రైవతక పర్వతం దగ్గర కుమార వర్షం, శ్యామగిరి దగ్గర మణికాంచనవర్షమూ ఉన్నాయి. కేసర పర్వతం దగ్గర మోదాక వర్షమూ, ఆవల మహాపురుష వర్షమూ ఉన్నాయి. (26)
ఆ మహాపురుష వర్షం ఆ ద్వీపం యొక్క, పొడవు వెడల్పులను చుట్టి ఉంది. దాని మధ్య ఒక పెద్ద శాక (టేకు) వృక్షం ఉంది. అది జంబూ ద్వీపం వలెనే ఉంది. అక్కడి ప్రజలు దాన్ని ఆశ్రయించి ఉంటారు. అక్కడ పుణ్యప్రదమయిన జనపదాలున్నాయి. అక్కడ శంకరుడు పూజింపబడతాడు. (27,28)
తత్ర గచ్ఛంతి సిద్ధాశ్చ చారణా దైవతాని చ ।
ధార్మికాశ్చ ప్రజా రాజన్ చత్వారోఽతీవ భారత ॥ 29
రాజా! అక్కడికి సిద్ధులు, చారణులు, దేవతలూ వెళుతూ ఉంటారు. భారతా! అక్కడి చతుర్వర్ణాలవారూ ధార్మికులై ఉంటారు. (29)
వర్ణాః స్వకర్మనిరతాః న చ స్తేనోఽత్ర దృశ్యతే ।
దీర్ఘాయుషో మహారాజ జరామృత్యువివర్జితాః ॥ 30
మహారాజా! అన్ని వర్ణాలవారూ స్వకర్మాచరణం చేస్తారు. దొంగ అనేవాడు ఉండదు. జరామరణాలు వారిని చేరవు. (30)
ప్రజాస్తత్ర వివర్ధంతే వర్షాస్వివ సముద్రగాః ।
నద్యః పుణ్యజలాస్తత్ర గంగా చ బహుధా గతా ॥ 31
వర్షకాలంలో నదులు పెరిగినట్లు అక్కడి ప్రజలు అభివృద్ధి చెందుతారు. నదులన్నీ పుణ్య జలాలతో నిండి ఉంటాయి. గంగానది అక్కడ ఎన్నో విధాల ప్రవహిస్తుంది. (31)
సుకుమారీ కుమారీ చ శీతాశీ వేణికా తథా ।
మహానదీ చ కౌరవ్య తథా మణిజలా నదీ ॥ 32
చక్షుర్వర్ధనికా చైవ నదీ భరతసత్తమ ।
తత్ర ప్రవృత్తాః పుణ్యోదాః నద్యః కురుకులోద్వహ ॥ 33
కౌరవ్యా! భరతశ్రేష్ఠా! ఆ ద్వీపంలో సుకుమారి, కుమారి, శీతాశి, వేణిక, మహానది, మణిజల, చక్షుర్వర్ధనిక మొదలయిన నదులు పవిత్ర జలాలతో ప్రవహిస్తాయి. (32,33)
సహస్రాణాం శతాన్యేవ యతో వర్షతి వాసవః ।
న తాసాం నామధేయాని పరిమాణం తథైవ చ ॥ 34
శక్యంతే పరిసంఖ్యాతుం పుణ్యాస్తా హి సరిద్వరాః ।
తత్ర పుణ్యా జనపదాః చత్వారో లోకసమ్మతాః ॥ 35
అటువంటి లక్షల నదుల నుండి ఇంద్రుడు జలం గ్రహించి వర్షం కురిపిస్తాడు. ఆ నదుల సంఖ్యను, పేర్లను లెక్కింపలేము. ఆ నదీమతల్లులు పుణ్యప్రదాలు. లోకం మెచ్చిన పవిత్ర జనపదాలు నాలుగు అక్కడున్నాయి. (34-35)
మంగాశ్చ మశకాశ్చైవ మానసా మందగాస్తథా ।
మంగా బ్రాహ్మణభూయిష్ఠాః స్వకర్మనిరతా నృప ॥ 36
రాజా! మంగ-మశక-మానస-మందగ అనే పేరు కలవి ఆ దేశాలు - అందులో మంగదేశం స్వకర్మ నిరతులయిన బ్రాహ్మణులతో నిండి ఉంటుంది. (36)
మశకేషు తు రాజన్యాః ధార్మికాః సర్వకామదాః ।
మానసాశ్చ మహారాజ వైశ్యధర్మోపజీవినః ॥ 37
సర్వకామసమాయుక్తాః శూరా ధర్మార్థనిశ్చితాః ।
మహారాజా! మశక దేశంలో రాజులు ధార్మికులు. ప్రజల కోరికలు తీర్చగలవారు. మానసదేశంలో వైశ్యులు వైశ్యధర్మజీవనులు. సుఖ భోగ సంపన్నులు, శూరులు, ధర్మార్థ నిశ్చయం కలవారు. (37 1/2)
శూద్రాస్తు మందగా నిత్యం పురుషా ధర్మశీలినః ॥ 38
మందగ దేశంలో శూద్రులు సదా ధర్మ శీలులై ఉంటారు. (38)
న తత్ర రాజా రాజేంద్ర న దండో న చ దండికః ।
స్వధర్మేణైవ ధర్మజ్ఞాః తే రక్షంతి పరస్పరమ్ ॥ 39
అక్కడ రాజు లేడు. దండం లేదు. దండం విధించే వాడు ఉండడు. ప్రజలంతా ధర్మం తెలిసినవారు. వారు ఒకరినొకరు రక్షించుకొంటారు. (39)
ఏతావదేవ శక్యం తు తత్ర ద్వీపే ప్రభాషితుమ్ ।
ఏతదేవ చ శ్రోతవ్యం శాకద్వీపే మహౌజసి ॥ 40
తేజోమయమైన శాకద్వీపం గురించి ఇంతకు మించి చెప్పినవసరం లేదు. ఇంతవరకు వింటే చాలు." (40)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి భూమిపర్వణి శాకద్వీపవర్ణనే ఏకాదశోఽధ్యాయః ॥ 11
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున భూమి పర్వమను ఉపపర్వమున శాకద్వీప వర్ణన మను పదునొకండవ అధ్యాయము. (11)