17. పదునేడవ అధ్యాయము

కౌరవులు యుద్ధమునకు వెడలుట - వారి ధ్వజ వ్యూహవాహనాదుల వర్ణనము.

సంజయ ఉవాచ
యథా స భగవాన్ వ్యాసః కృష్ణద్వైపాయనోఽబ్రవీత్ ।
తథైవ సహితాః సర్వే సమాజగ్ముర్మహీక్షితః ॥ 1
సంజయుడు చెపుతున్నాడు.
"వ్యాసమహర్షి చెప్పినట్లుగానే రాజులంతా యుద్ధానికి అక్కడకు చేరారు. (1)
మఘావిషయగః సోమః తద్ దినం ప్రత్యపద్యత ।
దీప్యమానాశ్చ సంపేతుః దివి సప్త మహాగ్రహాః ॥ 2
ఆ నాడు చంద్రుడు మఘానక్షత్ర యుక్తుడై ఉన్నాడు. ఏడు మహాగ్రహాలు ఆకాశంలో ప్రకాశిస్తున్నాయి. (2)
ద్విధాభూత ఇవాదిత్యః ఉదయే ప్రత్యదృశ్యత ।
జ్వలంత్యా శిఖయా భూయః భానుమానుదితో రవిః ॥ 3
ఉదయించేటప్పుడు సూర్యుడు రెండుగా చీలినట్లు కనపడ్డాడు. వెంటనే వెలుగుతున్న జ్వాలతో సూర్యుడు ఉదయించాడు. (3)
వవాశిరే చ దీప్తాయాం దిశి గోమాయువాయసాః ।
లిప్సమానాః శరీరాణి మాంసశోణితభోజనాః ॥ 4
దిక్కులు జ్వలిస్తుంటే రక్త మాంసాలు తినే నక్కలూ, కాకులూ శవాలను కోరుతూ తూర్పుముఖం పెట్టి అరిచాయి. (4)
అహన్యహని పార్థానాం వృద్ధః కురుపితామహః ।
భరద్వాజాత్మజశ్చైవ ప్రాతరుత్థాయ సంయతౌ ॥ 5
జయోఽస్తు పాండుపుత్రాణామ్ ఇత్యూచతురరిందమౌ ।
యుయుధాతే తవార్థాయ యథా స సమయః కృతః ॥ 6
ప్రతిరోజూ శత్రు సంహారకులయిన భీష్మద్రోణులు ఉదయమే లేచి, నిశ్చల మనస్సుతో 'పాండవులకు జయమగుగాక' అని పలికేవారు. కాని మీకిచ్చిన మాట ప్రకారం నీ కోసం పాండవులతో పోరాడేవారు. (5,6)
సర్వధర్మవిశేషజ్ఞః పితా దేవవ్రతస్తవ ।
సమానీయ మహీపాలాన్ ఇదం వచనమబ్రవీత్ ॥ 7
సర్వధర్మాలూ తెలిసిన నీ తండ్రి - భీష్ముడు రాజులందరినీ పిలిచి, ఇలా అన్నాడు. (7)
ఇదం వః క్షత్రియా ద్వారం స్వర్గాయాపావృతం మహత్ ।
గచ్ఛధ్వం తేన శక్రస్య బ్రహ్మణః సహలోకతామ్ ॥ 8
"క్షత్రియులారా! ఇది మీకు తెరవబడిన స్వర్గ ద్వారం. దీని ద్వారా స్వర్గలోక బ్రహ్మలోకాలకు వెళ్లండి. (8)
ఏష వః శాశ్వతః పంథాః పూర్వైః పూర్వతరైః కృతః ।
సంభావయధ్వమాత్మానమ్ అవ్యగ్రమనసో యుధి ॥ 9
ఇది మీకు శాశ్వత మార్గం. మీ పూర్వులంతా నడచిన మార్గం. యుద్ధంలో స్థిరచిత్తులై, కీర్తిప్రతిష్ఠలు సంపాదించుకొనండి. (9)
నాభాగోఽథ యయాతిశ్చ మాంధాతా నహుషో నృగః ।
సంసిద్ధాః పరమం స్థానం గతాః కర్మభిరీదృశైః ॥ 10
నాభాగుడు, యయాతి, మాంధాత, నహుషుడు, నృగుడు మొదలయిన పూర్వరాజులు ఇటువంటి సత్కర్మల ద్వారా సిద్ధిపొంది, ఉత్తమ గతులు పొందారు. (10)
అధర్మః క్షత్రియస్యైషః యద్ వ్యాధిమరణం గృహే ।
యదయోనిధనం యాతి సోఽస్య ధర్మః సనాతనః ॥ 11
ఇంట్లో రోగంతో చనిపోవడం క్షత్రియునికి అధర్మం. యుద్ధంలో లోహమయాలైన అస్త్రశస్త్రాలతో చనిపోవడం క్షత్రియుని సనాతన ధర్మం." (11)
ఏవముక్తా మహీపాలాః భీష్మేణ భరతర్షభ ।
నిర్యయుః స్వాన్యనీకాని శోభయంతో రథోత్తమైః ॥ 12
భీష్ముని చేత ఇలా ప్రబోధింపబడిన రాజులు రథాలు ఎక్కి, తమ సేనలను చేరారు. (12)
స తు వైకర్తనః కర్ణః సామాత్యః సహ బంధుభిః ।
న్యాసితః సమరే శస్త్రం భీష్మేణ భరతర్షభ ॥ 13
భరతర్షభా! కర్ణుడు మాత్రం మంత్రులతో, బంధువులతో సహా భీష్ముని వలన శస్త్రం విసర్జించాడు. (13)
ఆపేతకర్ణాః పుత్రాస్తే రాజానశ్చైవ తావకాః ।
నిర్యయుః సింహనాదేవ నాదయంతో దిశో దశ ॥ 14
అందుచే కర్ణుని విడిచి నీ పుత్రులూ, రాజులూ పది దిక్కులూ ప్రతి ధ్వనించేటట్లు సింహనాదాలు చేస్తూ, యుద్ధానికి బయలు దేరారు. (14)
శ్వేతైశ్ఛత్రైః పతాకాభిః ధ్వజవారణవాజిభిః ।
తాన్యనీకాని శోభంతే రథైరథ పదాతిభిః ॥ 15
ఆ సేనలు తెల్లని గొడుగులతో, జెండాలతో, ధ్వజాలతో, ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో, పదాతి దళాలతో శోభిస్తున్నాయి. (15)
భేరీపణవశబ్ధైశ్చ దుందుభీనాం చ నిఃస్వనైః ।
రథనేమినినాదైశ్చ బభూవాకులితా మహీ ॥ 16
భేరులు, పణవాలు, దుందుభులు - వీటి శబ్దాలతో, రథచక్రాల ధ్వనులతో భూమి అంతా అస్తవ్యస్త మయింది. (16)
కాంచనాంగదకేయూరైః కార్ముకైశ్చ మహారథాః ।
భ్రాజమానా వ్యరాజంత సాగ్నయః పర్వతా ఇవ ॥ 17
బంగారు అంగదాలతో, కేయూరాలతో, బాణాలతో మహారథులు అగ్నితో కూడిన పర్వతాల వలె ప్రకాశించారు. (17)
తాలేన మహతా భీష్మః పంచతారేణ కేతునా ।
విమలాదిత్యసంకాశః తస్థౌ కురుచమూపరి ॥ 18
అయిదు నక్షత్ర చిహ్నాలు కల తాల ధ్వజంతో భీష్ముడు నిర్మలమైన సూర్యునివలె కురుసేన అగ్రభాగాన నిలిచాడు. (18)
యే త్వదీయా మహేష్వాసాః రాజానో భరతర్షభ ।
అవర్తంత యథాదేశం రాజన్ శాంతనవస్య తే ॥ 19
భరతర్షభా! ధనుర్ధారులైన నీ రాజు లందరూ భీష్ముని ఆదేశానుసారం నిలిచారు. (19)
స తు గోవాసనః శైబ్యః సహితః సర్వరాజభిః ।
యయౌ మాతంగరాజేన రాజార్హేణ పతాకినా ।
పద్మవర్ణస్త్వనీకానాం సర్వేషామగ్రతః స్థితః ॥ 20
అశ్వత్థామా యయౌ యత్తః సింహలాంగూలకేతునా ।
గోవాసన దేశపురాజు శైబ్యుడు సామంతరాజులతో సహా ధ్వజంతో భద్రగజం మీద వెళ్లాడు. పద్మవర్ణం కల అశ్వత్థామ అందరికీ ముందు నిలిచి, సింహలాంగూల ధ్వజంతో సన్నద్ధుడై వెళ్లాడు. (20 1/2)
శ్రుతాయుధశ్చిత్రసేనః పురుమిత్రో వివింశతిః ॥ 21
శల్యో భూరిశ్రవాశ్చైవ వికర్ణశ్చ మహారథః ।
ఏతే సప్త మహేష్వాసాః ద్రోణపుత్రరోగమాః ॥ 22
స్యందనైర్వరవర్నాణః భీష్మస్యాసన్ పురోగమాః ।
శ్రుతాయుధుడు, చిత్రసేనుడు, పురుమిత్రుడు, వివింశతి, శల్యుడు, భూరిశ్రవుడు, మహారథుడైన వికర్ణుడు - ఈ ఏడుగురు ధనుర్ధరులూ కవచాలు ధరించి, రథాలపై అశ్వత్థామను ముందుంచుకొని భీష్ముని అగ్రభాగాన వెళుతున్నారు. (21,22 1/2)
తేషామపి మహీత్సేధాః శోభయంతో రథోత్తమాన్ ॥ 23
భ్రాజమానా వ్యరోచంత జాంబూనదమయా ధ్వజాః ।
వీరందరి రథాల మీద కూడ ఎత్తైన బంగారు ధ్వజాలు రథాలకు శోభకలిగిస్తూ, ప్రకాశిస్తున్నాయి. (23 1/2)
జాంంబూనదమయీ వేదీ కమండలువిభూషితా ॥ 24
కేతురాచార్యముఖ్యస్య ద్రోణస్య ధనుషా సహ ।
ఆచార్యముఖ్యుడయిన ద్రోణుని ధ్వజం మీద కమండలుపుతో కూడిన బంగారు వేదిక, ధనుస్సు ప్రకాశిస్తున్నాయి. (24 1/2)
అనేకశతసాహస్రమ్ అనీకమనుకర్షతః ॥ 25
మహాన్ దుర్యోధనస్యాసీత్ మణిమయో ధ్వజః ।
ఎన్నో లక్షల సేనలతో వెళ్లే దుర్యోధనుని ధ్వజం మీద మణిమయమైన నాగచిహ్నం ప్రకాశిస్తోంది. (25 1/2)
తస్య పౌరవకాలింగౌ కాంబోజశ్చ సుదక్షిణః ॥ 26
క్షేమధన్వా సుమిత్రశ్చ తస్థుః ప్రముఖతో రథాః ।
దుర్యోధనుని ముందు భాగంలో పౌరవుడు, కలింగ రాజయిన శ్రుతాయుధుడు, కాంబోజరాజు సుదక్షిణుడు, క్షేమధన్వుడు, సుమిత్రుడు (అయిదుగురూ) ఉన్నారు. (26 1/2)
స్యందనేన మహార్హేణ కేతునా వృషభేణ చ ।
ప్రకర్షన్నేవ సేనాగ్రం మాగధస్య కృపో యయౌ ॥ 27
వృషభచిహ్నితమైన బంగారు ధ్వజం కల రథమెక్కి, మగధ సేనాగ్రానికి శోభకల్గిస్తూ కృపుడు వెళ్లాడు. (27)
తదంగపతినా గుప్తం కృపేణ చ మనస్వినా ।
శారదాంబుధరప్రఖ్యం ప్రాచ్యానాం సుమహద్ బలమ్ ॥ 28
అంగరాజు చేతను, కృపాచార్యుని చేతను రక్షింపబడే ప్రాచ్యరాజుల సేనలు శరత్కాల మేఘాల వలె ప్రకాశిస్తున్నాయి. (28)
అనీకప్రముఖే తిష్ఠన్ వరాహేణ మహాయశాః ।
శుశుభే కేతుముఖ్యేన రాజతేన జయద్రథః ॥ 29
సైంధవుడు, వరాహచిహ్నంతో కూడిన వెండి ధ్వజం కల రథం మీద నిలిచి, సేన ముందుభాగాన శోభిల్లుతున్నాడు. (29)
శతం రథసహస్రాణాం తస్యాసన్ వశవర్తినః ।
అష్టౌ నాగసహస్రాణి సాదినామయుతాని షట్ ॥ 30
అతని వశంలో లక్ష రథాలు, ఎనిమిడి వేల ఏనుగులు, అరవై వేల మంది అశ్వసైనికులూ ఉన్నారు. (30)
తత్సింధుపతినా రాజ్ఞా పాలితం ధ్వజినీముఖమ్ ।
అనంతరథనాగాశ్వమ్ అశోభత మహద్ బలమ్ ॥ 31
ఆ సింధురాజు రక్షణలో ఎన్నో రథాలూ, గుర్రాలు కల ఆ మహాసేనాముఖం చక్కగా శోభిల్లుతోంది. (31)
షష్ట్యా రథసహస్రైస్తు నాగానామయుతేన చ ।
పతిః సర్వకలింగానాం యయౌ కేతుమతా సహ ॥ 32
కళింగ రాజు శ్రుతాయుధుడు కేతుమంతునితో కలిసి, అరవై వేల రథాలు, పది వేల ఏనుగులతో బయలుదేరాడు. (32)
తస్య పర్వతసంకాశాః వ్యరోచంత మహాగజాః ।
యంత్రతోమరతూణీరైః పతాకాభిః సుశీభితాః ॥ 33
యంత్రాలు, తోమరాలు, అమ్ములపొదులూ, పతాకాలతో శోభిల్లే ఆ మహాగజాలు పర్వతాల్లా ప్రకాశితున్నాయి. (33)
శుశుభే కేతుముఖ్యేన పావకేన కలింగకః ।
శ్వేతచ్ఛత్రేణ నిష్కేణ చామరవ్యజనేన చ ॥ 34
ఆ కళింగరాజు ధ్వజం అగ్ని చిహ్నం కలది. అతడు వెల్లగొడుగు, ఆ కళింగ రాజు చామరం, కంఠహారాలతో శోభిస్తున్నాడు. (34)
కేతుమానపి మాతంగం విచిత్రపరమాంకుశమ్ ।
ఆస్థితః సమరే రాజన్ మేఘస్థ ఇవ భానుమాన్ ॥ 35
కేతుమంతుడు కూడ విచిత్రమైన అంకుశంతో ఏనుగుపై కూర్చుండి, మేఘం మీద ఉన్న సూర్యుని వలె శోభిల్లుతున్నాడు. (35)
తేజసా దీప్యమానస్తు వారణోత్తమమాస్థితః ।
భగదత్తో యయౌ రాజా యథా వజ్రధరస్తథా ॥ 36
గజస్కంధగతావాస్తాం భగదత్తేన సమ్మితౌ ।
విందానువిందావంత్యౌ కేతుమంతమనువ్రతౌ ॥ 37
గజరాజు నెక్కి భగదత్తుడు ఇంద్రునివలె తేజస్సుతో ప్రకాశిస్తూ, యుద్ధానికి వెళ్లాడు. అవంతిరాకుమారులు విందాను విందులు భగదత్తునితో సమానులు. వారు ఏనుగుల మూపులపై కూర్చుండి కేతుమంతుని అనుసరించి వెళుతున్నారు. (36,37)
స రథానీకవాన్ వ్యూహః హస్త్యంగో నృపశీర్షవాన్ ।
వాజిపక్షః పతత్యుగ్రః ప్రహసన్ సర్వతోముఖః ॥ 38
రథ సమూహాలతో నిండిన ఆ సేనావ్యూహం అన్ని దిక్కులా వ్యాపించి ఉంది. ఏనుగులు అంగంగా, రాజులు శిరస్సుగాను, గుర్రాలు రెక్కలుగాను ఉన్న ఆ సైన్యం శత్రువులపై భయంకరంగా పడుతుంది. (38)
ద్రోణేన విహితో రాజన్ రాజ్ఞా శాంతనవేన చ ।
తథైవాచార్యపుత్రేణ బాహ్లీకేన కృపేణ చ ॥ 39
రాజా! ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ, బాహ్లీకుడు, కృపుడు ఆ సేనా వ్యూహం నిర్మించారు. (39)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి సైన్యవర్ణనే సప్తదశోఽధ్యాయః ॥ 17 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున సైన్యవర్ణన మను పదునేడవ అధ్యాయము. (17)