16. పదునారవ అధ్యాయము
దుర్యోధన సైన్య వర్ణనము.
సంజయ ఉవాచ
తతో రజన్యాం వ్యుష్టాయాం శబ్దః సమభవన్మహాన్ ।
క్రోశతాం భూమిపాలానాం యుజ్యతాం యుజ్యతామితి ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
"రాత్రి గడిచి తెల్లవారుతోంది. ఇంతలో 'రథాలు సిద్ధం చేయండి, సన్నద్ధులు కండి' అంటూ రాజుల అరుపులు కోలాహలంతో వినవచ్చాయి. (1)
శంఖదుందుభిఘోషైశ్చ సింహనాదైశ్చ భారత ।
హయహేషితనాదైశ్చ రథనేమిస్వనైస్తథా ॥ 2
గజానాం బృంహతాం చైవ యోధానాం చాపి గర్జతామ్ ।
క్ష్వేలితాస్ఫోటితోత్క్రుష్టైః తుములం సర్వతోఽభవత్ ॥ 3
భారతా! శంఖాలు, దుందుభుల ధ్వనులు, యోధుల సింహనాదాలు, గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఘీంకారాలు, రథచక్రాల చప్పుళ్లు, యోధుల భుజాస్ఫాలనాలు, అరుపులు అంతటా వ్యాపించాయి. (2,3)
ఉదతిష్ఠన్మహారాజ సర్వం యుక్తమశేషతః ।
సూర్యోదయే మహత్ సైన్యం కురుపాండవసేనయోః ॥ 4
మహారాజా! సూర్యోదయం అయ్యేసరికి ఇలా కురుపాండవుల సేన అంతా యుద్ధానికి సన్నద్ధమై నిలిచింది. (4)
రాజేంద్ర తవ పుత్రాణాం పాండవానాం తథైవ చ ।
దుష్ప్రధృష్యాణి చాస్త్రాణి సశస్త్రకవచాని చ ॥ 5
రాజా! నీ పుత్రులసేన, పాండవుల సేన శస్త్రాలతో, అస్త్రాలతో, కవచాలతో, ప్రగల్భంగా నిలిచింది. (5)
తతః ప్రకాశే సైన్యాని సమదృశ్యంత భారత ।
త్వదీయానాం పరేషాం చ శస్త్రవంతి మహాంతి చ ॥ 6
భారతా! సూర్యోదయ మయ్యేసరికి నీ సైన్యాలు, శత్రుసైన్యాలు పెద్దపెద్ద అస్త్రశస్త్రాలు దాల్చి, కనిపించాయి. (6)
తత్ర నాగా రథాశ్చైవ జాంబూనదపరిష్కృతాః ।
విభ్రాజమానా దృశ్యంతే మేఘా ఇవ సవిద్యుతః ॥ 7
అందులో ఏనుగులూ, రథాలూ బంగారు అలంకరణంతో కూడి మెరుపులతో కూడిన మేఘాలవలె ప్రకాశిస్తున్నాయి. (7)
రథానీకాన్యదృశ్యంత నగరాణీవ భూరిశః ।
అతీవ శుశుభే తత్ర పితా తే పూర్ణచంద్రవత్ ॥ 8
రథ సముదాయాలు పెద్ద పెద్ద నగరాలవలె కనిపిస్తున్నాయి. నీ తండ్రి భీష్ముడు చంద్రునిలా వెలిగిపోతున్నాడు. (8)
ధనుర్భిరృష్టిభిః ఖడ్గైః గదాభిః శక్తితోమరైః ।
యోధాః ప్రహరణైః శుభ్రైః తేష్వనీకేష్వవస్థితాః ॥ 9
ఆ సైన్యంలో ధనుస్సులు, ఋష్టులు, కత్తులు, గదలు, శక్తులు, తోమరాలు, ధరించి యోధులు నిలిచారు. (9)
గజాః పదాతా రథినః తురగాశ్చ విశాంపతే ।
వ్యతిష్ఠన్ వాగురాకారాః శతశోఽథ సహస్రశః ॥ 10
వందలకొద్దీ, వేలకొద్దీ ఏనుగులూ, పదాతులు, రథికులు, గుర్రాలు (శత్రుబంధనం కోసం) వలల ఆకారంలో నిలిచాయి. (10)
ధ్వజా బహువిధాకారాః వ్యదృశ్యంత సముచ్ఛ్రితాః ।
స్వేషాం చైవ పరేషాం చ ద్యుతిమంతః సహస్రశః ॥ 11
ఇరుసేనలలోను వివిధ ధ్వజాలు వేల కొద్దీ కాంతితో ఉన్నతంగా ప్రకాశిస్తున్నాయి. (11)
కాంచనా మణిచిత్రాంగాః జ్వలంత ఇవ పావకాః ।
అర్చిష్మంతో వ్యరోచంత గజారోహాః సహస్రశః ॥ 12
సువర్ణ మణి భూషణాలు ధరించి, వెలుగుతున్న అగ్నుల వలె వేలకొద్ధీ గజారోహకులు ప్రకాశిస్తున్నారు. (12)
మహేంద్రకేతవః శుభ్రాః మహేంద్రసదనేష్వివ ।
సంనద్ధాస్తే ప్రవీరాశ్చ దదృశుర్యుద్ధకాంక్షిణః ॥ 13
ఇంద్రభవనాల మీద ఎగిరే జెండాల వలె సేనల జెండాలు ఎగురుతున్నాయి. సైనికులంతా సన్నద్ధులై యుద్ధకాంక్షతో కనపడుతున్నారు. (13)
ఉద్యతైరాయుధైశ్చిత్రాః తలబద్ధాః కలాపినః ।
ఋషభాక్షా మనుష్యేంద్రాః చమూముఖగతా బభుః ॥ 14
ఆయుధాలను ఎత్తిపట్టుకొని, తలత్రాణాలు, అమ్ముల పొదులూ దాల్చి సైనికులు నిలిచారు. సేనాముఖంలో ఉన్న వారి కన్నులు వృషభాల కన్నుల వలె ప్రకాశిస్తున్నాయి. (14)
శకునిః సౌబలః శల్యః సైంధవోఽథ జయద్రథః ।
విందానువిందౌ కైకేయాః కాంబోజస్య సుదక్షిణః ॥ 15
శ్రుతాయుధశ్చ కాలింగః జయత్సేనశ్చ పార్థివః ।
బృహద్బలశ్చ కౌశల్యః కృతవర్మా చ సాత్వతః ॥ 16
దశైతే పురుషవ్యాఘ్రాః శూరాః పరిఘబాహవః ।
అక్షౌహిణీనాం పతయః యజ్వానో భూరిదక్షిణాః ॥ 17
సుబలసుతుడైన శకుని, శల్యుడు, సింధురాజైన జయద్రథుడు, కేకయదేశీయులైన విందానువింధులు, కాంబోజరాజైన సుదక్షిణుడు, కాలింగరాజైన శ్రుతాయుథుడు, జయత్సేనరాజు, కోసలరాజైన బృహద్బలుడు, సాత్వతవంశీయుడైన కృతవర్మ - ఈ పది మంది ఒకొక్క అక్షౌహిణికి నాయకులు. గడియల వంటి వారి భుజాలు లావుగా, పొడవుగా ఉన్నాయి. అక్షౌహిణీ పతులంతా భూరి దక్షిణలతో యజ్ఞాలు చేసినవారు. (15-17)
ఏతే చాన్యే చ బహవః దుర్యోధనవశానుగాః ।
రాజానో రాజపుత్రాశ్చ నీతిమంతో మహారథాః ॥ 18
సంనద్ధాః సమదృశ్యంత స్వేష్వనీకేష్వవస్థితాః ।
వీరే కాక ఇంకా దుర్యోధనుని వశంలో ఉన్న రాజులు, రాజపుత్రులు నీతిమంతులు, మహారథులూ ఎందరో తమతమ సేనలతో నిలిచి సన్నద్ధులై కనిపిస్తున్నారు. (18 1/2)
బద్ధకృష్ణాజినాః సర్వే బలినో యుద్ధశాలినః ॥ 19
హృష్టా దుర్యోధనస్యార్థే బ్రహ్మలోకాయ దీక్షితాః ।
సమర్థా దశ వాహిన్యః పరిగృహ్య వ్యవస్థితాః ॥ 20
అందరూ కృష్ణాజినాలు ధరించారు. అందరూ బలవంతులు, పొరాడే స్వభావం గలవారు. దుర్యోధనుని కోసం ఆనందంగా బ్రహ్మలోక దీక్ష పట్టి, సమర్థులైన పది అక్షౌహిణుల నాయకులూ నిలిచారు. (20)
ఏకాదశీ ధార్తరాష్ట్రీ కౌరవాణాం మహాచమూః ।
అగ్రతః సర్వసైన్యానాం యత్ర శాంతనవోఽగ్రణీః ॥ 21
పదకొండవ అక్షౌహిణి కౌరవులది. అది సర్వసేనలకూ ముందు నిలిచింది. ఇక్కడే సర్వసైన్యాధ్యక్షుడయిన భీష్ముడు నిలిచాడు. (21)
శ్వేతోష్ణీషం శ్వేతహయం శ్వేతవర్మాణమచ్యుతమ్ ।
అపశ్యామ మహారాజ భీష్మం చంద్రమివోదితమ్ ॥ 22
మహారాజా! భీష్ముడు తెల్లని తలపాగ, తెల్లని గుర్రాలు, తెల్లని కవచం దాల్చి అపుడే ఉదయించిన చంద్రునివలె కనిపిస్తున్నాడు. (22)
హేమతాలధ్వజం భీష్మం రాజతే స్యందనే స్థితమ్ ।
శ్వేతాభ్ర ఇవ తీక్ ష్ణాంశుం దదృశుః కురుపాండవాః ॥ 23
సృంజయాశ్చ మహేష్వాసాః ధృష్టద్యుమ్నపురోగమాః ।
వెండి రథం మీద, బంగారు తాల ధ్వజంతో నిలిచిన భీష్ముని కురు, పాండవులూ, ధృష్టద్యుమ్నాది పాంచాల, సృంజయ వీరులంతా తెల్లని మేఘమధ్యంలో ఉన్న సూర్యునివలె దర్శించారు. (23 1/2)
జృంభమాణం మహాసింహం దృష్ట్వా క్షుద్రమృగా యథా ॥ 24
ధృష్టద్యుమ్నముఖాః సర్వే సముద్వివిజిరే ముహుః ।
విజృంభించే ముందు నోరు తెరిచి, ఆవులించే సింహాన్ని చూసిన అల్ప మృగాల వలె ధృష్టద్యుమ్నాదు లంతా భీష్ముని చూసి, ఉద్వేగం పొందుతున్నారు. (24 1/2)
ఏకాదశైతాః శ్రీజుష్టాః వాహిన్యస్తవ పార్థివ ॥ 25
పాండవానాం తథా సప్త మహాపురుషపాలితాః ।
ఇలా మీసేనలు పదకొండూ, పాండవ సేనలు ఏడూ మహాపురుషుల రక్షణలో శోభాకరంగా నిలిచాయి. (25 1/2)
ఉన్మత్తమకరావర్తౌ మహాగ్రాహసమాకులౌ ॥ 26
యుగాంతే సమవేతౌ ద్వౌ దృశ్యేతే సాగరావివ ।
ఆ సేనలు రెండూ ప్రలయకాలంలో సముద్రాల వలె భాసిస్తున్నాయి. అందులో వీరులందరూ మొసళ్ల వలె, సుడి గుండాలవలె ఉన్నారు. (26 1/2)
నైవ నస్తాదృశో రాజన్ దృష్టపూర్వో న చ శ్రుతః ।
అనీకానాం సమేతానాం కౌరవాణాం తథావిధః ॥ 27
రాజా! ఇటువంటి పెద్ద కురుసేన ఇలా ఒకచోట చేరి ఉండటం నేను పూర్వం చూడలేదు, వినలేదు." (27)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి సైన్యవర్ణనే షోడశోఽధ్యాయః ॥ 16
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున సైన్యవర్ణనమను పదునారవ అధ్యాయము. (16)