10. పదవ అధ్యాయము

భారతవర్షమున యుగానుసారముగ నరుల ఆయుర్గుణములు.

ధృతరాష్ట్ర ఉవాచ
భారతస్యాస్య వర్షస్య తథా హైమవతస్య చ ।
ప్రమాణమాయుషః సూత బలం చాపి శుభాశుభమ్ ॥ 1
అనాగతమతిక్రాంతం వర్తమానం చ సంజయ ।
ఆచక్ష్వ మే విస్తరేణ హరివర్షం తథైవ చ ॥ 2
ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. "సంజయా! భారత వర్షంలోని, హైమవత వర్షంలోని ప్రజల ఆయుః ప్రమాణం, బలం, భూతభవిష్య ద్వర్తమాన కాలల్లో శుభాశుభ ఫలాలు తెలుపు. అలాగే హరి వర్షం గురించి కూడా చెప్పు." (1,2)
సంజయ ఉవాచ
చత్వారి భారతే వర్షే యుగాని భరతర్షభ ।
కృతం త్రేతా ద్వాపరం చ తిష్యం చ కురువర్ధన ॥ 3
అపుడు సంజయుడు ఇలా చెప్ఫాడు.
"భరతశ్రేష్ఠా! కురువర్ధనా! భారతవర్షంలో కృత, త్రేతా, ద్వాపర, కలి యుగాలు అని నాలుగు యుగాలు. (3)
పూర్వం కృతయుగం నామ తతస్త్రేతాయుగం ప్రభో ।
సంక్షేపాద్ ద్వాపరస్యాథ తతస్తిష్యం ప్రవర్తతే ॥ 4
మొదటిది కృతయుగం, రెండవది త్రేతాయుగం. మూడవది ద్వాపర యుగం, నాల్గవది కలి యుగం. (4)
చత్వారి తు సహస్రాణి వర్షాణాం కురుసత్తమ ।
ఆయుఃసంఖ్యా కృతయుగే సంఖ్యాతా రాజసత్తమ ॥ 5
రాజశ్రేష్ఠా! కురుశ్రేష్ఠా! కృతయుగంలో నాల్గు వేల సంవత్సరాలు ఆయుః ప్రమాణం. (5)
తథా త్రీణి సహస్రాణి త్రేతాయాం మనుజాధిప ।
ద్వే సహస్రే ద్వాపరే తు భువి తిష్ఠతి సాంప్రతమ్ ॥ 6
రాజా! అలాగే మూడు వేల సంవత్సరాలు త్రేతాయుగంలో. ద్వాపరయుగంలో ఆయుఃప్రమాణం రెండువేల సంత్సరాలు. (6)
న ప్రమాణస్థితిర్హ్యస్తి తిష్యేఽస్మిన్ భరతర్షభ ।
గర్భస్థాశ్చ మ్రియంతేత్ర తథా జాతా మ్రియంతి చ ॥ 7
కలియుగంలో ఇంత అని ఆయుః ప్రమాణం లేదు. గర్భంలో కూడా చనిపోతారు. మరికొంత మంది పుట్టగానే కూడా చనిపోతారు. (7)
మహాబలా మహాసత్త్వాః ప్రజ్ఞాగుణసమన్వితాః ।
ప్రజాయంతే చ జాతాశ్చ శతశోఽథ సహస్రశః ॥ 8
కృతయుగంలో బలవంతులు, సత్యగుణం కలవారు. తెలివైన వారు పుడతారు, పుట్టారు కూడా! వందలు వేలు సంతానం పొందుతారు. (8)
జాతాః కృతయుగే రాజన్ ధనినః ప్రియదర్శనాః ।
ప్రజాయంతే చ జాతాశ్చ మునయో వై తపోధనాః ॥ 9
రాజా! పుట్టిన వారంతా ధనవంతులై, అందంగా ఉంటారు. చాలావరకూ తపోధనులు పుడతారు. (9)
మహోత్సాహా మహాత్మానః ధార్మికాః సత్యవాదినః ।
ప్రియదర్శనా వపుష్మంతః మహావీర్యా ధనుర్ధరాః ॥ 10
వరార్హా యుధి జాయంతే క్షత్రియాః శూరసత్తమాః ।
త్రేతాయాం క్షత్రియా రాజన్ సర్వే వై చక్రవర్తినః ॥ 11
రాజా! త్రేతాయుగంలో చక్కని ఉత్సాహం కల మహాత్ములు, ధార్మికులు, సత్యవాదులు, చక్కని శరీరపౌష్ఠవం కల్గి చూడ ముచ్చటయిన వారు, ధనుర్ధరులు, వరాలు పొందదగిన యుద్ధ వీరులు, అందరూ చక్రవర్తులైన రాజులు పుడతారు. (10,11)
సర్వవర్ణాశ్చ జాయంతే సదా చైవ చ ద్వాపరే ।
మహోత్సాహా వీర్యవంతః పరస్పరజయైషిణః ॥ 12
ద్వాపరంలో అన్ని వర్ణాలవారూ పుడతారు. సదా వారు ఉత్సాహంతో, పరాక్రమంతో పరస్పరం జయకాంక్షులై, ప్రవర్తిస్తారు. (12)
తేజసాల్పేన సంయుక్తాః క్రోధనాః పురుషా నృప ।
లుబ్ధా అనృతకాశ్చైవ తిష్యే జాయంతి భారత ॥ 13
రాజా! భారతా! ఇక కలియుగంలో అల్పతేజస్వులు, కోపం కలవారు, లుబ్ధులు, అసత్యవాదులు పుడతారు. (13)
ఈర్ష్యా మానస్తథా క్రోధః మాయాసూయా తథైవ చ ।
తిష్యే భవతి భూతానాం రాగో లోభశ్చ భారత ॥ 14
భారతా! కలియుగ ప్రాణులకు ఈర్ష్య, అభిమానం, క్రోధం, మాయ, అసూయ, రాగం, లోభం అనే దోషాలు ఉంటాయి. (14)
సంక్షేపో వర్తతే రాజన్ ద్వాపరేఽస్మిన్ నరాధిప ।
గుణోత్తరం హైమవతం హరివర్షం తతః పరమ్ ॥ 15
నరాధిపా! ఈ ద్వాపర యుగంలో సద్గుణాలు తక్కువగా ఉంటాయి. భారత వర్షం కంటె హైమవత వర్షంలోను, దాని కంటే హరివర్షంలోను సద్గుణాలు ఎక్కువగా ఉంటాయి."
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి జంబూఖండవినిర్మాణపర్వణి భారతవర్షే కృతాద్యనురోధేనాయుర్నిరూపణే దశమోఽధ్యాయః ॥ 10 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున జంబూఖండవినిర్మాణ పర్వమను ఉపపర్వమున భారత వర్షమున యుగాను సారి ఆయుః ప్రమాణాదుల నిరూపణము అను పదవ అధ్యాయము. (10)
`