18. పదునెనిమిదవ అధ్యాయము

కౌరవసేన కోలాహలము - భీష్మ రక్షకుల పరిచయము.

సంజయ ఉవాచ
తతో ముహూర్తాత్ తుములః శబ్దో హృదయకంపనః ।
అశ్రూయత మహారాజ యోధానాం ప్రయుయుత్సతామ్ ॥ 1
సంజయుడు చెపుతున్నాడు. మహారాజా! తరువాత కొద్దిసేపట్లో యుద్ధ కాంక్షులయిన యోధుల యొక్క కోలాహల శబ్దం హృదయం కంపించేటట్లు వినపడింది. (1)
శంఖదుందుభిఘోషైశ్చ వారణానాం చ బృంహితైః ।
నేమిఘోషై రథానాం చ దీర్యతీవ వసుంధరా ॥ 2
శంఖాలు, దుందుభుల ధ్వనులతోను, ఏనుగుల ఘీంకారాలతోను, రథ చక్రాల ధ్వనులతోను భూమి బ్రద్ధలైపోతున్నట్లనిపించింది. (2)
హయానాం హ్రేషమాణానాం యోధానాం చైవ గర్జతామ్ ।
క్షణేనైవ నభో భూమిః శబ్దేనాపూరితం తదా ॥ 3
సకిలించే గుర్రాలయొక్క, గర్జించే యోధుల యొక్క శబ్దాలతో భూమ్యాకాశాలు క్షణంలో ప్రతిధ్వనించాయి. (3)
పుత్రాణాం తవ దుర్ధర్ష పాండవానాం తథైవ చ ।
సమకంపంత సైన్యాని పరస్పరసమాగమే ॥ 4
దుర్ధర్షా! నీ పుత్రుల యొక్క, పాండవుల యొక్క సైన్యాలు పరస్పరం కలిసికొని కంపించిపోయాయి. (4)
తత్ర నాగా రథాశ్చైవ జాంబూనదవిభూషితాః ।
భ్రాజమానా వ్యదృశ్యంత మేఘా ఇవ సవిద్యుతః ॥ 5
ఏనుగులూ, రథాలూ బంగారు అలంకారాలతో మెఱుపులతో కూడిన మేఘాల వలె ప్రకాశించాయి. (5)
ధ్వజా బహువిధాకారాః తావకానాం నరాధిప ।
కాంచనాంగదినో రేజుః జ్వలితా ఇవ పావకాః ॥ 6
రాజా! నీ సేనలో ధ్వజాలు ఎన్నోరకాల ఆకారాలతో ఉన్నాయి. బంగారు భుజకీర్తులు దాల్చిన సైనికులు ప్రజ్వలించే అగ్నుల వలె ప్రకాశించారు. (6)
స్వేషాం చైవ పరేషాం చ సమదృశ్యంత భారత ।
మహేంద్రకేతవః శుభ్రాః మహేంద్రసదనేష్వివ ॥ 7
భారతా! ఇంద్రభవనాల మీది శుభ్రధ్వజాల వలె నీ సేనలోని ధ్వజాలూ, శత్రుసేనలోని ధ్వజాలు కనిపించాయి. (7)
కాంచనైః కవచైర్వీరాః జ్వలనార్కసమప్రభైః ।
సంనద్ధాః సమదృశ్యంత జ్వలనార్కసమప్రభాః ॥ 8
మండే సూర్యకాంతి గల బంగారు కవచాలు ధరించి, వీరులు యుద్ధ సన్నద్ధులై మండే సూర్యుల వలె కనిపించారు. (8)
కురుయోధవరా రాజన్ విచిత్రాయుధకార్ముకాః ।
ఉద్యతైరాయుధైశ్చిత్రైః తలబద్ధాః పతాకినః ॥ 9
రాజా! కౌరవ యోధులు విచిత్రమైన ఆయుధాలు, దనుస్సులూ ఎత్తిపట్టి, తలత్రాణాలు ధరించి, రథపతాకాలతో శోభిల్లుతున్నారు. (9)
ఋషభాక్షా మహేష్వాసాః చమూముఖగతా బభుః ।
పృష్ఠగోపాస్తు భీష్మస్య పుత్రాస్తవ నరాధిప ।
దుఃశాసనో దుర్విషహః దుర్ముఖో దుఃసహస్తథా ॥ 10
వివింశతిశ్చిత్రసేనః వికర్ణశ్చ మహారథః ।
సత్యవ్రతః పురుమిత్రః జయో భూరిశ్రవాః శలః ॥ 11
రథా వింశతిసాహస్రాః తథైషామనుయాయినః ।
రాజా! ఎద్దుకనుల ధనుర్ధారులు నీ సేన ముందు నిలిచారు. భీష్ముని వెనుక రక్షకులుగా నీ కొడుకులు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, దుస్సహుడు, వివింశతి, చిత్రసేనుడు, వికర్ణుడు, సత్యవ్రతుడు, పురుమిత్రుడు, జయుడు, భూరిశ్రవుడు, శలుడు ఉన్నారు. వారి వెంట ఇరవై వేల రథికులు భీష్ముని రక్షిస్తున్నారు. (10,11 1/2)
అభీషాహాః శూరసేనాః శిబయోఽథ వసాతయః ॥ 12
శాల్వా మత్స్యాస్తథాంబష్ఠ్యాః త్రైగర్తాః కేకయాస్తథా ।
సౌవీరాః కైతవాః ప్రాచ్యాః ప్రతీచ్యోదీచ్యవాసినః ॥ 13
ద్వాదశైతే జనపదాః సర్వే శూరాస్తనుత్యజః ।
మహతా రథవంశేన తే రరక్షుః పితామహమ్ ॥ 14
అభీషాహ, శూరసేన,శిబి, వసాతి, శాల్వ, మత్స్య, అంబష్ఠ, త్రిగర్త, కేకయ, సౌవీర, కైతవులు, ప్రాక్ పశ్చిమ ఉత్తర దేశవాసులు - ఈ పన్నెండు దేశాల వీరులందరూ ప్రాణాలు ఒడ్డి, తమ రథ సైన్యాలతో భీష్ముని రక్షిస్తున్నారు. (12-14)
అనీకం దశసాహస్రం కుంజరాణాం తరస్వినామ్ ।
మాగధో యత్ర నృపతిః తద్రథానీకమన్వయాత్ ॥ 15
ఈ రథ సేనల వెనుక వేగశీలం కల పదివేల ఏనుగులతో మగధరాజు వెంట నడిచాడు. (15)
రథానాం చక్రరక్షాశ్చ పాదరక్షాశ్చ దంతినామ్ ।
అభవన్ వాహినీమధ్యే శతానామయుతాని షట్ ॥ 16
రథాలకు చక్ర రక్షకులు, ఏనుగులకు పాదరక్షకులూ అరవై లక్షల మంది ఆ సైన్యంలో ఉన్నారు. (16)
పాదాతాశ్చాగ్రతోఽగచ్ఛన్ ధనుశ్చర్మాసిపాణయః ।
అనేకశతసాహస్రాః నఖరప్రాసయోధినః ॥ 17
ధనుస్సులు, డాలులు, కత్తులు చేతబట్టి చాలా లక్షలమంది పదాతి సైనికులు ముందు వెడుతున్నారు. వారు నఖరాలతోను, ప్రాసలతోను యుద్ధం చేయగల వీరులు. (17)
అక్షౌహిణ్యో దశైకా చ తవ పుత్రస్య భారత ।
అదృశ్యంత మహారాజ గంగేవ యమునాంతరా ॥ 18
భారతా! ఇలా పది అక్షౌహిణుల కౌరవసేనతో నీ పుత్రుని ఒక అక్షౌహిణి సేన కలిసి, యమునతో కలిసిన గంగానది వలె భాసించింది." (18)
ఇతి శ్రీమహాభారతే భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాపర్వణి సైన్యవర్ణనే అష్టాదశోఽధ్యాయః ॥ 18 ॥
ఇది శ్రీమహాభారతమున భీష్మపర్వమున శ్రీమద్భగవద్గీతా పర్వమను ఉపపర్వమున సైన్య వర్ణనమను పదునెనిమిదవ అధ్యాయము. (18)