్కడి వారి శరీరాలు కమలాల సువాసనతో ఉంటాయి. చెమట పట్టదు. ఇష్టమైన వాసన ఉంటుంది. ఆకలి దప్పులుండవు. జితేంద్రియులై ఉంటారు. (13)
దేవలోకచ్యుతాః సర్వే తథా విరజసో నృప ।
త్రయోదశ సహస్రాణి వర్షాణాం తే జనాధిప ॥ 14
ఆయుఃప్రమాణం జీవంతి నరా భరతసత్తమ ।
రాజా! భరతశ్రేష్ఠా! వారంతా స్వర్గచ్యుతులై మిగిలిన పుణ్యం అనుభవించటానికి వచ్చిన వారు. వారికి రజోగుణం ఉండదు. వారికి పదమూడు వేల సంవత్సరాల ఆయువు ఉంటుంది. (14 1/2)
క్షీరోదస్య సముద్రస్య తథైవోత్తరతః ప్రభుః ।
హరిర్వసతి వైకుంఠః శకటే కనకామయే ॥ 15
అష్టచక్రం హి తద్ యానం భూతయుక్తం మనోజవమ్ ।
అగ్నివర్ణం మహాతేజః జాంబూనదవిభూషితమ్ ॥ 16
క్షీరసముద్రం ఉత్తరతీరంలో విష్ణువు నివసిస్తాడు. అతడక్కడ సువర్ణరథం మీద ఉంటాడు. ఆ రథానికి ఎనిమిది చక్రాలు. అది మనోవేగం కలది. భూత యుక్తం. అగ్ని వర్ణంతో మహాతేజస్వియై ఆ రథం బంగారంతో అలంకరింపబడింది. (15,16)
స ప్రభుః సర్వభూతానాం విభుశ్చ భరతర్షభ ।
సంక్షేపో విస్తరశ్చైవ కర్తా కారయితా తథా ॥ 17
అన్ని భూతాలకు అతడు ప్రభువు. ప్రాణుల జననాలకు, మరణాలకు అతడే కర్త. చేయించేవాడూ అతడే. (17)
పృథివ్యాపస్తథాఽఽకాశం వాయుస్తేజశ్చ పార్థివ ।
స యజ్ఞః సర్వభూతానామ్ ఆస్యం తస్య హుతాశనః ॥ 18
రాజా! పృథివి, జలం, తేజస్సు, వాయువు, ఆకాశం ఆయన స్వరూపాలే. యజ్ఞ స్వరూపుడు అతడే. అతని ముఖమే అగ్ని." (18)
ఏవముక్తః సంజయేన ధృతరాష్ట్రో మహామనాః ।
ధ్యానమన్వగమద్ రాజన్ పుత్రాన్ ప్రతి జనాధిప ॥ 19
వైశంపాయనుడు చెపుతున్నాడు. రాజా! నరాధిపా! ఇలా సంజయుడు చెప్పినదంతా విని ధృతరాష్ట్రుడు కొద్దిసేపు తనకొడుకులను గురించి ఆలోచించాడు. (19)
స విచింత్య మహాతేజాః పునరేవాబ్రవీద్ వచః ।
అసంశయం సూతపుత్ర కాలః సంక్షిపతే జగత్ ॥ 20
అలా ధ్యానించి మళ్లీ ఇలా అన్నాడు. "సంజయా! ఇది నిస్సంశయం. జగత్తు నంతటినీ కాలమే సంహరిస్తుంది. (20)
సృజతే చ పునః సర్వం విద్యతే నేహ శాశ్వతమ్ ।
నరో నారాయణశ్చైవ సర్వజ్ఞః సర్వభూతహృత్ ॥ 21
దేవా వైకుంఠమిత్యాహుః నరా విష్ణుమితి ప్రభుమ్ ॥ 22
మళ్లీ సృష్టిస్తుంది. ఏ వస్తువూ ఇక్కడ శాశ్వతంగా నిలువదు. నర, నారాయణులే సర్వజ్ఞులు. సర్వప్రాణులకు హితులు; దేవతలు వైకుంఠుడనీ, నరులు విష్ణువనీ అంటారు. (21,22)
శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి ధృతరాష్ట్రవాక్యేఽష్టమోఽధ్యాయః ॥ 8 ॥
శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున ధృతరాష్ట్ర వాక్యమను ఎనిమిదవ అధ్యాయము. (8)